Monday, May 20, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంసంపాదకీయంలో పుస్తకాల రుతువు

సంపాదకీయంలో పుస్తకాల రుతువు

The Art of Reading: పత్రికల్లో సంపాదకీయం చాలా ప్రధానమయినది. మిగతావన్నీ జరిగిన వార్తలను ఉన్నదున్నట్లు రకరకాలుగా ఇచ్చే రిపోర్ట్ లు. వార్త- వ్యాఖ్య- సంపాదకీయాల మధ్య విభజన రేఖ ఎప్పుడో మాయమయ్యింది. ఆ చర్చ ఇక్కడ అప్రస్తుతం. ఒక్క సంపాదకీయం మాత్రం పత్రిక అభిప్రాయం. సంపాదకుడి వ్యాఖ్య, విశ్లేషణ. యజమాని- సంపాదకుడు ఒకరే అయిన రోజులు కాబట్టి ఇప్పుడు సంపాదకీయం అంటే యాజమాన్య విధానం అనే అనుకోవాలి.

తెలుగులో సంపాదకీయాల కోసమే పత్రికలు చదివిన రోజులు కొన్ని దశాబ్దాలపాటు ఉండేవి. తరువాత సంపాదకీయ పేజీ ఒక్కటే పాఠకులకు అంటరానిదిగా తయారయ్యింది. ఇందులో పాఠకుల తప్పు లేదు. పత్రికా సంపాదకులు, యజమానులే దీనికి బాధ్యులు. సంపాదకీయం అనగానే సంస్కృత భార పదబంధ సమాసాలతో ఇనుప గుగ్గిళ్ళకంటే కఠినంగా, అర్థం కాకుండా రాసే సంపాదకులు; పడికట్టు పదాలతో నిర్జీవమయిన శైలిలో రాసే సంపాదకులు; చెరకులో రసాన్ని వదిలి పిప్పిని మాత్రమే పట్టుకున్నట్లు తెలుగుకు సహజమయిన వ్యక్తీకరణను వదిలి నిస్సారమయిన అభివ్యక్తిని పట్టుకున్న సంపాదకులు పెరిగాక పాఠకులకు ఎడిట్ పేజీతో బంధం తెగిపోయింది.

తెలుగులో ఇప్పటికీ అత్యంత సరళ భాషలో అనన్యసామాన్యంగా సంపాదకీయాలు రాసే జర్నలిస్టులు ఉన్నారు. బహుశా అలాంటివారికి అవకాశాలు తక్కువగా దొరుకుతున్నట్లు ఉంది. నిన్నటి సాక్షి దిన పత్రిక సంపాదకీయం యథాతథంగా ఇది. ఒకసారి మొత్తం చదవండి. అప్పుడు ఈ సంపాదకీయం ప్రత్యేకత ఏమిటో మీకే తెలుస్తుంది.

Read Books
పుస్తకాల రుతువు

ఆ నల్లటి వరుస కట్టిన అక్షరాల వెంట అక్షువులతో వెంబడిస్తే గుత్తులుగా కాసిన మామిడి పండ్ల చెట్టు కింద అశ్వాన్ని వదిలి సేదతీరుతున్న రాకుమారుడు కనిపిస్తాడు. కొమ్మపై కూచున్న జంట పక్షులు ఏవో అతనికి తెలియాల్సిన రహస్యం మరికాసేపట్లో చెవిన ఊదుతాయి. నల్లటి వరుస కట్టిన ఆ పంక్తుల వెంట పరిగెడితే కొత్త పెళ్లికూతురిని శోభనం రాత్రి చంపడమే వ్రతంగా పెట్టుకున్న రాకుమారుడు ఆ పెళ్లికూతురు మొదలెట్టిన గొలుసు కథల్లో గుడ్లు తేలేసి వ్రతం మరిచి ‘ఆ తర్వాత?’ అనే ప్రశ్నతో జీవితాంతం బతుకు వెళ్లమార్చడం చూస్తాము. కాగితం మీద వరుస కట్టిన పంక్తులు రాముడు కానలకు వెళ్లాక కౌసల్య పడిన శోకమెట్టిదన్న ఆలోచనను ఇస్తాయి. బోధిచెట్టు కింద దేహాన్ని క్షోభ పెట్టుకుంటున్న సిద్ధార్థుని సాక్షాత్కారం కోసం వేచి చూడమంటాయి. కరకు పళ్లు దిగబడి కాలి విముక్తి కోసం ఘీంకారం చేస్తున్న గజేంద్రుని మోక్షానికి శంఖు చక్రాలు వదిలి శ్రీ మహావిష్ణువును పరిగెత్తమంటాయి. రామలింగడు ఈ పంక్తులు పలకడానికే అంబ ఇచ్చిన ఒక చేతి పాలు, మరో చేతి పెరుగును కలిపి గొంతులోకి ఒంపుకున్న వైనం చెబుతాయి. పుటలు కొన్ని శ్రీనాథుని పల్లకీ మోస్తాయి. పుటలు కొన్ని పేదవాడి తెల్లని నవ్వును మల్లెలుగా విరబూస్తాయి. పుటల నిండా వీరుని ధీరకంపనం… వనిత దీక్షా కంకణం… పసిపిల్లల కేరింతలు… యువతీ యువకుల సల్లాపాలు… కన్నీటి ఉప్పదనం… త్యాగపు శౌర్యము… భీరువు ఆక్రందన… ఆలోచనల అలజడి… తేజోమూర్తి జీవన సందేశము.

