Saturday, July 27, 2024
HomeTrending Newsప్రతి తరగతిలో ఇంటరాక్టివ్‌ డిస్‌ప్లేలు:సిఎం

ప్రతి తరగతిలో ఇంటరాక్టివ్‌ డిస్‌ప్లేలు:సిఎం

ప్రభుత్వ పాఠశాలల్లో అత్యాధునిక సాంకేతికతతో  ఉపకరణాలను ఏర్పాటు చేస్తున్నందున భద్రతదృష్ట్యా తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు.  సీసీ కెమెరాలు ఏర్పాటుపై ఆలోచన చేయాలని సూచించారు. రెండోదశ నాడు – నేడు పనులను వేగవంతం చేయాలని,  ఎస్‌డీజీ లక్ష్యాలను చేరుకునే ప్రక్రియలో భాగంగా విద్యా వ్యవస్థలో చేపడుతున్న కార్యక్రమాలకు సంబంధించిన డేటా  నిరంతరం అప్‌లోడ్‌ అయ్యేలా చూడాలని స్పష్టం చేశారు.  తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో విద్యాశాఖపై సిఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. స్కూళ్ళలో ఏర్పాటు చేయ తలపెట్టిన డిజిటల్‌ డిస్‌ప్లేలకు సంబంధించి వివిధ కంపెనీల ఉపకరణాలను మంత్రి బొత్సతో కలిసి సిఎం పరిశీలించారు.

సమీక్ష సందర్భంగా సిఎం మాట్లాడుతూ…

  • ప్రతి తరగతి గదిలోనూ ‘డిజిటల్‌’ బోధనకు  సంబంధించి ఎస్‌ఓపీలను రూపొందించాలి, జిల్లా స్దాయిలో కలెక్టర్లు కూడా సమీక్షించాలి
  • టీఎంఎఫ్, ఎస్‌ఎంఎఫ్‌లను సమర్థవంతంగా వినియోగించుకుని స్కూళ్ల నిర్వహణను పటిష్టం చేయాలి
  • విద్యార్థులకు సబ్జెక్టులు మరింత నిశితంగా అర్థం అయ్యేలా బోధించేందుకు ప్రతి తరగతిలో ఇంటరాక్టివ్‌ డిస్‌ప్లేలు లేదా ప్రొజెక్టర్లు పెట్టాలి
  • తరగతి గదుల్లో పెట్టే ప్రొజెక్టర్‌లు, ఇంటరాక్టివ్‌ టీవీలు నాణ్యతతో ఉండాలి
  • అన్ని హైస్కూళ్లలోనూ, నాడు –నేడు పూర్తిచేసుకున్న స్కూళ్లలో మొదటి దశ కింద ఏర్పాటు చేయాలన్న సీఎం.
  • స్మార్ట్‌ బోధన సదుపాయాల వల్ల ఇటు పిల్లలకూ, అటు ఉపాధ్యాయులకూ మేలు జరుగుతుంది
  • పీపీ –1 నుంచి రెండో తరగతి వరకూ స్మార్ట్‌ టీవీలు, 3వ తరగతి ఆపైన ప్రొజెక్టర్‌లు పెట్టేలా ఆలోచన చేయాలి
  • వచ్చేవారం నాటికి దీనిపై కార్యాచరణ సిద్ధంచేయాలన్న సీఎం.
  • 8వ తరగతి విద్యార్థులకు అందించే ట్యాబ్‌లన్నీ నాణ్యంగా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి
  • ఈ ట్యాబ్‌ల్లోకి కంటెంట్‌ లోడ్‌ చేయనున్న బైజూస్‌
  • వచ్చే ఏడాదికి విద్యాకానుకకు సంబంధించి ఇప్పటినుంచే సన్నద్ధం కావాలి
  • విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని, ప్రతి స్థాయిలో కూడా పర్యవేక్షణ కూడా అంతే బలంగా ఉండాలి

  • విద్యాశాఖలో డీఈఓ, ఎంఈఓ సహా వివిధ స్థాయిల్లో పర్యవేక్షణ బాధ్యతలున్న పోస్టులను వెంటనే భర్తీచేయాలి
  • ఎస్‌సీఈఆర్టీ, డైట్‌ సీనియర్‌ లెక్చరర్స్, డైట్‌ లెక్చరర్స్‌ పోస్టుల భర్తీపైనా దృష్టిపెట్టాలి
  • హాస్టళ్లలో కూడా నాడు – నేడు పనులను రెండోదశ కింద చేపట్టాలి
  • నాడు నేడు రెండోదశ కింద 22,344 స్కూళ్లలో చేపడుతున్న  పనుల ప్రగతిని వివరించిన అధికారులు.

ఈ  సమావేశానికి విద్యాశాఖమంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ సమీర్‌ శర్మ, పాఠశాల విద్యాశాఖ స్పెషల్‌ సీఎస్‌ బుడితి రాజశేఖర్, విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌ సురేష్‌ కుమార్, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్‌ గుల్జార్, పాఠశాల విద్యాశాఖ సలహాదారు ఎ మురళీ, ఏపీ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేటరీ అండ్‌ మానిటరింగ్‌ కమిషన్‌ కార్యదర్శి ఏ సాంబశివారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Also Read : బైజూస్ తో ఒప్పందం : ప్రభుత్వ స్కూళ్ళలో ఎడ్యు-టెక్

RELATED ARTICLES

Most Popular

న్యూస్