Thursday, May 9, 2024
HomeTrending Newsమరమ్మతు పనులకు జీఎస్టీ మినహాయించాలి - హరీశ్‌రావు

మరమ్మతు పనులకు జీఎస్టీ మినహాయించాలి – హరీశ్‌రావు

రాష్ట్రంలో మైనర్‌ ఇరిగేషన్‌ కింద 46వేల జలాశయాలు ఉన్నాయని, వీటి ద్వారా 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఈ ఏటా వీటి నిర్వహణ ఎంతో ముఖ్యమని, మరమ్మతు పనులను జీఎస్టీ నుంచి మినహాయింపునివ్వాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 48వ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్‌లో మంత్రి హరీశ్‌రావు పాల్గొని, తెలంగాణ ప్రభుత్వం తరఫున పలు విజ్ఞప్తులను కౌన్సిల్‌ దృష్టికి తీసుకువచ్చారు.

జీఎస్టీ నుంచి మినహాయింపులు ఇవ్వాలని కోరారు. పీడీఎస్‌ (ప్రజా పంపిణీ వ్యవస్థ) సంబంధిత సేవలైన కస్టమ్ మిల్లింగ్, ట్రాన్స్‌పోర్ట్‌ సేవలకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలన్నారు. పేదలకు అందించే ఈ సేవలపై జీఎస్టీ వేయడంతో రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడుతుందని, అందువల్ల మినహాయింపు ఇవ్వాలని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. బీడీల ఆకుపై పన్ను వేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని, గిరిజన, పేద, మారుమూల ప్రాంతాలకు చెందిన ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఎంతో మంది బీడీలు తయారీ చేస్తూ ఉపాధి పొందుతున్నారన్నారు.

ఇప్పటికే కేంద్రం బీడీలపై 28 శాతం జీఎస్టీ వేయడం జరిగిందన్నారు. గతంలో తాము తీవ్రంగా వ్యతిరేకించామని, బీడీ ముడిసరుకు అయిన ఆకులపై ఇప్పుడు 18 శాతం జీఎస్టీ వేయడం పేదలు, గిరిజనుల ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. టాక్స్ ఇన్ వాయిస్ రూల్స్ సవరణ ప్రపోజల్ స్వాగతిస్తున్నామని, అయితే దీనిపై ఉన్న సంశయాలను కౌన్సిల్ దృష్టికి తెస్తున్నామన్నారు. ముఖ్యంగా టెలికాం సేవలకు సంబంధించి, ట్రాయ్ రూల్స్‌తో కస్టమర్ అడ్రస్, పిన్ నెంబర్ పేటీఎం, మొబి క్విక్, బిల్ డెస్క్ తదితర ఆన్‌లైన్‌ వ్యాపార సంస్థల వద్ద ఉండే అవకాశం ఉండదని, దాంతో వినియోగదారులున్న రాష్ట్రాల ఆదాయం ఇతర రాష్ట్రాలకు వెళ్తుందన్నారు.

దీన్ని దృష్టిలో పెట్టుకొని మార్పు చేయాలన్నారు. అయితే, మైనర్ ఇరిగేషన్, పీడీఎస్‌ సంబంధిత సేవలైన కస్టమ్ మిల్లింగ్, బీడీ ఆకులపై జీఎస్టీ నుంచి మినహాయింపులు ఇవ్వాలన్న తెలంగాణ విజ్ఞప్తిపై జీఎస్టీ పూర్తి పరిశీలన నిమిత్తం ఫిట్‌మెంట్‌ కమిటీకి జీఎస్టీ మండలి సిఫారసు చేసింది. టాక్స్ ఇన్ వాయిస్ రూల్స్ సవరణ అంశంపై తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తిన అంశాలను పరిష్కరిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి వెల్లడించారు. సమావేశంలో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌. కమర్షియల్ టాక్స్ కమిషనర్ నీతూ ప్రసాద్, వాణిజ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్