Monday, May 20, 2024
HomeTrending Newsఐదు ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు గ్రీన్ సిగ్నల్

ఐదు ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు గ్రీన్ సిగ్నల్

Recruitment Board : ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్ లో సమావేశమైన రాష్ట్ర మంత్రిమండలి పలు నిర్ణయాలు తీసుకున్నది. ఆదివాసి, గిరిజన ప్రాంతాలైన ఆసిఫాబాద్, సారపాక, భద్రాచలం గ్రామపంచాయతీలను మున్సిపాలిటీలుగా ఉన్నతీకరించాలనే ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.

విశ్వవిద్యాలయాల్లో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ నియామకం
ఇక నుండి విశ్వవిద్యాలయాల సిబ్బంది నియామకాలు ఒకే ఒక నియామక సంస్థ (కామన్ రిక్రూట్ మెంట్ బోర్డ్) ద్వారా జరపాలని రాష్ట్ర కేబినేట్ నిర్ణయించింది. ప్రస్తుతం ఏ విశ్వవిద్యాలయానికి ఆ విశ్వవిద్యాలయమే సిబ్బంది నియామకాలను చేపట్టే పద్ధతి అమలవుతున్నది. అందుకు భిన్నంగా ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధంగా అన్ని విశ్వవిద్యాలయాల సిబ్బంది నియామకాన్ని పారదర్శకంగా ఒకే నియామక సంస్థ ద్వారా జరపాలని కేబినేట్ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా 3,500 పై చిలుకు టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ నియామకాలను చేపట్టాలని కేబినేట్ నిర్ణయించింది. రాష్ట్రంలో మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకు రాష్ట్ర కేబినేట్ ఆమోదం తెలిపింది.
ప్రైవేట్ యూనివర్సీటీలకు ఆమోదం
రాష్ట్రంలో మరో 5 కొత్త ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు కేబినేట్ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటు చట్టం ప్రకారం సంబంధింత నియమ నిబంధనలకు లోబడి ఉన్న ప్రైవేట్ యూనివర్సిటీలను అనుమతించాలని ఇందుకు సంబంధించి విద్యాశాఖ, వ్యవసాయశాఖలు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కేబినేట్ అనుమతించిన కొత్త ప్రైవేట్ యూనివర్సిటీలు: CII, AMITY, MNR, GURUNANAK, NICMAR తో పాటు కావేరి వ్యవసాయ విశ్వవిద్యాలయం. రాష్ట్రంలో సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ, ఫార్మా యూనివర్సిటీలను స్థాపించాల్సిన అవసరం ఎంతైనా ఉందనీ, ఇవి త్వరగా ఏర్పాటయ్యేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యాసంస్థల ఏర్పాటును కేవలం హైదరాబాద్ కే పరిమితం కాకుండా ఇతర నగరాలకు విస్తరింపచేయాలని ముఖ్యమంత్రి సూచించారు. దీనివల్ల హైదరాబాద్ పై ఒత్తిడి తగ్గడంతో పాటు, ఇతర నగరాలు అభివృద్ది చెందుతాయని ఆయన అన్నారు. ముఖ్యంగా వరంగల్, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో నూతన ఉన్నత విద్యాసంస్థల స్థాపనను ప్రోత్సహించాలని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రిని కేబినేట్ ఆదేశించింది.

గతంలో ప్రభుత్వం మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ల ఉద్యోగ విరమణ పరిమితిని 65 సంవత్సరాలకు పెంచింది. తాజాగా మెడికల్ కాలేజీ ప్రొఫెసర్లను డైరక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్, అడిషనల్ డైరక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ గా నియమించడానికి అనుమతినిస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలు జరపబోతున్న విషయం తెలిసిందే. పోలీస్ రిక్రూట్ మెంట్ కు సంబంధించి అభ్యర్థుల వయోపరిమితి అర్హతలో 3 సంవత్సరాలు సడలించాలని కేబినేట్ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగార్థుల నుండి వచ్చిన అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అదే విధంగా గ్రూప్ 1, గ్రూప్ 2, ఇతర గెజిటెట్ పోస్టుల నియామకాల్లో పాదర్శకత కోసం ఇక నుంచి కేవలం లిఖిత పరీక్షనే ప్రమాణంగా తీసుకోవాలని, ఇంటర్వ్యూ అవసరం లేదనే ప్రతిపాదనకు రాష్ట్ర కేబినేట్ ఆమోదం తెలిపింది. ఐటి తదితర పరిశ్రమల స్థాపన కేవలం నగరంలోని గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంతాలకే పరిమితం కాకూడదని, ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిపంజేయాలని తద్వారా హైదరాబాద్ నలుమూలలా సమానమైన అభివృద్ధి జరుగుతుందని ముఖ్యమంత్రి అన్నారు.

పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి:
మే నెల 20 నుండి 5 జూన్ వరకు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను నిర్వహించాలని కేబినేట్ అధికారులను ఆదేశించింది. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పై నిరంతర సమీక్ష నిర్వహించాలని, ఆశించిన లక్ష్యాలు సంపూర్ణంగా నెరవేరేవరకు అలసత్వం పనికిరాదని ముఖ్యమంత్రి కేసీఆర్ సంబంధిత అధికారులకు సూచించారు.

యాసంగి ధాన్యం కొనుగోలుకు ఆమోదం:
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో పండిన యాసంగి పంటను సేకరించకుండా సంకుచితంగా వ్యవహరిస్తున్న తీరును కేబినేట్ తీవ్రంగా నిరసించింది. సాంఘిక ప్రయోజనం చూడాల్సిన కేంద్ర ప్రభుత్వం వ్యాపార మనస్తత్వంతో కేవలం ఆర్థిక ప్రయోజనాలను మాత్రమే చూస్తున్నదని కేబినేట్ విమర్శించింది. కేంద్ర నిర్ణయం రాష్ట్ర రైతుల ప్రయోజనాలకు గొడ్డలి పెట్టుగా మారింది. ఐతే ప్రజలతో, రైతులతో నిత్య ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉండే రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాల పట్ల నిబద్ధతను ప్రదర్శించాలని ముఖ్యమంత్రి అన్నారు. వద్దన్నా రాష్ట్రంలో కొంతమంది రైతులు వరి సాగు చేశారు. ఇప్పుడా వరి కొనుగోలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పై పెనుభారంగా మారింది. ఈ విషయంపై సుదీర్ఘంగా చర్చించిన కేబినేట్ కన్న బిడ్డలను కాపాడుకునే తండ్రి మనస్తత్వంతో రైతులను ఆదుకోవాలని నిర్ణయించింది.
సివిల్ సప్లైస్ శాఖ యుద్ధ ప్రాతిపదికన గ్రామగ్రామాన కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని, మంత్రులందరూ తమ తమ జిల్లాల్లో కొనుగోలు కేంద్రాల ఏర్పాటును పర్యవేక్షించాలనీ, కలెక్టర్లతో, సంబంధిత శాఖలతో సమీక్షలు నిర్వహించుకొని, గన్నీ బ్యాగుల సరఫరా, తదితర సమస్యలు లేకుండా సమర్థవంతంగా కొనుగోలు జరిగేలా చూడాలని ఆదేశించారు. గతంలో మాదిరిగానే కనీస మద్దతు ధర చెల్లించి, రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుంది కనుక రాష్ట్రంలోని రైతులెవరూ తక్కువ ధరకు ధాన్యం ఇతరులకు అమ్మి, నష్టపోవద్దని ముఖ్యమంత్రిగారు సూచించారు. కేంద్రం దుర్మార్గ వైఖరి ప్రదర్శిస్తున్నా సరే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఖజానా పై పడే అధిక భారాన్ని భరిస్తూ, చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తుందనీ ముఖ్యమంత్రి గారు తెలిపారు.
యాసంగి వడ్లను కొనేందుకు చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో కమిటి వేయనున్నట్లు తెలిపారు. ఈ కమిటీలో ఫైనాన్స్ సెక్రటరీ, అగ్రికల్చర్ సెక్రటరీ, ఇరిగేషన్ సెక్రటరీ, సివిల్ సప్లైస్ సెక్రటరీలు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ జిల్లా కలెక్టర్లతో ధాన్యం కొనుగోళ్ళు, పంపిణీ వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది.

Also Read : తెలంగాణలో ఉద్యోగాల జాతర

RELATED ARTICLES

Most Popular

న్యూస్