అంగరంగ వైభవంగా జరిగిన అందాలపోటీలు ముగిశాయి. ఎవరెంతగా విమర్శించినా ఈ ప్రపంచసుందరి పోటీలు తెలంగాణా సంస్కృతీ సంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేశాయి. హైదరాబాద్ నగరమంతా సందడిగా మారింది. విశ్వనగరం భావన కనిపించింది. పోటీల్లో పాల్గొన్న దేశదేశాల అందాల భామలు క్షణం తీరికలేకుండా రకరకాలుగా పోటీ పడ్డారు. భారతదేశం నుంచి పోటీపడ్డ నందినీ గుప్తా కిరీటం గెలవకపోయినా టాప్ 20 వరకు చేరగలిగింది. 108 దేశాల సుందరీమణులు పాల్గొన్న పోటీల్లో ఫైనల్ కు ఎనిమిదిమంది ఎంపికవగా మొదటిస్థానాన్ని థాయిలాండ్ కు చెందిన ఒపెల్ సుచాత,రెండో స్థానాన్ని ఇథియోపియా కు చెందిన హాసెట్ డెరెజ్ అడ్మసు, మూడో స్థానం పోలాండ్ భామ మాజా క్లాజ్డా గెలుచుకున్నారు. అందం పక్కనపెడితే ఇతర అంశాల్లో వీరి ప్రజ్ఞా పాటవాలు అద్భుతం.
‘మా దేశం 72 ఏళ్లుగా కంటున్న కల నెరవేర్చినందుకు ఆనందంగా ఉంది’ అంటోన్న మిస్ వరల్డ్ -2025 సుచాత నేపథ్యం ఆసక్తికరం. 16 వ ఏట రొమ్ములో కణితి వచ్చింది. కాన్సర్ ఏమో అని వణికి పోయిందట. కాదని తెలిసి ఊపిరి తీసుకుంది. ఆపరేషన్ అయ్యాక కాన్సర్ బాధితులకోసం కృషి చేయాలనుకుంది.’ఓపల్ ఫర్ హర్’ పేరిట బ్రెస్ట్ కాన్సర్ అవేర్నెస్ క్యాంపెయిన్ ప్రారంభించింది. బ్యూటీ కాంటెస్ట్ ద్వారా తన కథను పంచుకుని మరింతగా సేవలందించేందుకు వీలుంటుందని పాల్గొన్నానంటుంది. తెలంగాణ సంప్రదాయాలు, ఆహారం, వస్త్రధారణ, ఆభరణాలు తెగ నచ్చేశాయట. ఎన్నో మంచి అనుభూతులతో తన దేశానికి వెళ్తోందట ఈ అందాల రాణి.
ఫస్ట్ రన్నరప్ హాసెట్ డెరెజ్ అడ్మసు వయసు 19 ఏళ్లే. కిందటేడాది ‘మిస్ వరల్డ్ ఇథియోపియా’ గా ఎంపికై మిస్ వరల్డ్ పోటీకి వచ్చింది. చుట్టూ ఉన్న వారి అభ్యున్నతి కోసం పాటుపడటమే అసలైన అందం అనే హాసెట్ తమ దేశంలోని గ్రామాల్లో తల్లీబిడ్డల ఆరోగ్యం, బాలికా విద్య గురించి పాటుపడుతోంది. ఈ పోటీలో ఈ స్థాయికి చేరిన తొలి ఇథియోపియా మహిళగా మరింతగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తాను అంటోందీ మనసున్న మారాణి.
మిస్ పొలోనియా, 2024 కిరీటం అందుకున్న మాజా క్లాజ్డా మిస్ వరల్డ్ -2025 సెకండ్ రన్నరప్. పిల్లలు, టీనేజ్ యువత మానసిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ఇప్పటికే 40 పైగా వర్క్ షాపులు నిర్వహించింది. అందరితో కలిసిపోవడం అంటే ఇష్టమనే మాజా మొదట్లో చాలా సిగ్గరి అట. ఈ పోటీలనుంచి ఎంతో నేర్చుకున్నానంటుంది ఈ సుందరి.
మార్టినిక్ కు చెందిన అరేలీ జో చిమ్ నాలుగవ స్థానం సాధించింది. 2016 లోనే మిస్ మార్టినిక్ గా ఎంపికైనా ఏడేళ్ల తర్వాత మిస్ వరల్డ్ లో పాల్గొనే అర్హత సాధించింది. ఆటల్లో ప్రతిభ ఉన్న ఈ అమ్మాయి ఒక మ్యాగజైన్ కి ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేస్తోంది. తన దేశానికి గుర్తింపు రావడమే ధ్యేయమనే అరేలీ బహుముఖ ప్రతిభాశాలి.
అంతా బానే ఉంది గానీ ఈ పోటీల వల్ల పేదవారికి ఏం ఒరిగింది అనేవారూ ఉన్నారు. అందులోనూ నిజం లేకపోలేదు. పేజ్ త్రీ పారిశ్రామిక వర్గానికే తప్ప తెలంగాణ శ్రామిక సమాజానికి ఈ అందాలపోటీలు ఆసక్తి కలిగించని మాట వాస్తవమే అయినా ప్రపంచపటంలో తెలంగాణకు పేరు వచ్చిందనడంలో సందేహం లేదు.
-కె. శోభ