Saturday, September 21, 2024
HomeTrending Newsగత ఎన్నికల్లోనే మీ కుర్చీ మడతేశారు: బాబుకు జగన్ కౌంటర్

గత ఎన్నికల్లోనే మీ కుర్చీ మడతేశారు: బాబుకు జగన్ కౌంటర్

ఫ్యాన్‌ ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలని, సైకిల్‌ ఎప్పుడూ బయటే ఉండాలని… తాగేసిన టీ గ్లాసు ఎప్పుడూ సింక్‌లోనే ఉండాలని ఈ విషయాన్ని అక్కచెల్లెమ్మలకు అర్థమయ్యేలా ప్రతిఒక్కరూ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన సిద్ధం బహిరంగసభలో అశేష జన సందోహాన్ని ఉద్దేశించి సిఎం జగన్ ప్రసంగించారు.

కార్యకర్తలకు సిఎం జగన్ చేసిన దిశానిర్దేశంలోని ముఖ్యాంశాలు:

* ఈరోజు రాయలసీమలో సముద్రం కనిపిస్తోంది. జనసముద్రం మధ్యలో జిల్లాల విభజన తర్వాత రాయలసీమకు జలసముద్రం వస్తే ఈరోజు రాప్తాడుకు జనసముద్రం వచ్చింది.
* ఈ జన సముద్రానికి, రాయలసీమ గడ్డకు, ఇక్కడున్న ప్రతి రాయలసీమ బిడ్డకూ మీ జగన్‌ నిండు మనసుతో గుండెల నిండా ప్రేమతో అభివాదం చేస్తున్నాడు.
* ఈ 2024 ఎన్నికల్లో జరగబోతున్న ఈ యుద్ధం రెండు సిద్ధాంతాల మధ్య జరగబోతోంది.
* ఇవి కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకొనే ఎన్నికలుమాత్రమే కావు.
* ఇవి ఇప్పటి వరకు ఈ ఐదేళ్ల కాలంలో ఇంటింటికీ మనందరి ప్రభుత్వం అందించిన సంక్షేమం, అభివృద్ధి ఈ పథకాలన్నీ కొనసాగాలని అడుగులు వేసే మనకు.. ఈ పథకాలన్నీ రద్దు చేయడమే టార్గెట్‌గాపెట్టుకొని డ్రామాలాడుతున్న చంద్రబాబుకు మధ్య జరిగే ఈ యుద్ధంలో మీరు సిద్ధమేనా?
* ఈ యుద్ధం విశ్వసనీయతకు, వంచనకు మధ్య జరగబోతోంది.
* ఇలాంటి యుద్ధంలో పేదవాడి భవిష్యత్‌ కోసం, పేదవాడి తరఫున నిలబడటానికి మీరంతా కూడా సిద్ధమేనా?
* ఈ యుద్ధం వేరే రాష్ట్రంలో ఉంటూ మోసం చేసేందుకు అప్పుడప్పుడూ మన రాష్ట్రానికి వచ్చిపోతున్న నాన్‌ రెసిడెంట్స్‌ ఆంధ్రాస్‌కు, ఈ గడ్డమీదే పుట్టి, ఈ గడ్డమీదే మమకారంతో ఇక్కడే ఇల్లు కట్టుకుని ఇక్కడే ప్రజల మధ్యే ఉన్న మనకూ మధ్య జరగబోతోంది.
* బాబు మోసాల్ని భరించలేకే కదా ఐదేళ్ల క్రితం రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలు, అన్ని ప్రాంతాలూ మొత్తం ప్రజలందరూ కూడా చొక్కా మడతేసి బాబుకున్న కుర్చీల్ని కూడా మడిచి చీపుర్లతో ఊడ్చి వారి పార్టీని శాసనసభలో 102 నుంచి 23కు తగ్గించారు కదా అని అడుగుతున్నా.
* అదే పని మరోసారి చేయడానికి చొక్కాలు మడత వేయడానికి సిద్ధంగా ఉన్నారా?
* నమ్మిన వాడు మునుగుతాడు. నమ్మించిన వాడు దోచుకోగలుగుతాడన్నది బాబు సిద్ధాంతం.
* అవ్వాతాతల చిరునవ్వుల మధ్య వాళ్లందరికీ ఓ మాట చెప్పండి.


* ఫ్యాన్‌ గుర్తుకు ఓటేయడమంటే వారి పిల్లల్ని ఇంటర్నేషనల్‌ స్థాయిలో నిలబెట్టే ప్రభుత్వానికి ఓటేయడం, సైకిల్‌కు ఓటేయడం అంటే గవర్నమెంట్‌ బడుల్లో ఇంగ్లీషు మీడియం రద్దుకు ఓటేస్తున్నాం అని గుర్తుపెట్టుకోవాలని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి.
* ఇవన్నీ కొనసాగాలంటే స్టార్‌ క్యాంపెయినర్లుగా మారి మరో వంద మందికి చెప్పి ఫ్యాన్‌ గుర్తుకు ఓటేయాలని చెప్పండి.
* ప్రజలు మనకు ఫస్ట్‌ టైమ్‌ ఆశీర్వదిస్తేనే దేవుడి దయతో ఇంత మంచిచేయగలిగాం. ఇక ప్రజలు సెకండ్‌ టైమ్‌, థర్డ్‌ టైమ్‌, ఫోర్త్‌ టైమ్‌ ఆశీర్వదిస్తే ఇక ఎంత మంచి జరుగుతుందని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి.
* జగన్‌ తన పాలనలో ప్రజలకు మంచి చేయలేదని చెప్పి చంద్రబాబు నిజంగా నమ్మితే, జగన్‌కు ప్రజాబలం లేదని చంద్రబాబు నమ్మితే మరి చంద్రబాబుకు పొత్తులెందుకు?
* నిజంగా నువ్వు జగన్‌ మంచి చేయలేదని అనుకుంటే మేనిఫెస్టోలో చెప్పినవి చెయ్యలేదని అనుకుంటే, ప్రజా బలం లేదనుకుంటే ఇంత మందితో ఇన్ని పొత్తులు ఎందుకయ్యా చంద్రబాబూ అని అడుగుతున్నా.
* తన నడక కోసం అటో కర్రా, ఇటో కర్ర ఎందుకయ్యా చంద్రబాబూ?
* తన సైకిల్‌ తోయడానికి నీకొక ప్యాకేజీ స్టార్‌ ఎందుకయ్యా?
* మీకు కూడా తెలుసు.. జగన్‌ ప్రతి ఇంటికీ మంచి చేశాడు కాబట్టి, వైయస్సార్‌సీపీ చేసిన మంచి ప్రతి ఇంట్లోనూ బతికి ఉందని తెలుసు.
* ప్రతి గ్రామానికి, ప్రతి సామాజికవర్గానికి, ప్రతి పేదవాడూ జగన్‌ను, వైయస్సార్‌సీపీని గుండెల్లో పెట్టుకున్నాడు కాబట్టే చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
*125సార్లు ఈ 57 నెలల్లో బటన్లు ప్రజల కోసం నేను నొక్కాను. ఏకంగా 2.55 లక్షల కోట్లు నేరుగా బటన్లు నొక్కి నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకు వెళ్లింది. ఇంత మంచి చేసిన మనందరి ప్రభుత్వానికి మద్దతుగా ఈ పాలనకు కొనసాగింపుగా ప్రతి కుటుంబం ప్రతి ఒక్కరూ మంచి భవిష్యత్‌ కోసం రెండు బటన్లు నొక్కాలని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. ఒకటి అసెంబ్లీకి, ఒకటి పార్లమెంటుకు. ఫ్యాన్‌ మీద నొక్కితే మీరు గత ఎన్నికల్లో బటన్‌ నొక్కి పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడద శాశ్వతంగా ఉండదు.
* పొరపాటు చేశారంటే చంద్రముఖి మళ్లీ సైకిలెక్కుతుంది. టీ గ్లాస్‌ పట్టుకొని మీ ఇంటికొస్తుంది. పేదల రక్తం తాగేందుకు లకలకా అంటూ మీ ఇంటి తలుపులు తడుతుందని ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకూ చెప్పండి.
* మీకు మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి అని, మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా, మీరే సైనికులుగా నిలబడండి అని ప్రతి ఇంటికీ వెళ్లి నిబద్ధతతో మనం సిద్ధం అంటుంటే, మరోవంక బాబు పేదల ఇంటికిగానీ, పేదల సామాజికవర్గాలకు గానీ, గ్రామాలకుగానీ, రాష్ట్రానికి గానీ ఏం చేశాడో చెప్పుకొనేందుకు ఒక్కటీ కనిపించని పరిస్థితిలో చంద్రబాబు ఉన్నాడు.
* అటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు తానూ పోస్టర్లు వేయిస్తాడు. సంసిద్ధం, మేమూ సిద్ధం అని వేయిస్తాడు. ప్రజలకు మంచి చేయకుండా దేనికయ్యా సంసిద్ధం? ఎందుకు సంసిద్ధం? ఎవరితో యుద్ధం?
* పెత్తందార్ల తరఫున చంద్రబాబు సంసిద్ధం అంటున్నాడంటే ఎవరితోనయ్యా నువ్వు యుద్ధం చేస్తున్నావు?
* దుష్ట చతుష్టయం బాణాలకు బలి కావడానికి, తలవంచడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు. ఇక్కడ ఉన్నది అర్జునుడు. ఆ అర్జునుడికి తోడు కృష్ణుడి రూపంలో ఉన్న ఇంత మంది.. ఇన్ని లక్షల గుండెలు, కోట్ల గుండెలు ప్రతి పేదవాడి ఇంట్లో తోడుగా ఉండే గుండెలు.
* ప్రజలే అండగా ప్రజలతోనే పొత్తుగా పోరాటానికి మీ బిడ్డ సిద్ధం. మరి మిమ్మల్ని అడుగుతున్నా. మీరంతా సిద్ధమేనా?
* మన పార్టీని, మీ అన్నను అభిమానించే ప్రతి కార్యకర్తకు, నాయకుడికీ, వాలంటీర్‌కు, ఒక్క విషయం చెబుతున్నా. ఇది మీ అందరి పార్టీ.
* ప్రతి ఒక్కరూ ఒక సైన్యంగా పని చేయడానికి, చంద్రబాబు ప్రచారాలు, ఈనాడు రాతలు, ఏబీఎన్‌, టీవీ5, ఎల్లో మీడియా తప్పుడు కథలు, వారి అబద్ధాలు, మోసాలు.. వీటన్నింటిని నుంచి ఇంటింటి అభివృద్ధి, పేదవాడి భవిష్యత్‌ను కాపాడేందుకు మీరంతా సిద్ధమేనా?
* వారి మీడియా, వారి సోషల్‌ మీడియాలో వారు చేసే దుష్ప్రచారాలను తిప్పి కొట్టాలి. దానికి మీరంతా సిద్ధమేనా?
* వారి చీకటి రాతల్ని, చీకటి పనుల్ని బట్టబయలు చేసేందుకు సిద్ధమేనా?
* ప్రతి కార్యకర్త, బూత్‌ కమిటీ సభ్యులుగా, గృహసారథులుగా, వాలంటీర్లుగా మీ పాత్ర అత్యంత కీలకం. సమరభేరి మోగిద్దాం, సమరనాదం వినిపిద్దాం. మరో గొప్ప చారిత్రాత్మక విజయానికి మరో అడుగు వేయడానికి అందరం కూడా సిద్ధమా? అని అడుగుతున్నా.

