Monday, September 23, 2024
Homeసినిమాదటీజ్ మెగాస్టార్

దటీజ్ మెగాస్టార్

చిరంజీవి అంటే.. అభిమానులకు ప్రాణం కంటే ఎక్కువనే చెప్పాలి. మిగతా హీరోలకు అభిమానులు ఉంటారేమో కానీ ఒకరకంగా మెగాస్టార్ కు వీరాభిమానులు ఉంటారు. అభిమానులు తనను ఎంతలా అభిమానిస్తారో, అభిమానులను కూడా చిరంజీవి అంతేలా ప్రేమిస్తారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన అభిమాని విషయంలో చేసిన ఒక పని ఇప్పుడు మెగా అభిమానులనే కాక తెలుగు ప్రేక్షకులకు కూడా మనసుకు హత్తుకునేలా చేసింది.

మెగాస్టార్ వీరాభిమాని, విశాఖపట్నానికి చెందిన వెంకట్ కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. చిరంజీవి గారిని కలవాలని, వారితో మాట్లాడాలనే కోరికను వెంకట్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘నా ఆరోగ్యం అంతగా బాగుండడం లేదు, నేను మిమ్మల్ని కలవాలని కోరుకుంటున్నాను’ అని అభ్యర్థించారు. దీనిపై వెంటనే స్పందించిన చిరు అతని ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. తనను వచ్చి కలవాల్సిందిగా సూచించారు. అనారోగ్యం కారణంగా కదిలే పరిస్థితి కూడా లేకపోవడంతో వెంకట్ దంపతులకు చిరంజీవి విశాఖపట్నం నుంచి హైదరాబాదుకు ఫ్లైట్ టికెట్స్ ఎరేంజ్ చేసి మరీ వారిని హైదరాబాద్ రప్పించుకున్నారు.

శనివారం వారిద్దరితో దాదాపు 45 నిమిషాలపాటు గడిపారు చిరంజీవి. వెంకట్ అనారోగ్యంపై ఆరా తీశారు.  చెకప్ కోసం హైదరాబాద్ ఒమేగా హాస్పిటల్స్ లో పంపించారు. డాక్టర్లతో స్వయంగా మాట్లాడిన చిరంజీవి పరిస్థితి అడిగి తెల్సుకున్నారు.  విశాఖపట్నంలోని హాస్పిటల్ లోనే వెంకట్ ను చేర్పించి వైద్యానికయ్యే ఖర్చులు తానే చూసుకుంటానని చిరంజీవి హామీ ఇచ్చారు. తన వీరాభిమానిని కాపాడుకోవడానికి వెనుకాడేది లేదని చిరు భరోసా ఇచ్చారు.

తమ తోటి అభిమాని వెంకట్ అనారోగ్యం నుంచి కోలుకుని తిరిగి మామూలు మనిషి అవ్వాలని మెగాభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్