Friday, March 20, 2026
HomeTrending Newsబాబు దుష్ప్రచారం: విజయసాయి ధ్వజం

బాబు దుష్ప్రచారం: విజయసాయి ధ్వజం

YSRCP Plenary: విద్య, వైద్యం, సామాజిక న్యాయం, వ్యవసాయం, మహిళా సాధికారత అంశాల్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం దేశంలోని అన్ని రాష్ట్రాలకూ ఆదర్శంగా నిలిచిందని, సంక్షేమంలో కూడా ముందంజలో ఉన్నామని అయితే  చంద్రబాబుకు మాత్రం ఇది భిన్నంగా కనబడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ అనుబంధ సంఘాల ఇన్ ఛార్జ్, ఎంపీ విజయసాయి రెడ్డి  వ్యాఖ్యానించారు.  తాము అధికారంలోకి వచ్చిన తరువాత శాశ్వత ప్రాతిపదికన రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని, నాలుగు లక్షల మందిని వాలంటీర్లుగా నియమించామని గుర్తు చేశారు.  రాష్ట్రంలో ఇప్పటివరకూ ఒక్క ప్రభుత్వ  స్కూల్ కూడా మూసి వేయలేదని, కానీ 8 వేల గ్రామాల్లో స్కూళ్ళు మూసివేశారంటూ చంద్రబాబు ఆరోపించడం దారుణమని ఆయన  మండిపడ్డారు.

పార్టీ ప్లీనరీ  ఏర్పాట్లపై తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలతో సమావేశమైన విజయసాయి అనంతరం వారితో కలిసి మీడియాతో మాట్లాడారు.  మద్యం విషయంలో బాబు ప్రతిరోజూ అబద్ధాలు చెబుతున్నారని, తమ హయాంలో ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదని, బాబు హయంలో 20 డిస్టిలరీ కంపెనీలకు, 254 కొత్త లిక్కర్ బ్రాండ్లకు అనుమతి ఇచ్చారని చెప్పారు.   ఈ ప్రభుత్వానికి మంచిపేరు రాకూడదన్న ఉద్దేశంతో తమ పథకాలపై కేసులు వేసి నిలిపి వేసేందుకు ప్రయతిస్తున్నారని ఆరోపించారు.

వైఎస్సార్సీపీ ప్లీనరీకి తొలిరోజు లక్షన్నర మంది, రెండో రోజు నాలుగు లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నామని విజయసాయి వెల్లడించారు. మూడేళ్ళలో తాము చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్లీనరీలో సమగ్రంగా మాట్లాడతామని, ప్రజలకు వివరిస్తామని చెప్పారు. డ్వాక్రా మహిళలను ప్లీనరీకి రావాల్సిందిగా తాము ఒత్తిడి చేస్తున్నట్లు బాబు చేసిన విమర్శలను విజయసాయి తిప్పికొట్టారు. ఆ అవసరం తమకు లేదని, పార్టీ ప్రతినిధులు మాత్రమే హాజరవుతారని స్పష్టం చేశారు. ప్లీనరీ ఆహారంలో వడ్డించే పదార్ధాలపై కూడా బాబు ఆరోపణలు చేస్తున్నారని, తాము పంది మాంసం పెడుతున్నామని దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్లీనరీ తరువాత రోజు చంద్రబాబు భోరున ఏడవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Also Read : జగన్ కుమార్తెలపై చంద్రబాబు వ్యాఖ్యలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular