Friday, March 29, 2024
Homeస్పోర్ట్స్ప్లే ఆఫ్ రేసులో పంజాబ్

ప్లే ఆఫ్ రేసులో పంజాబ్

ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో నేడు జరిగిన మ్యాచ్ లో కోల్ కతా పై విజయం సాధించి టాప్-4 రేసులో తామూ ఉన్నమంటూ నిలబడింది. పంజాబ్ ఆటగాడు షారుఖ్ ఖాన్ కేవలం 9 బంతుల్లో  రెండు సిక్సర్లు, ఒక ఫోర్ తో 22 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక భూమిక పోషించాడు. కెప్టెన్ రాహుల్ తో పాటు మరో ఓపెనర్ మయాంక్ కూడా రాణించడంతో కోల్ కతా విసిరిన 165 పరుగుల లక్ష్యాన్ని సైతం పంజాబ్ ఛేదించింది. 55 బంతుల్లో 4 ఫోర్లు, 2 సికర్లతో 67 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ కు మ్యాన్ అఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్ ఎంచుకుంది. కోల్ కతా ఓపెనర్ శుభమన్  గిల్ ఏడు పరుగులకే ఔటైనా మరో ఓపెనర్ వెంకటేష్ అయ్యర్, రాహూల్ త్రిపాఠి లు రెండో వికెట్ కు 72 పరుగులు జోడించారు. అయ్యర్-67 (49 బంతుల్లో 9 ఫోర్లు,  1 సిక్సర్);  త్రిపాఠి-34 (26 బంతుల్లో 3ఫోర్లు, 1సిక్సర్) ; ఆ తర్వాత నితీష్ రానా-31 (18 బంతులలో 2ఫోర్లు, 2సిక్సర్లు) కూడా రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 165 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్ -3, రవి బిష్ణోయ్-2, షమీ ఒక వికెట్ పడగొట్టారు.

166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ మొదటి వికెట్ కు 70 పరుగులు చేసింది.  మయాంక్ అగర్వాల్ దూకుడుగా ఆడి 27 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 40 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన నికోలస్ పూరన్ 12 పరుగులే చేసి వెనుదిరిగాడు. మార్ క్రమ్, షారూఖ్ లు సారధి రాహుల్ కు సహకారం అందించారు. రాహూల్ చివరి ఓవర్లో ఔటయ్యాడు. పంజాబ్ 19.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 168  పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. కోల్ కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి-2, శివమ్ మావి, సునీల్ నరేన్, వెంకటేష్ అయ్యర్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్