Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇళ్ళ నిర్మాణ ప్రక్రియలో ప్రతి అంశంపై పూర్తి స్థాయిలో దృష్టిపెట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.  నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండొద్దని, డ్రైనేజి, కరెంటు, నీటి సరఫరా అంశాలపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. ఇళ్లలో పెట్టే ఫ్యాన్లు, బల్బులు, ట్యూబ్‌లైట్ల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. జగనన్న కాలనీల రూపంలో కొన్నిచోట్ల ఏకంగా మున్సిపాల్టీలే తయారవు తున్నాయని,  ఇలాంటి చోట్ల డ్రెయిన్లు సహా మౌలిక సదుపాయాల కల్పన, పౌరసేవలపై ప్రత్యేక ప్రణాళిక ఉండాలని చెప్పారు. లబ్ధిదారునికి ఎక్కడ ఇంటి స్థలం ఎక్కడ ఇచ్చామో చూపడమే కాకుండా 90 రోజుల్లో పట్టాలు పంపిణీకి కూడా చర్యలు తీసుకోవాలన్నారు.

ఆప్షన్‌-3 ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతోందని అధికారులు సిఎంకు వివరించారు.  ఇంకా ఎక్కడైనా అవసరాలు ఉంటే దానికి అగుణంగా తాజాగా పనులు మంజూరుచేసి పూర్తిచేస్తున్నామని వివరణ ఇచ్చారు. గత సమావేశంలో ఇచ్చిన ఆదేశాల మేరకు ఇంకా అవసరమైన చోట ల్యాండ్‌ లెవలింగ్, ఫిల్లింగ్, అంతర్గత రోడ్లు, గోడౌన్ల నిర్మాణ పనులను వేగంగా పూర్తిచేస్తున్నామని తెలిపారు.  ఇళ్ళ నిర్మాణంలో  ఆప్షన్‌-3 ఎంచుకున్న లబ్ధిదారులకు సత్వరమే వారి ఇంటి నిర్మాణం పూర్తిచేయడానికి నిర్దేశించుకున్న ఎస్‌ఓపీని పాటించాలని ఈ సందర్భంగా అధికారులకు సిఎం జగన్ సూచించారు.

ఇళ్ల నిర్మాణానికి అవసరమైన వనరులన్నీ కాలనీల్లో ఉన్నాయా?లేదా?  ఇటుకల తయారీ యూనిట్లను కాలనీలకు సమీపంలోనే పెట్టుకున్నారా? లేదా? అనే అంశాలపై కూడా దృష్టి పెట్టాలన్నారు. గోడౌన్లు తదితర కనీస అవసరాలను సమకూర్చుకుని ఇళ్లనిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు.  ఈ నెలాఖరులోగా కోర్టు కేసుల వివాదాల్లోని ఇళ్లపట్టాలపై స్పష్టత కోసం ప్రయత్నించాలని, ఆగస్టు మొదటివారంలో ప్రత్యామ్నాయ ప్రణాళికతో సిద్ధంకావాలని అధికారులను సిఎం  ఆదేశించారు.

సమావేశంలో రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్,  ఏపీఎస్‌హెచ్‌సీఎల్‌ ఛైర్మన్‌ దవులూరి దొరబాబు, సీఎస్‌ సమీర్‌ శర్మ, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మి, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ కమిషనర్‌ జి సాయి ప్రసాద్, గృహనిర్మాణశాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్‌ ఏపీఎస్‌హెచ్‌సీఎల్‌ ఎండీ నారాయణ భరత్‌ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com