Tuesday, March 10, 2026
HomeTrending Newsకర్తార్ పూర్ సాహిబ్ వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్

కర్తార్ పూర్ సాహిబ్ వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్

Green Signal To Kartarpur Corridor :

సిక్కుల పుణ్య క్షేత్రం కర్తార్ పూర్ సాహిబ్ వెళ్లేందుకు భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ రోజు నుంచి భారత్ నుంచి వెళ్ళే భక్తులు గురుదాస్ పూర్ జిల్లాలోని డేరా బాబా నానక్ మీదుగా సందర్శించేందుకు అడ్డంకులు తొలిగాయి. పాకిస్తాన్ లోని కర్తార్ పూర్ సాహిబ్ కు భక్తుల సందర్శన కరోనా సమయంలో రెండు దేశాలు ఉమ్మడిగా ఆపేశాయి. కరోనా తగ్గు ముఖం పట్టాక పాకిస్తాన్ ప్రభుత్వం ఇండియా నుంచి రాకపోకలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా భారత ప్రభుత్వం సరిహద్దులు తెరవలేదు. జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదుల చొరబాట్లు, ఆఫ్ఘన్ లో తాలిబాన్ అధికారంలోకి రావటం నేపథ్యంలో భద్రతను సమీక్షించాకే అనుమతిస్తామని భారత ప్రభుత్వం ప్రకటించింది.

నవంబర్ 19 గురునానక్ జయంతి కావటంతో సందర్శనకు అనుమతి ఇవ్వాలని వారం రోజుల క్రితం పంజాబ్ బిజెపి నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా లను కలిసి విజ్ఞప్తి చేశారు. అటు వచ్చే ఏడాది పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉండటంతో కేంద్ర ప్రభుత్వం కర్తార్ పూర్ సందర్శనకు కావాల్సిన ఏర్పాట్లు చేసింది. కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్న వారు వెళ్ళవచ్చు. మైనర్లకు టీకా నిబంధనలు వర్తించవు. సిక్కుల మత గురువు గురు నానక్ 1520 నుంచి 1539 వరకు 18 ఏళ్ళు కర్తార్ పూర్ లోనే గడిపారు. అదే సమయంలో సిక్కు మత స్థాపన చేశారు.

కర్తార్ పూర్ సాహిబ్ గా పిలుచుకునే దర్బార్ సాహిబ్ గురుద్వారాకు మరమ్మతులు పూర్తి చేసి పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ 2019 లో ప్రారంభించారు. భారత్ పంజాబ్ లోని గురుదాస్ పూర్ జిల్లా డేరా బాబా నానక్ నుంచి పాకిస్తాన్ పంజాబ్ లోని నరోవాల్ జిల్లా కర్తార్ పూర్ పట్టణానికి కేవలం ఐదు కిలోమీటర్లు మాత్రమే దూరం ఉంటుంది. భారత్ సరిహద్దుల నుంచి చూస్తే కనిపించే అంత దూరంలో కర్తార్ పూర్ ఉంటుంది. ఈ దారి ప్రారంభించక ముందు అటారి – వాఘ సరిహద్దు నుంచి ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చి వీసా తీసుకుని వెళ్ళాల్సి వచ్చేది. కర్తార్ పూర్ కారిడార్ తో వీసా లేకుండానే సందర్శించే వెసులుబాటు ఉంది.

భారతదేశ విభజన సిక్కులకు తీరని గాయం చేసింది. విభజనలో పంజాబ్ రెండు భాగాలుగా విడతీయటంతో భారత్ పాక్ దేశాల్లోరెండు ముక్కలుగా ఉండిపోయింది. భారత్ పంజాబ్ లో మూడు కోట్ల సిక్కులు ఉండగా పాకిస్తాన్ పంజాబ్ లో 11 కోట్ల మంది సిక్కులు ఉన్నారు. ఇండియాలో ఉగ్రవాద కదలికలు, చొరబాట్లు ఏది జరిగినా సరిహద్దులు ముసివేస్తుంటారు. దీంతో రెండు దేశాల్లోని సిక్కులు తమ వారిని కలుసుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Also Read : ఆఫ్ఘన్లో ప్రబలుతున్న అంటువ్యాధులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular