Thursday, April 18, 2024
HomeTrending Newsచిరాగ్ పాశ్వాన్ ‘ఆశీర్వాద్ యాత్ర’

చిరాగ్ పాశ్వాన్ ‘ఆశీర్వాద్ యాత్ర’

లోక్ జనశక్తి పార్టీలో తలెత్తిన విభేదాలు, బాబాయి ఇచ్చిన షాక్ నుంచి యువనేత చిరాగ్ పాశ్వాన్ ఇంకా కోలుకున్నట్లు లేరు. సొంత మనుషులే  మోసం చేశారని నిర్వేదం వ్యక్తం చేశాడు. జూలై 5న దివంగత నేత రామ్ విలాస్ పాశ్వాన్ పుట్టిన రోజు, ఈ సందర్భంగా తండ్రికి నివాళులర్పించి ‘ఆశీర్వాద్ యాత్ర’ పేరుతో రాష్ట్ర వ్యాప్త పర్యటన చేస్తున్నట్లు చిరాగ్ ప్రకటించాడు.  హాజీపూర్ తన తండ్రి కర్మభూమి అని అందుకే ఇక్కడినుంచే యాత్ర మొదలు పెడుతున్నానని, బీహార్ లోని ప్రతి జిల్లలో యాత్ర కొనసాగుతుందని  చిరాగ్ వెల్లడించాడు.

కేవలం ప్రజల ఆశీర్వాదాలు పొందడం కోసమే యాత్ర చేస్తున్నానని, ఏ ఒక్కరికో సత్తా చూపే ఉద్దేశ్యం తనకు లేదని, తన సొంత మనుషులే మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. కేవలం బీహార్ ప్రజల మద్దతు మాత్రమే తనకు కావాలని స్పష్టం చేశాడు. ఈ రోజు తన తండ్రిని స్మరించుకునేందుకు నేను, నా తల్లి మాత్రమే ఇక్కడకు వచ్చామని, కావాల్సిన వారు ఎవరూ రాలేదని బాబాయిని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించాడు. ‘పాశ్వాన్’ పేరుతో ఒక పుస్తకాన్ని ఢిల్లీలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిరాగ్ భావోద్వేగానికి లోనయ్యాడు, వెంటనే తేరుకొని తానొక సింహం బిడ్డనని ఎంతమంది నన్ను రాజకీయంగా వేధింపులకు  గురిచేసినా బెదిరే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడు.

రాం విలాస్ పాశ్వాన్ మరణం అనంతరం ఎల్జేపీ నాయకత్వం అంశంలో విభేదాలు తలెత్తాయి,  చిరాగ్ స్థానంలో రాం విలాస్ సోదరుడు పశుపతి కుమార్ పరాస్ ను లోక్ సభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. మొత్తం ఆరుగురు లోక్ సభ సభ్యుల్లో ఐదుగురు పరాస్ కు మద్దతు పలికారు.  లోక్ సభ సచివాలయం సోమవారం విడుదల చేసిన పార్లమెంటరీ పార్టీ నేతల జాబితాలో  పరాస్ పేరు ఉంది. జూన్ లో చిరాగ్ ను పార్టీ జాతీయ అధ్యక్షుడిగా తొలగించి ఆ స్థానంలోనూ పశుపతి పరాస్ ను ఎన్నుకున్నారు.  ఈ పరిణామాల నేపధ్యంలో చిరాగ్ యాత్ర రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్