Read Books

ఒక దేశ ‘తలసరి ఆదాయం’ ఎలా గణిస్తారోగాని ఒక దేశ ‘తలసరి సంస్కారం’ సగటున ఆ దేశ పౌరుడు చదివిన పుస్తకాల సంఖ్యను బట్టి అవి ఎలాంటి పుస్తకాలన్న నాణ్యతను బట్టి గణించాలి. ఆహార కొరత వస్తేనో, విదేశీ మారకద్రవ్యం అడుగంటితేనో, ద్రవ్యోల్బణం విజృంభిస్తేనో మాత్రమే ఆ దేశం ప్రమాదంలో పడినట్టు కాదు. ఏ దేశ ప్రజలైతే నిజంగా పుస్తకాలు చదవడం మానేస్తారో, ఇంట పుస్తకాల అల్మారా లేకుండా జీవిస్తారో, ‘పుస్తకమా అది ఏమి’ అని ఫోన్‌ స్క్రీన్‌లో తల కూరుస్తారో ఆ దేశం నిజంగా ప్రమాదంలో పడినట్టు!

వస్తు ప్రపంచం కంటే పుస్తక ప్రపంచం మేలైనది. ఇంట టివి, ఫ్రిజ్జు, కారు, ఐఫోన్‌ ఎన్ని కొన్నా మరోటేదో కావాలన్న అత్యాశను, పేడలో పడవేసే పేరాశను కలిగిస్తాయి. పుస్తకాలు? నీ పాదాలకు లేపనం రాసి హిమానీనదాల వరకూ తీసుకెళతాయి. నీ చీకటి కవాటాలను తెరిచి వెలుతురు వాకిళ్ల ఎదుట నిలబెడతాయి. నీ మూఢవిశ్వాసాలకు నువ్వే నవ్వుకునేలా చేస్తాయి. చైతన్యాన్ని కలిగించి నీ నిజస్థితి మీద అంచనా కట్టిస్తాయి. ద్వేషంతో, హైన్యంతో, వ్యవస్థీకృత దుర్లక్షణాలతో బతకాలన్న నీ పట్టుదలను అవి హరిస్తాయి. పుస్తకాలు నిన్ను పెట్రోలు కొట్టించమనవు. ఫుడ్డు ఆర్డర్‌ పెట్టమనవు. విలాసాలు అమేజాన్‌ చేయమనవు. అవి కోరేదల్లా తెరిచి చదవమనే!

రెండు రాష్ట్రాల్లో 9 కోట్ల తెలుగు జనాభా. ఏ పుస్తకమూ 500 కాపీలు అమ్ముడు పోదు. అంటే కోటికి 100 మంది కూడా పుస్తకాలు కొనరు. సినిమా హీరోల కొరకు టికెట్టు రికార్డు స్థాయిలో కొంటారు. ‘నెక్స్‌›్ట సినిమా ఏమిటి?’ అని అడుగుతారు. ‘నువ్వు చదివిన పుస్తకం చెప్పు’ అని ఏ హీరోనీ ఎవరూ అడగరు. శ్రీమంతురాలైన సుధామూర్తి తానే శ్రీమంతులుగా భావించే ఒకరి ఇంటికి వెళ్లిందట. ‘అబ్బబ్బ… ఆ ఇంట మణిమాణిక్యాలు వజ్రవైఢూర్యాలు.. బంగారు సింహాసనాలు… అమూల్య కళాకృతులు… ఒక్కటే లోపం. ఒక్క పుస్తకం కనపడలేదు’ అని రాసింది. ఇలాంటి పేదరికంలో ఉన్న శ్రీమంతులు మనలో ఎందరు? పూర్వం తెలుగు ఇళ్లల్లో తప్పనిసరిగా ఎక్కాల పుస్తకం ఉండేది. శతకాలు ఉండేవి. పెద్ద బాలశిక్ష అయినా కనిపించేది. ఒక చిన్న గూటిలో ఇవి కూడా లేని స్థితికి తెలుగుజాతి ఎగబాకింది.

