మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఆగస్టు 22న జరిగింది. ఈ వేడుకల్లో ఆయనకు విషెస్ తెలిపేందుకు తిరుపతి అలిపిరి నుంచి ఒక వీరాభిమాని సైకిల్ యాత్ర చేపట్టి 12 రోజులు ప్రయాణించడం ఆశ్చర్యపరిచింది. ఈ సందర్భంగా చిరంజీవి తనను కలిసేందుకు అభిమానికి అంత శక్తి ఎలా వచ్చిందో అంటూ ఆశ్చర్యపోయారు. ఈ సాహసం సరికాదని వారించారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ… “నా అభిమాని ఎన్. ఈశ్వరయ్య బలుజుపల్లి గ్రామం నుంచి వచ్చాడు. తిరుపతి (అలిపిరి) నుంచి అతడు సైకిల్ పై ప్రయాణం ప్రారంభించాడు. నా పుట్టినరోజు కోసం అతడు సైకిల్ యాత్రను చేపట్టి వచ్చి కలిశాడు. నా ఆరాధ్య దైవం ఆంజనేయ స్వామి మాలను ధరించి స్వామి ఆశీస్సులు మాకు ఉండాలని కోరుకున్నారు”.
“ఆగస్టు 10న బయల్దేరి 12 రోజుల పాటు సైకిల్ యాత్ర చేసుకుంటూ వచ్చాడు. చాలా సందర్భాల్లో చెప్పాను. మాకు అభిమానుల ప్రేమ ఆదరణ గొప్ప ఎనర్జీ. ఇలాంటి అభిమానుల మంచి మనసు ఆశీస్సులతోనే మేం బావుంటాం. వారు మా గురించి ఆలోచించినట్టే మేం కూడా వారు వారి కుటుంబ సభ్యులు బావుండాలని కోరుకుంటూ బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను” అని అన్నారు.
అలాగే పవన్ కల్యాణ్ ని కలవాలని ఉందంటూ ఆ అభిమాని చిరుకి తెలియజేయగా అందుకు తగ్గ ఏర్పాట్లు చేశారు. అలా తన రెండో కోరిక కూడా ఆ అభిమాని తీర్చుకున్నారు. “పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ని కూడా కలిశా… నా ఆనందానికి అవధులు లేవు, నా జన్మ ధన్యమైంది.. పన్నెండు రోజుల సైకిల్ ప్రయాణాన్ని ఒక రోజులో మర్చిపోయేలా చేశారు” అంటూ ఆనందం వ్యక్తం చేశాడు ఈశ్వరయ్య.