* ఈ జరగబోయే ఎన్నికలు అత్యంత కీలకమైన ఎన్నికలు. ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు వయసు ఇప్పటికే 75. ఆయన వయసు 80కి పోతుంది. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇక తెలుగుదేశం పార్టీ రూపురేఖలు కూడా ఎక్కడా కనిపించవు.
* ఈ ఎన్నికలు ఆశామాషీ ఎన్నికలు కాదు. ఈ ఎన్నికల్లో మనం వేసే ఓటు రేప్పొద్దున పేదవాడి భవిష్యత్‌ను, జీవితాన్ని నిర్ణయించే ఓటు అవుతుంది.
* పొరపాటు జరిగిందంటే పేదవాడి బతుకులు అతలాకుతలం అవుతాయి.
* పేదవాడి భవిష్యత్‌ మారాలంటే, పేదవాడి పిల్లాడు రేప్పొద్దున 10-15 సంవత్సరాలకు అనర్గళంగా ఇంగ్లీషులో మాట్లాడుతూ, పెత్తందార్లతో పోటీ పడుతూ పెద్ద కంపెనీలతో ఉద్యోగాలు సంపాదించుకోవాలంటే జరగబోయేఎన్నికలు అత్యంత కీలకం.
* పేదవాడి ప్రతి గుండె ఏకం కావాలి. పెత్తందార్ల పార్టీలను పూర్తిగా నాశనం చేసే పరిస్థితి రావాలి.
* దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు మంచి చేస్తున్న మనందరి ప్రభుత్వానికి కలకాలం ఉండాలని, మరో అవకాశం మనందరి ప్రభుత్వానికి నిండు మనసుతో దేవుడు ఆశీర్వదించి ఇవ్వాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్