పురుషుల టి 20 వరల్డ్ కప్ లో ఆతిథ్య ఆస్ట్రేలియాకు నిరాశే మిగిలింది, సెమీస్ లో చోటు దక్కలేదు. నేడు జరిగిన మ్యాచ్ లో శ్రీలంకపై ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో గ్రూప్ 1 నుంచి న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లు సెమీ ఫైనల్స్ కు చేరుకున్నాయి. అయితే సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ వరుస వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడడంతో చివరి ఓవర్ వరకూ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది.
సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ లో జరిగిన మ్యాచ్ లో శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది, 39పరుగులకే ఓపెనర్ కుశాల్ మెండీస్ (18) వెనుదిరిగాడు. మరో ఓపెనర్ పాతుమ్ నిశాంక 45 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 67 పరుగులు చేశాడు. భానుక రాజపక్ష 22 పరుగులతో రాణించాడు. వీరు ముగ్గురు తప్ప మిగిలిన వారు విఫలం కావడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 141 పరుగులు చేసింది.
ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్ వుడ్ మూడు; బెన్ స్టోక్స్, క్రిస్ ఓక్స్, శామ్ కర్రన్, ఆదిల్ రషీద్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ ధాటిగా ఆరంభించింది. పవర్ ప్లే లో ఆరు ఓవర్లకు వికెట్ నష్ట పోకుండా 70 పరుగులు చేసింది. జట్టు స్కోరు 75 వద్ద జోస్ బట్లర్ (28) ఔట్ కాగా, ఆ కాసేపటికే మరో ఓపెనర్ అలెక్స్ హేల్స్-47 (30బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్) పరుగులు చేసి ఔటయ్యాడు. హ్యారీ బ్రూక్ (4), లియామ్ లివింగ్ స్టోన్(4), మోయీన్ అలీ(1), శామ్ కర్రన్ (6)లు తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరడంతో ఇంగ్లాండ్ శిబిరంలో ఆందోళన రేకెత్తింది. అయితే బెన్ స్టోక్స్ (44 నాటౌట్), క్రిస్ ఓక్స్ (5 నాటౌట్) క్రీజులో నిలదొక్కుకొని మరో రెండు బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించి పెట్టారు.
లంక బౌలర్లలో లాహిరు కుమార, హసరంగ, ధనంజయ డిసిల్వా తలా రెండు వికెట్లు పడగొట్టారు.
నాలుగు ఓవర్లలో కేవలం 16 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టిన ఆదిల్ రషీద్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.
Also Read : ఐర్లాండ్ పై గెలుపు – సెమీస్ కు కివీస్!