Saturday, April 20, 2024
HomeTrending Newsతెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసికెళ్ళిన మహా దర్శకుడు విశ్వనాథ్ గారు - చిరంజీవి

తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసికెళ్ళిన మహా దర్శకుడు విశ్వనాథ్ గారు – చిరంజీవి

కళాతపస్వి విశ్వనాథ్, చిరంజీవి మధ్య ఎంతో అనుబంధం ఉంది. విశ్వనాథ్ ఇకలేరు అనే వార్త తెలిసినప్పటి నుంచి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియచేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ లో స్పందించారు. ఇది అత్యంత విషాదకరమైన రోజు. పితృ సమానులు, కళాతపస్వి కె.విశ్వనాథ్ గారు ఇక లేరు అనే వార్త దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన గొప్పతనం గురించి చెప్పటానికి మాటలు చాలవు. పండితులని పామరులనీ కూడా ఒకేలా మురిపించే ఆయన చిత్రాల శైలి విశిష్టమైంది. ఆయనలా సున్నితమైన ఆర్ట్ ఫిలిమ్స్ ని కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ గా మలిచిన దర్శకుడు బహుశా ఇంకొకరు లేరు.

తెలుగు జాతి ఖ్యాతిని తన సినిమాల ద్వారా ప్రపంచ స్థాయికి తీసికెళ్ళిన మహా దర్శకుడు ఆయన. విశ్వనాథ్ గారి దర్శకత్వంలో ‘శుభలేఖ, ‘స్వయంకృషి, ‘ఆపద్బాంధవుడు’ అనే మూడు చిత్రాల్లో నటించే అవకాశం నాకు లభించింది. నాకు వ్యక్తిగతంగా ఆయనతో వున్నది గురు శిష్యుల సంబంధం. అంతకు మించి తండ్రీ కొడుకుల అనుబంధం. ఆయనతో గడిపిన సమయం నాకు అత్యంత విలువైనది. ప్రతి నటుడికీ ఆయనతో పని చేయటం ఒక ఎడ్యుకేషన్ లాంటిది. ఆయన చిత్రాలు భావి దర్శకులకి ఒక గైడ్ లాంటివి.

43 సంవత్సరాల క్రితం, ఆ మహనీయుడి ఐకానిక్ చిత్రం ‘శంకరాభరణం’ విడుదలైన రోజునే బహుశా ఆ శంకరుడికి ఆభరణంగా, ఆయన కైలాసానికి ఏతెంచారు. ఆయన చిత్రాలు, ఆయన చిత్రాల సంగీతం, ఆయన కీర్తి అజరామరమైనవి. ఆయన లేని లోటు భారతీయ చిత్ర పరిశ్రమకి, తెలుగు వారికి ఎప్పటికీ తీరనిది. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ ఆయన కుటుంబ సభ్యులందరికీ, అసంఖ్యాకమైన ఆయన అభిమానులందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియచేసుకుంటున్నాను.” అని విశ్వనాథ్ గారిని కలిసిన పలు ఫోటోలు షేర్ చేసి తన భావోద్వేగాన్ని వెలుబుచ్చారు చిరంజీవి.

Also Read : విశ్వనాథ్, చిరంజీవిల బంధం.. మరువలేని అనుబంధం 

RELATED ARTICLES

Most Popular

న్యూస్