Saturday, July 27, 2024
HomeTrending Newsగల్వాన్ అమరులకు బాసటగా తెలంగాణ

గల్వాన్ అమరులకు బాసటగా తెలంగాణ

గల్వాన్ వద్ద చైనా సైనికులతో జరిగిన ఘర్షణల్లో వీర మరణం పొందిన భారత సైనికులు సునీల్ కుమార్, కుందన్ కుమార్, అమన్ కుమార్, చందన్ కుమార్, జయ్ కిషోర్ కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్ధిక సాయాన్ని సీఎం కే చంద్రశేఖర్‌ రావు అందించారు. హైదరాబాద్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఆర్ధిక సాయాన్ని చెక్కుల రూపంలో బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌, ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌తో కలిసి తెలంగాణ సీఎం కేసీఆర్‌ అందజేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్‌ రావు ప్రసంగిస్తూ.. భారతీయ ప్రాచీన చరిత్ర నుంచి నేటి వరకు నలంద విశ్వవిద్యాలయం పేరు వింటేనే యావత్ దేశం పులకించి పోతుందన్నారు. దక్షిణ గంగగా పిలిచే గోదావరి ప్రవాహ సదృశ్యంగా బిహార్‌తో తెలంగాణకు అవినాభావ సంబంధం ఉన్నదని చెప్పారు. దేశ రక్షణ కోసం పోరాడుతూ గల్వాన్ లోయలో అమరులైన వీర సైనికుల త్యాగం ఎంతో గొప్పదని శ్లాఘించారు. వీర సైనిక కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పేందుకే ఇక్కడి వచ్చామని వెల్లడించారు. అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేయడం మన బాధ్యత అని చెప్పారు. ఇదే సమయంలో తెలంగాణా వికాసంలో భాగస్వామ్యం అవుతున్న బీహార్ బంధువులు ఎంతో మంది ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఘటనలో దురదృష్టవశాత్తు మరణించారని విచారం వ్యక్తం చేశారు. వీరి కుటుంబాలకు కూడా తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం కేసీఆర్‌ చెప్పారు. తెలంగాణకు వస్తున్న వలస కూలీలను తెలంగాణ ప్రగతి ప్రతినిధులుగా పేర్కొన్న సీఎం కేసీఆర్‌.. కరోనా సమయంలో వారు ఇబ్బంది పడకుండా దగ్గరుండి మరీ ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రసంగం – ముఖ్యాంశాలు:

గాల్వన్ లోయలో అసువులు బాసిన అమర సైనికుల కుటుంబాలకు, హైదరాబాద్ దుర్ఘటనలో మరణించిన కార్మికుల కుటుంబాలకు ప్రణామాలు. అమరులైన సైనికుల కుటుంబాలకు సహాయం చేయాలని ఎంతో కాలంగా హృదయం భారంగా ఉండేది. అందుకే పాట్నాకు వచ్చి ఈ పవిత్ర భూమి కి చెందిన అమరులైన సైనికులకు మా వంతు సహాయం చేస్తున్నాం.  కోల్పోయిన ప్రాణాలను మేము తిరిగి తీసుకురాలేం. అమరులైన సైనికుల కుటుంబాలకు యావత్ దేశం అండగా ఉండాలనే సందేశం అందరికీ చేరాలి. దీంతో సైనికులకు, దేశ రక్షణ దళాలకు ఆత్మస్థైర్యం పెరుగుతుంది.
తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో అభివృద్ధి బాటలో సాగుతున్న యువ రాష్ట్రం. ఈ రాష్ట్రాభివృద్ధిలో బీహార్ కు చెందిన వేలమంది శ్రామికులు భాగస్వామ్యాన్ని అందిస్తున్నారు. వీరు ఎన్నో రంగాల్లో పని చేస్తున్నారు.
గొప్ప ప్రభుత్వంగా చెప్పుకునే కేంద్ర ప్రభుత్వం కరోనా సమయంలో ప్రత్యేక రైళ్ళను నడపాలని కోరినా పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్రానికి వలస వచ్చిన బీహార్ రాష్ట్రం వారైనా, వేరే రాష్ట్రం వారైనా…. వారిని తెలంగాణ ప్రతినిధులుగా భావిస్తున్నామని నేను ఆ సమయంలో చెప్పాను. అందుకే వారి కష్టసుఖాల్లో పాలుపంచుకున్నాము. కరోనా సమయంలో ప్రత్యేక రైళ్ళను ఏర్పాటు చేసి ఎంతోమంది కార్మికులు, శ్రామికులను వారివారి రాష్ట్రాలకు తరలించాం. పని కోసం తెలంగాణకు వలస వచ్చిన వారందరికి మా రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం ఉందని మేమ భావిస్తున్నాం. మేము గోదావరి నది ఒడ్డు నుండి గంగా నది ఒడ్డుకు వచ్చాం. గంగా నదిని పవిత్రనదిని భావించనట్లుగానే తెలంగాణలో గోదావరి నదిని దక్షిణ గంగగా భావిస్తాం.
జయ ప్రకాశ్ నారాయణ్ జన్మించిన పవిత్ర భూమి బీహార్. బీహార్ ప్రజల చైతన్యంతో ప్రారంభమైన ప్రతీ మార్పు ఈ దేశంలో శాంతికి దారి తీసింది. బీహార్ లోని నలంద విశ్వవిద్యాలయం ఎంతో చారిత్రకమైంది. ఇక్కడికి వచ్చి ఈ పవిత్రమైన కార్యక్రమంలో పాలుపంచుకున్నందుకు సంతోషంగా ఉంది.

Also Read : దేశ చరిత్రలో ఒకే ఒక్కడు కేసీఆర్ – నితీష్ కుమార్

RELATED ARTICLES

Most Popular

న్యూస్