Tuesday, September 17, 2024
HomeTrending NewsBudwel lands: నేడు బుద్వేల్‌ భూముల వేలం

Budwel lands: నేడు బుద్వేల్‌ భూముల వేలం

హైదరాబాద్ కోకాపేట భూములకు రికార్డు స్థాయి ధర లభించిన నేపథ్యంలో హెచ్‌ఎండీఏ దూకుడు పెంచింది. రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాలో మరికొన్ని భూములను ఈ-వేలానికి పెడుతున్నది. రంగారెడ్డిలో 8, మేడ్చల్‌ మల్కాజిగిరిలో 8, సంగారెడ్డి జిల్లాలో 10 ప్రాంతాల్లో ఉన్న ప్లాట్లకు ఈ నెల 18న ఈ-వేలం నిర్వహించనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను బుధవారం విడుదల చేసింది. రంగారెడ్డి జిల్లాలో బైరాగిగూడ, మంచిరేవుల, పీరంచెరువు, కోకాపేట, నల్లగండ్ల, బుద్వేల్‌, చందానగర్‌లో స్థలాలను విక్రయించనున్నారు. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా బాచుపల్లి, బౌరంపేట, చెంగిచర్ల, సూరారం, సంగారెడ్డి జిల్లా వెలిమల, నందిగామ, అమీన్‌పూర్‌, రామేశ్వరంబండ, పతిఘన్‌పూర్‌, కిష్ణారెడ్డిపేటలో స్థలాలు విక్రయించనున్నారు. ఈ నెల16 వరకు రిజిస్ట్రేషన్లను స్వీకరించి, 18న రెండు సెషల్‌లో ఈ వేలం నిర్వహించనున్నారు.

బుద్వేల్‌లో హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేసిన లేఅవుట్‌లోని భూములకు గురువారం ఈ-వేలం నిర్వహించనున్నారు. సుమారు 182 ఎకరాల్లో 17 ప్లాట్లతో హెచ్‌ఎండీఏ ఇక్కడ భారీ లేఅవుట్‌ను రూపొందించింది. ఇందులో 100.01 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న 14 ప్లాట్లకు తొలి విడతగా ఈ-వేలం నిర్వహించనున్నారు. ఈ లేఅవుట్‌లో కూడా హెచ్‌ఎండీఏ అధికారులు నియోపొలిస్‌ తరహాలో మౌలి క వసతులు కల్పించారు. ఏకంగా 36, 45 మీటర్ల మేర రహదారులను నిర్మించారు. లేఅవుట్‌ నుంచి ఔటర్‌ రింగురోడ్డుకు విశాల రహదారితో అనుసంధానం చేశారు. ఎయిర్‌పోర్టు మెట్రోతో కేవలం 15 నిమిషాల్లోనే శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకునే అవకాశం ఉన్నది. భారీ హంగులతో రూపొందించిన ఈ లేఅవుట్‌లోని ప్లాట్ల వేలానికి ఈ నెల 4న నోటిఫికేషన్‌ జారీ చేశారు. గురువారం వేలం ప్రక్రియను రెండు విడతలుగా చేపట్టనున్నారు. ఈ వేలంలో అధికారులు నిర్దేశిత కనీస ధరను ఎకరాకు రూ.20 కోట్లుగా నిర్ధారించారు. తొలి విడత ఈ-వేలం ద్వారా రూ.2 వేల కోట్లకుపైగా ఆదాయం వస్తుందని హెచ్‌ఎండీఏ అంచనా వేస్తున్నది.

మరోవైపు బుద్వేల్ భూముల వ్యవహారంలో న్యాయస్థానం జోక్యం చేసుకొని ఆ ల్యాండ్ ను హైకోర్టు నిర్మాణానికి కేటాయించాలంటూ హైకోర్టు బార్ అసోసియేషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు గతంలో ప్రభుత్వంతో సంప్రదింపులు కూడా జరిపినట్లు బార్ అసోసియేషన్ చెబుతుంది. 100 ఏకరాలను హైకోర్టు భవనాల కోసం కేటాయించేలా ప్రస్తుత వేలాన్ని ఆపాలంటూ బార్ అసోసియేషన్ పిటిషన్ వేసింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్