Sunday, June 14, 2026
HomeTrending NewsKarnataka: మల్లికార్జున ఖర్గే హత్యకు కుట్ర - కాంగ్రెస్

Karnataka: మల్లికార్జున ఖర్గే హత్యకు కుట్ర – కాంగ్రెస్

కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను హత్య చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా ఆరోపించారు. ఈ మేరకు బీజేపీ నేత, చిత్తాపూర్‌ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి మణికంఠ్‌ రాథోడ్‌ మాట్లాడిన ఆడియో క్లిప్‌ తమకు లభించిందని అన్నారు.  కాంగ్రెస్‌పై ప్రజలు చూపిస్తున్న అభిమానాన్ని తట్టుకోలేకే బీజేపీ నేతలు ఇలాంటి కుట్రలు  చేస్తున్నారని సుర్జేవాలా మండిపడ్డారు.

‘కన్నడ ప్రజలు కాంగ్రెస్‌ను ఎంతో అభిమానిస్తున్నారు. బీజేపీపై ఆగ్రహంతో ఉన్నారు. ప్రజలు బీజేపీకి ఓటు వేసే అవకాశాలు కనిపించడం లేదు. ఇది చూసి బీజేపీ అసహనానికి గురవుతోంది. అందుకే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హత్యకు ప్లాన్ చేస్తోంది. ఖర్గేతో పాటు ఆయన కుటుంబాన్ని కూడా హతమార్చేందుకు కుట్ర పన్నుతోంది. ఓటమిని ఎదుర్కోలేకే బీజేపీ ఇంతకు దిగజారుతోంది’ అంటూ రణ్‌దీప్‌ సుర్జేవాలా ఆరోపించారు.

‘చిత్తాపూర్‌ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి మణికంఠ్‌ రాథోడ్‌.. ఖర్గే హత్యకు ప్లాన్‌ చేస్తున్నాడు. ఇందుకు సంబంధించి ఆడియో క్లిప్‌ మాకు లభించింది. ప్రధాని మోదీ, సీఎం బొమ్మై ఇద్దరూ కలిసి ఈ వ్యక్తిని హత్యకు పురమాయించారు. మణికంఠ్‌ రాథోడ్‌పై 40 క్రిమినల్‌ కేసులున్నాయి. 40 శాతం కమిషన్‌ ప్రభుత్వం ఇలా దిగజారుతోంది. ఇది కేవలం ఖర్గేపై చేసే దాడి మాత్రమే కాదు. మొత్తం కన్నడ ప్రజలపై జరగనున్న దాడి’ అని కాంగ్రెస్‌ ఆరోపించింది. ఈ మేరకు ఖర్గే హత్యకు ప్లాన్‌ చేస్తున్నట్టుగా ఉన్న బీజేపీ నేత కాల్‌ రికార్డింగ్‌ని తన అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో పోస్టు చేసింది. చిత్తాపూర్ నియోజకవర్గ ప్రతినిధి మణికంఠ్ రాథోడ్ ఇదంతా ప్లాన్ చేస్తున్నట్టు వెల్లడించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular