Friday, April 19, 2024
HomeTrending Newsహైదరాబాద్ కోసమే ఆజామాబాద్ బిల్లు - కేటిఆర్

హైదరాబాద్ కోసమే ఆజామాబాద్ బిల్లు – కేటిఆర్

‘ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా టర్మినేషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ లీజెస్’ సవరణ బిల్లును తెలంగాణ అసెంబ్లీ ఆమోదించింది. మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. బిల్లును ప్రవేశపెట్టే సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ‘‘హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ముషీరాబాద్ నియోజకవర్గం పరిధిలో ఆజామాబాద్ పారిశ్రామిక వాడ ఉంది. ఆ ప్రాంతంలోని కొన్ని స్థలాలను అక్కడ ఉండే సంస్థలకు అప్పటి ప్రభుత్వాలు లీజుకు ఇచ్చాయి. గత 35 ఏళ్లలో ఆజామాబాద్ చుట్టు పక్కల ప్రాంతాల్లో భవనాలు బాగా పెరిగాయి. అర్బనైజేషన్ కూడా పెరిగింది. కొన్ని సంస్థలు మూతపడ్డాయి. అక్కడ ఇప్పటికీ నడుస్తున్న సంస్థల పరిధిలోని ప్రభుత్వ స్థలాలను లీజ్ హోల్డ్ నుంచి ఫ్రీ హోల్డ్ కు మార్చడమే ఈ బిల్లు లక్ష్యం’’ అని వెల్లడించారు.

దీనిపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. పర్మినెంట్ రిజిస్ట్రేషన్ చేయగా మిగిలిన భూములను ఏం చేస్తారని మంత్రి కేటీఆర్ ను ప్రశ్నించారు. కేవలం ధన సమీకరణ కోసమే ఇలా భూములను కన్వర్ట్ చేస్తున్నారనే అపవాదు సర్కారుకు రాకూడదంటే, దానిపై స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు. ఈ ప్రశ్నకు కేటీఆర్ బదులిస్తూ.. ‘‘హైదరాబాద్ లోని కాలుష్య కారక పరిశ్రమలను నగరం అవతలకు తరలించేందుకు సంబంధించిన జీవో నంబర్ 20 ని నాటి కాంగ్రెస్ సర్కారే తీసుకొచ్చింది. దాని ప్రకారమే మేం నడుచుకుంటున్నం. హైదరాబాద్ నగరానికి ఆదాయాన్ని సృష్టించడానికే ఈ బిల్లును ప్రవేశపెడుతున్నాం తప్ప.. వేరే దురుద్దేశం లేదు’’ అని మంత్రి కేటీఆర్ బదులిచ్చారు. అనంతరం ఈ బిల్లును శాసనసభ ఆమోదించింది.
ఈ బిల్లులో ఏముంది ?

ఆజామాబాద్‌‌‌‌ ఇండస్ట్రియల్‌‌‌‌ ఏరియా భూముల అమ్మకం ద్వారా కనీసం రూ.3 వేల కోట్ల ఆదాయం తెచ్చుకోవాలని రాష్ట్ర సర్కారు టార్గెట్‌‌‌‌గా పెట్టుకుంది. ఆజామాబాద్‌‌‌‌ ఇండస్ట్రియల్‌‌‌‌ ఏరియా 136 ఎకరాల్లో విస్తరించి ఉంది. వీఎస్టీ, బయోలాజికల్‌‌‌‌ -ఈతో పాటు పలు సం స్థలు ఇక్కడ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. నగరం నడిబొడ్డున ఉన్న ఈ పరిశ్రమలను ఔటర్‌‌‌‌ రింగ్‌‌‌‌ రోడ్డు అవతలికి తరలించాలని గతంలోనే నిర్ణయించారు. దీంతో సవరణ బిల్లును సభ ముందుకు తెచ్చారు. 1918లో ఆజామాబాద్‌‌‌‌లో అప్పటి హైదరాబాద్‌‌‌‌ సంస్థానం పారిశ్రామికవాడను నెలకొల్పింది. క్రమేణా అక్కడ అనేక పరిశ్రమలు ఏర్పడ్డాయి. 1992లో ఆజామాబాద్‌‌‌‌ ఇండస్ట్రియల్‌‌‌‌ ఏరియా చట్టానికి సవరణ తెచ్చి లీజులు పునరుద్ధరించారు. ఆ లీజుల కాలవ్యవధి కొంతకాలం క్రితం పూర్తయింది.

దీంతో ఇక్కడి పరిశ్రమలను ఓఆర్‌‌‌‌ఆర్‌‌‌‌ అవతలికి తరలించి అక్కడ కొత్తగా స్థలాలు అలాట్‌‌‌‌ చేయనున్నారు. ఇప్పుడు ఆజామాబాద్‌‌‌‌లోని 136 ఎకరాల్లో లీజులు పొంది ఉన్న పారిశ్రామికవేత్తలకే ఆయా స్థలాలపై శాశ్వత హక్కులు కల్పించి రెగ్యులరైజ్‌‌‌‌ చేయనున్నారు. ఎవరైనా స్థలాలు తీసుకునేందుకు వెనుకడుగు వేస్తే వాటిని వేరే వారికి అసైన్‌‌‌‌ చేసే అవకాశమున్నట్టు తెలిసింది. ఆజామాబాద్‌‌‌‌ ఏరియాలో గజం స్థలం ధర రూ.50 వేల నుంచి రూ.1.20 లక్షల వరకు పలుకుతున్నది. గతంలో ఇండస్ట్రీలకు అప్పగించిన భూమిని గంపగుత్తగా ఆయా సంస్థలకే కట్టబెట్టినా సర్కారుకు రూ.3 వేల కోట్ల వరకు ఆదాయం సమకూరే అవకాశముందని అధికారులు చెప్తున్నారు.

Also Read : పెట్రో పన్నులతో మోడీ నయవంచన కేటీఆర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్