Friday, April 19, 2024
HomeTrending Newsడైవర్షన్ పాలిటిక్స్ పనిచేయవు: చంద్రబాబు

డైవర్షన్ పాలిటిక్స్ పనిచేయవు: చంద్రబాబు

No Diversion Politics:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోలవరం, అమరావతి రెండు కళ్లలాంటివని, కానీ జగన్ ప్రభుత్వం ఈ రెండు కళ్ళూ పొడిచిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు 2021 నాటికి పూర్తి చేస్తామని చెప్పారని, కానీ 2022 నాటికి కూడా డౌటే అని స్వయంగా కేంద్ర మంత్రి చెప్పారని బాబు గుర్తు చేశారు. తాము చేపట్టిన పనులను కొనసాగించి ఉంటే పోలవరం 2020 నాటికే పూర్తి అయి ఉండేదాని, కానీ ఈ ప్రభుత్వం కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. మూడు రాజధానులు అంటూ అమరావతిని నాశనం చేశారని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి రాజధాని కోసం పోరాటం చేస్తున్న మహిళలు, రైతుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు గర్హనీయమని బాబు అన్నారు. కనీసం వారు భోజనం చేయడానికి ఫంక్షన్ హాళ్ళు కూడా అద్దెకు దొరకకుండా ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేస్తోందని మండిపడ్డారు.

విభజన హామీలను సాధించడంలో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, రైల్వే జోన్ సాధించలేకపోయారని, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సహకరిస్తున్నారని బాబు విమర్శలు చేశారు. కేంద్రం మెడలు వంచుతామంటూ మాటలు చెప్పి ఇప్పుడు చేతులెత్తేశారన్నారు. విభజన హామీల కోసం చిత్తశుద్ధి ఉంటే వైసీపీ ఎంపీలు రాజీనామా చేయాలని, తమ పార్టీ ఎంపీలు కూడా రాజేనామా చేస్తారని, అందరం కలిసి కేంద్రంపై పోరాడదామని సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వానికి మెజార్టీ ఉంది కాబట్టి తాము ఏమీ చేయలేమని అంటున్నారని, తాము అధికారంలో ఉన్నప్పుడు కూడా కేంద్రానికి మెజార్టీ ఉందని, కానీ తాము పోరాటం చేశామని గుర్తు చేశారు. విద్యార్ధులు, ఉద్యోగస్తులు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాస్తులంతా రోడ్డుమీదకు వచ్చి ఆందోళన చేస్తున్నారని….  ఉద్యోగస్తులకు పీఆర్సీ ఇవ్వడంలో కూడా ప్రభుత్వం విఫలమిందని అందుకే వారు ఉద్యమ బాట బాట పట్టారని బాబు అన్నారు.

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న చివరి రోజు నాటికి మొత్తం 60 ఏళ్ళలో రాష్ట్రం అప్పు 3.14 లక్షల కోట్ల రూపాయల ఉంటే ఇప్పుడు అది 7లక్షల కోట్లకు చేరిందని బాబు విస్మయం వ్యక్తం చేశారు. కొన్ని అప్పుల వివరాలను ప్రభుత్వం కనీసం చెప్పలేకపోతోందని దుయ్యబట్టారు.  రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ ఇక పనిచేయబోవని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వం వివిధ అంశాల్లో వివరణ చెప్పుకోవాల్సి వచ్చినప్పుడల్లా విపక్ష నేతలపై కేసులు పెట్టి ప్రజల దృష్టి మరల్చాలని చూస్తోందని బాబు చెప్పారు.  ప్రభుత్వంపై పోరాటానికి ప్రజలు తమతో కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు.

Also Read : జగన్ హత్యకు కుట్ర: ప్రకాష్ రెడ్డి

RELATED ARTICLES

Most Popular

న్యూస్