పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు యువ న్యాయవాదులను మరింత ప్రోత్సహించేందుకు జగన్ ప్రభుత్వం అందిస్తున్న కానుక వైఎస్సార్ లా నేస్తం. వరుసగా నాలుగో ఏడాది ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం నేడు అమలు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 2,011 మంది అర్హులైన జూనియర్ న్యాయవాదుల ఖాతాల్లో రూ. 1,00,55,000 ను నేడు క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి సిఎం జగన్ విడుదల చేశారు.
కొత్తగా లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువ లాయర్లు వృత్తిలో నిలదొక్కుకునేందుకు మూడు సంవత్సరాల పాటు నెలకు రూ. 5,000 చొప్పున ఆర్ధిక సాయం అందించేలా ఈ పథకానికి రూపకల్పన చేశారు. నేడుఅందించిన సాయంతో కలిపి ఇప్పటివరకు 4,248 మంది న్యాయవాదులకు మూడున్నరేళ్ళలో ఖర్చుచేసిన మొత్తం ఆర్ధిక సాయం రూ. 35.40 కోట్లు అని ప్రభుత్వం వెల్లడించింది.
న్యాయవాదుల సంక్షేమం కోసం రూ. 100 కోట్ల కార్పస్ ఫండ్తో అడ్వకేట్ జనరల్ ఆధ్వర్యంలో లా, ఫైనాన్స్ సెక్రటరీలు సభ్యులుగా అడ్వకేట్ వెల్ఫేర్ ట్రస్ట్ ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కోవిడ్ నేపధ్యంలో ట్రస్ట్ నుంచి న్యాయవాదుల అత్యవసరాలకు రూ. 25 కోట్ల సాయం కూడా దీనినుంచి విడుదల చేశారు. అర్హులైన న్యాయవాదులకు లోన్లు, మేజర్ ఆపరేషన్లు, ఇన్సూరెన్స్ వంటి అత్యవసరాలకు ఈ నిధి నుంచి ఆర్ధిక సాయం అందించారు. ఇక నుంచి ప్రతి ఆరు నెలలకోసారి లబ్ధి అందించేలా పథకంలో మార్పులు చేశారు. పథకానికి అప్లై చేసుకోదలిచిన వారు వైఎస్ఆర్లానేస్తం.ఏపి.జీవోవి.ఇన్ వెబ్సైట్లో తమ పేరును నమోదు చేసుకుని బ్యాంక్ అకౌంట్, ఆధార్ నెంబర్ను పొందుపరిచి సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయాలని ప్రభుత్వం సూచించింది