10 వేల మంది తెలుగు కవులు ఉన్నారు. పక్క కవి పుస్తకం కొనరు. 5 వేల మంది తెలుగు కథకులు ఉన్నారు. పక్క రచయిత సంకలనం కొనరు. పాఠకుల మీద వంక పెడుతుంటారు. మొదట వీరే పుస్తకాలు కొనరు. రచయిత అంటే ఎవరు? సీనియర్‌ పాఠకుడు! మంచి కవి కావాలన్నా, మంచి కథకుడు కావాలన్నా మొదట జీవితంలో పాల్గొనాలి అనుభవం కోసం. తర్వాత పుస్తకాలు చదవాలి సాధన కోసం. జీవన స్పర్శ, పుస్తకాల సంపర్కం లేని శుష్కకవులతో, కథకులతో నిండి ఉంది నేటి మెజారిటీ తెలుగు సమాజం. ఇక మన పాఠకులు ‘మా పిల్లలు తెలుగు చదవరు’… ‘మాకు ఈ కథలు, కవిత్వం పడవు’ అంటూ ఉంటారు. నీకు రోటి పచ్చడి ఇష్టమైతే కనీసం రోటి పచ్చళ్ల మీద వచ్చిన పుస్తకమైనా కొను. ఇంట పుస్తకంగా కనపడుతూ ఉంటుంది.

డిసెంబర్‌ 22 నుంచి జనవరి 1 వరకు హైదరాబాద్‌లో పుస్తకాల రుతువు. అంటే బుక్‌ ఎగ్జిబిషన్‌. వందలాది స్టాళ్ళు, వేలాది పుస్తకాలు, ఆవిష్కరణలు, ఉపన్యాసాలు, సాహితీకారుల దర్శనం, మిత్రుల కరచాలనం, చలిగాలుల్లో ఛాయ్‌తో చేసే కబుర్లు. తెలుగులో ఎందరో రచయితలు, కవులు, బుద్ధిజీవులు… ఈ బుక్‌ ఎగ్జిబిషన్‌కు తరలివచ్చే పాఠకుల మీద నమ్మకంతో కొత్త పుస్తకాలను విడుదల చేస్తున్నారు. పాత క్లాసిక్స్‌ను రీప్రింట్‌ చేస్తున్నారు. ‘ఈ పుస్తకాలు చదివి ఆనందించండి, ఆస్వాదించండి, ఆలోచించండి’ అని కొమ్ముబూర ఊది మరీ మొరపెట్టుకోనున్నారు.

ఈ రుతువులో పాలుపంచుకోండి. పుస్తకాల చెట్టు నీడ ప్రతి ఇంటా పడుగాక!

సాక్షి సంపాదకీయం. డిసెంబర్ 12, 2022
——————
నిన్న ఉదయాన్నే కనీసం ఐదారుగురు నాకిది ఫార్వర్డ్ చేసి ఎంత బాగుందో కదా! అని మురిసిపోతూ కామెంట్లు పెట్టారు. ఒక సంపాదకీయం టెక్స్ట్ వైరల్ కావడం నాకు తెగ నచ్చి…ఈ సంపాదకీయాన్ని ఎవరు రాశారో అని కనుక్కుంటే…చెయి తిరిగిన కథా రచయిత ఖదీర్ బాబు రాసినట్లు తెలిసింది. సాక్షి దినపత్రికలో ఆయన అసిస్టెంట్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు.

మాటల మధ్య మాటలు మోయలేనంత భావాన్ని పేర్చిన, వస్తు ప్రపంచం కంటే పుస్తక ప్రపంచం ఎలా గొప్పదో చెప్పడానికి తనకు తెలిసిన భాషనంతా ఒడుపుగా ఉపయోగించిన, ఆరు రుతువులకంటే పుస్తకాల రుతువు అందమయినదని ఆరు పేరాల్లో ఆవిష్కరించిన రచయితకు, ప్రచురించిన సాక్షికి అభినందనలు.

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

http://sh100.global.temp.domains/~idhatric/online-education-problems-for-rural-students/

Also Read :

http://sh100.global.temp.domains/~idhatric/we-have-to-create-awareness-among-children-on-book-reading/

Also Read :

http://sh100.global.temp.domains/~idhatric/ebooks-are-the-only-books/

RELATED ARTICLES

Most Popular

న్యూస్