కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి శ్రీశైలం శ్రీ భ్రమరాంభ మల్లిఖార్జున స్వామి వార్లను నేడు రెండోరోజు కూడా దర్శించుకున్నారు. రెండ్రోజుల పర్యటన కోసం కుటుంబ సమేతంగా శ్రీశైలం వచ్చిన కిషన్ రెడ్డి స్వామివార్లను దర్శించుకొని అనంతరం గోమాత సేవలో పాల్గొన్నారు. నేడు వినాయక చవితి సందర్భంగా అక్కడ వేంచేసి ఉన్న సాక్షి గణపతి స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కేంద్ర పర్యాటక శాఖ నిధులతో ప్రసాద్ పథకంలో భాగంగా నిర్మిస్తోన్న టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్, యంఫి థియేటర్ నిర్మాణాలను పరిశీలించారు. 2వేల మంది కూర్చునేలా ఏర్పాటు చేస్తోన్న ఈ థియేటర్ దేశంలోనే పెద్దదని పేర్కొన్నారు.
శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని కూడా కిషన్ రెడ్డి సందర్శించారు. శివాజీ కాంస్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.