ఇళ్ల స్థలాల పంపిణీపై రాష్ట్ర హైకోర్టు తీర్పు దురదృష్టకరమని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం సూచించిన మేరకే నిబంధనలు అమలు చేస్తున్నామని తెలిపారు. విజయనగరంలో అయన మీడియాతో మాట్లాడారు. నిన్నటి తీర్పుపై అప్పీల్ కు వెళతామని ప్రకటించారు.
అందరికీ ఇళ్లు కార్యక్రమంలో 220 చదరపు అడుగుల స్థలం ఇవ్వాలని నిబంధన వుందని, కాని రాష్ట్రంలో పేదలకు 270 చదరపు అడుగుల స్థలాన్నిఇస్తున్నామని బొత్స వివరించారు. రాష్ట్రంలోని నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలన్న ప్రభుత్వ ఉద్దేశ్యాన్ని, స్ఫూర్తిని అర్ధంచేసుకోవాలని న్యాయస్థానాలను అభ్యర్ధిస్తున్నామన్నారు. సాంకేతిక అంశాల ఆధారంగా కాకుండా ఎవరికోసం, ఏ స్ఫూర్తితో చేస్తున్నామో చూడాలని అయన విన్నవించారు.
రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ ఇళ్లు వుండాలనే లక్ష్యంతో ఎంతో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేపట్టారని మంత్రి పేర్కొన్నారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని, ప్రతి అంశాన్ని అమలు చేస్తామని అయన స్పష్టం చేశారు. అధికారం కోల్పోయిన టిడిపి నాయకులు చిన్న చిన్న సాంకేతిక అంశాలను అడ్డు పెట్టుకొని పేదలకు మేలు చేకూర్చే పథకాలు, కార్యక్రమాలపై కేసులు వేసి అడ్డుకోవాలని చూస్తున్నారని బొత్స ఆరోపించారు.
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదని బొత్స అన్నారు. ఆర్ధిక పరిస్థితిని అస్థవ్యస్థం చేసింది ఆయనేనని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో బకాయిలన్నీ పెండింగ్ పెట్టి వేల కోట్ల రూపాయలు చెల్లింపులు చేయకుండా వదిలేశారని, వాటన్నింటినీ ఈ ప్రభుత్వ హయాంలో చెల్లిస్తున్నామని వివరించారు. గతంలో అధిక టారిఫ్లకు విద్యుత్ కొనుగోలు చేయడం వల్లే నేడు విద్యుత్ పంపిణీ సంస్థలు నష్టాల్లో కూరుకున్నాయన్నారు.
నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల పై దాఖలైన పలు పిటిషన్లపై విచారించిన హైకోర్టు ఇళ్ల నిర్మాణం చేపట్టవద్దని నిన్న ఉత్తర్వులు ఇచ్చింది. పట్టణాల్లో సెంటు, గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నర స్థలం సరిపోదని, దీనిపై ప్రత్యేక కమిటీతో అధ్యయనం చేయించాలని ఆదేశించింది. ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాలు ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగిస్తే న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటాయని వ్యాఖ్యానించింది. గృహ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన మూడు జీవోల్లోని నిబంధనలను హైకోర్టు కొట్టివేసింది. సెంటు, సెంటున్నర స్థలాల్లో ఇళ్ళ నిర్మాణం వల్ల ఆరోగ్య సమస్యలు, అగ్ని ప్రమాదాలు, మంచినీటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని అభిప్రాయపడింది. దీనిపై మంత్రి బొత్స స్పందించారు.