గల్వాన్ అమర జవాన్ల కుటుంబాలకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆర్థిక సాయం అందించారు. రాంచీలో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్తో కలిసి ఆ కుటుంబాలను కేసీఆర్ పరామర్శించారు. గల్వాన్లోయలో మరణించిన వీరజవాను కుందన్కుమార్ ఓఝా సతీమణి నమ్రత కుమారి, మరో వీరుడు గణేశ్ హన్సదా మాతృమూర్తి కప్రా హన్సదాలకు రూ.పది లక్షల చొప్పున చెక్కులను కేసీఆర్ అందజేశారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి లోనైన వారిని కేసీఆర్ ఓదార్చారు. అండగా ఉంటామని కేసీఆర్ భరోసానిచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
చైనా సైనికులు భారత్లోని గల్వాన్లోయపై పట్టు సాధించడానికి మన సైనికులతో రెండేండ్ల క్రితం ఘర్షణకు దిగిన విషయం తెలిసిందే. ఇరుదేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో తెలంగాణ బిడ్డ కల్నల్ భిక్కుమళ్ల సంతోష్కుమార్తో పాటు 19 మంది సైనికులు చనిపోయారు. దేశంకోసం ప్రాణత్యాగం చేసిన అమరుల కుటుంబాలకు ఒక భారతీయుడిగా అండగా ఉంటానని ఆనాడు సీఎం కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున అమరజవాన్ల ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఆర్ధిక సహాయం అందిస్తామని చెప్పారు. ఈ 19 మంది సైనికుల్లో ఇద్దరు జార్ఖండ్కు చెందినవాళ్లున్నారు.
అమర కుటుంబాలను ఆదుకొన్న ఏకైక నేత సాధారణంగా సరిహద్దుల్లో ఎవరైనా సైనికుడు వీరమరణం పొందిన సందర్భంలో ఆతని సొంత రాష్ట్రంలోని ప్రభుత్వం ఆ కుటుంబానికి అండగా నిలుస్తుంది. అమరయోధులకు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇచ్చిన దాఖలాలు ఎక్కడా కనిపించవు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే.. తాను మొదట భారతీయుడని.. ఆ తరువాతే తెలంగాణ బిడ్డ అని నిరూపించారు. సరిహద్దుల్లో శత్రువులను అడుగుకూడా కదపకుండా అడ్డుకోవడంలో దేశంకోసం ప్రాణాలర్పిస్తున్న యోధుల కుటుంబాలను ఆదుకోవాలన్న సమున్నతమైన ఆదర్శాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆచరించి చూపిస్తున్నారు.
Also Read : సాయి తేజ సేవలు మరువలేనివి: డిప్యూటీ సిఎం