డ్రగ్స్ కేసుల్లో పట్టుబడిన వారికోసం కొత్త కౌన్సెలింగ్ విధానాన్ని ప్రవేశపెట్టామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అన్నారు. డ్రగ్స్ వినియోగదారులపై నిరంతరం నిఘా కొనసాగిస్తామని చెప్పారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్లోని బహదూర్పురాలో డ్రగ్స్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను సీవీ ఆనంద్ మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిందితుల నుంచి 225 గ్రాముల బ్రౌన్షుగర్, 28 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ముఠాలోని నలుగురిని అరెస్టు చేశామని, మరో ఇద్దరు పరారీలో ఉన్నారని తెలిపారు. ప్రధాన నిందితుడు షాజాద్ సయ్యద్ గతంలో ముంబై డ్రగ్స్ కేసులో అరెస్టు అయ్యాడని వెల్లడించారు.
శంషాబాద్ ఎయిర్పోర్టులో వరుసగా డ్రగ్స్ దొరుకుతున్నాయని సీవీ ఆనంద్ అన్నారు. ఆఫ్రికా దేశాల నుంచి ఇక్కడికి తీసుకొస్తున్నారని చెప్పారు. ఇప్పటికే రూ.125 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇక్కడికి వచ్చిన మత్తుమందును ముంబై, ఢిల్లీకి తరలిస్తున్నారని వెల్లడించారు. గత 10 ఏండ్లలో దేశంలో 70 శాతం డ్రగ్స్ వాడకం పెరిగిందని ఎన్సీబీ చెబుతున్నదని చెప్పారు. ఎన్సీబీ, డీఆర్ఐ, ఈడీ, కస్టమ్స్, సీఐ సీఈఎల్ఎల్, సీఐఎస్ఎఫ్ కలిసి పనిచేస్తే డ్రగ్స్ రాకెట్ను నిర్మూలించవచ్చని పేర్కొన్నారు.
డ్రగ్స్ వినియోగదారులపై నిరంతరం నిఘా ఉంచుతామని సీపీ చెప్పారు. డ్రగ్స్ వాడేవారికి రక్త, యూరిన్ పరీక్షలు చేస్తామన్నారు. వారానికి ఒకసారి వారి అనుమతితోనే పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఇప్పటివరకు 300 మందికి పైగా డ్రగ్స్ వినియోగదారులకు పరీక్షలు చేశామని వెల్లడించారు. డ్రగ్స్ వినియోగదారులను కట్టడి చేసేందుకే కొత్త కౌన్సెలింగ్ విధానం తీసుకొచ్చామని తెలిపారు.
Also Read :