Sunday, September 8, 2024
HomeTrending Newsతెరాస, బిజెపిలకు నక్సల్స్ హెచ్చరిక

తెరాస, బిజెపిలకు నక్సల్స్ హెచ్చరిక

మావోయిస్టులు ఒకే రోజు రెండు లేఖలు విడుదల చేయటం కలకలం రేపుతోంది. కొన్ని రోజులుగా స్తబ్దుగా ఉన్న తెలంగాణలో నక్సల్స్ కార్యకలాపాలు ఇటీవల పెరిగాయి. తాజాగా మునుగోడు ఉపఎన్నికలు, తెరాస, బిజెపి లను టార్గెట్ చేస్తూ మావోలు హెచ్చరికలు జారీ చేశారు. మునుగోడు ఉపఎన్నికపై మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. మావోయిస్టు పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ పేరిట.. ఆ లేఖ ఉంది. అధికారం కోసం బీజేపీ మతాల మధ్య చిచ్చుపెడుతోందని మావోయిస్టులు లేఖలో ఆరోపించారు. వ్యాపారం కోసం కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి బీజేపీ అవసరమైందన్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలు ముస్లింలను అవమానించేలా ఉన్నాయని లేఖలో వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ లంచగొండి, కుటుంబ పాలన వల్లే తెలంగాణలో బీజేపీ ముందుకు వచ్చిందని.. మావోయిస్టు నేత జగన్ లేఖలో ప్రస్తావించారు. ప్రజా వ్యతిరేక శక్తులకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. పీడన వ్యవస్థలను నిర్మూలించాలని సూచించారు.

ములుగు జిల్లా ఏటూరునాగారం మహదేవపూర్ ఏరియా కమిటీ కార్యదర్శి సబితా పేరుతో మరో లేఖ విడుదలైంది. గతంలో నుంచి ప్రభుత్వాలు నష్టాల పేరుతో పరిశ్రమలను మూత వేసి కార్మికులను రోడ్డున పడేశాయన్నారు. సింగరేణిలో 1,20,000 మంది కార్మికులు పని చేసేవారు ఇప్పుడు 42 వేలకు పడిపోయారన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను నష్టాల్లోకి నెట్టి… నష్టాలు వస్తున్నాయనే సాకుతో ప్రభుత్వాలు మూతపడేస్తున్నాయని లేఖలో మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మూతపడిన పరిశ్రమలు తెరిపిస్తామని మేనిఫెస్టోలో చేర్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పరిశ్రమ కూడా తెరవలేదన్నారు. పరిశ్రమలు మూతపడేసిన పాపం ప్రభుత్వాలదే అని పేర్కొన్నారు. ప్రభుత్వాలు తప్పులు చేసి కార్మికులను రోడ్డున పడేసి కార్మికుల కుటుంబాలతో చెలగాటం ఆడుతున్నాయంటూ మావోయిస్టులు లేఖలో తెలిపారు. 
RELATED ARTICLES

Most Popular

న్యూస్