Friday, September 20, 2024
HomeTrending NewsEdX: ఉన్నత విద్యలో ఇదో గేమ్ ఛేంజర్‌: సిఎం జగన్

EdX: ఉన్నత విద్యలో ఇదో గేమ్ ఛేంజర్‌: సిఎం జగన్

ఎడెక్స్ కంపెనీతో నేడు కుదుర్చుకున్న ఒప్పందం రాష్ట్ర ఉన్నత విద్య లో గేమ్‌ ఛేంజర్‌గా నిలుస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.  ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్ధులకు ప్రపంచ ప్రఖ్యాత యూనివర్శిటీల కోర్సులను నేర్చుకునే అవకాశం  కలుగుతుందని, అనతరం హార్వర్డ్‌, ఎంఐటీ, క్రేంబ్రిడ్జి, ఆక్స్‌ఫర్డ్‌ లాంటి యూనివర్శిటీలతో ఎడెక్స్‌ సంయుక్త సర్టిఫికేషన్‌ విద్యార్థులకు లభిస్తుందని, నిరుపేద విద్యార్థులకు ఈ ఒప్పందంతో  మరింత మేలు జరుగుతుందని వెల్లడించారు. తాడేపల్లిలోని  సిఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రఖ్యాత మాసివ్‌ ఓపెన్‌ ఆన్లైన్‌ కోర్సులు కంపెనీ (MOOC) ఎడెక్స్‌తో రాష్ట్ర ప్రభుత్వం అవగాహనా ఒప్పందం  కుదుర్చుకుంది.  ఉన్నతవిద్యలో ప్రపంచస్థాయి కోర్సులు అభ్యసించే విద్యార్ధులకు ఇది ఎంతగానో తోడ్పడుతుంది.  విద్యారంగంలో మరో విప్లవాత్మక మార్పులకు ఇది శ్రీకారం చుడుతుందన్నారు.

ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ….

???? విదేశాలకు వెళ్లి చదువుకోవడం అన్నది చాలామంది విద్యార్థులకు గగనమైన విషయం, అలాంటిది ఆయా యూనివర్శిటీల కోర్సులను, అందులోనూ ప్రపంచ ప్రసిద్ధిచెందిన యూనివర్శిటీలు రూపొందించిన కోర్సులను సులభంగా నేర్చుకునే అవకాశం దీని ద్వారా లభిస్తుంది

???? ప్రపంచంలో అనూహ్యంగా వస్తున్న శాస్త్ర, సాంకేతిక, సామాజిక , సాంఘిక శాస్త్రాలకు సంబంధించిన మార్పులపై ఉన్న వివిధ రకాల సబ్జెక్టులు, ఈ ఒప్పందం ద్వారా రాష్ట్రంలో ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి

???? మన దేశంలో లభ్యంకాని ఎన్నోకోర్సులను కూడా నేర్చుకునే అవకాశం వస్తుంది

???? అలాగే వివిధ కోర్సులకు అందుబాటులోలేని బోధనా సిబ్బంది కొరతను కూడా దీనిద్వారా అధిగమించినట్టు అవుతుంది

???? ఉన్నత విద్యలో ఇది గేమ్‌ఛేంజర్‌గా ఉంటుంది

???? ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ లాంటి కోర్సులే కాదు, ఆర్ట్స్‌, కామర్స్‌లో పలురకాల సబ్జెక్టులకు చెందిన కోర్సులు… ఈ ఒప్పందం ద్వారా విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి

???? ఉన్నత విద్యలో గొప్ప మార్పులకు ఇది దారితీస్తుంది

???? దీంతోపాటు ఉన్నత విద్యలో సిలబస్‌ను పూర్తిస్థాయిలో పునఃపరిశీలన చేయాల్సి ఉంది

???? ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ సహా ఆర్ట్స్‌, కామర్స్‌ తదితర కోర్సులన్నింటినీ కూడా రీ డిజైన్‌ చేయాలి

???? ఆధునికతను అందిపుచ్చుకోవడం, నాణ్యమైన విద్యను అందచేయడం లక్ష్యంగా ఈ కోర్సులను తీర్చిదిద్దాలి

???? ఈ కోర్సులకు వర్టికల్స్‌ కూడా ఉండాలి. విద్యార్థి తనకు కావాల్సిన దాన్ని ఎంపిక చేసుకుని చదువుకునే అవకాశం ఉండాలి

???? దీనికోసం ఇప్పుడున్న ప్రతికోర్సులనూ, అందులో ప్రస్తుతం ఉన్న సబ్జెక్టులను పూర్తిగా పరిశీలించాలి. దీనికోసం ఒక బోర్డును ఏర్పాటు చేయాలి

???? అంతిమంగా మంచి ఉపాధి, ఉద్యోగావకాశాలు రాష్ట్ర విద్యార్థులకు దక్కాలి

ఒప్పందంపై ఎడెక్స్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ, పద్మశ్రీ అవార్డు గ్రహీత అనంత్‌ అగర్వాల్‌, ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జె శ్యామలరావు సంతకాలు చేశారు.

ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్‌,  ఎడెక్స్ ప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్