Friday, March 29, 2024
Homeస్పోర్ట్స్సెమీస్ లో అడుగుపెట్టిన సింధు

సెమీస్ లో అడుగుపెట్టిన సింధు

Sindhu Into Semies:
బ్యాడ్మింటన్ వరల్డ్ టూర్ ఫైనల్స్-2021 టోర్నీలో భారత బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. నేడు  జరిగిన రెండో మ్యాచ్ లో జర్మన్ క్రీడాకారిణి వైవోన్ లీ పై 21-10; 21-13 తేడాతో ఘనవిజయం సాధించింది. ఆట మొదటి నుంచీ  సింధు తన పూర్తి ఆధిపత్యం చాటింది. నిన్న జరిగిన మ్యాచ్ లో డెన్మార్క్ కు చెందిన లైన్ క్రిస్టోఫియర్సన్ ను 21-14, 21-16 తేడాతో ఓడించిన సింధు నేడు రెండో విజయంతో తర్వాతి రౌండ్లోకి చేరుకుంది. కేవలం 31 నిమిషాల్లోనే మ్యాచ్ ముగిసింది.

మొత్తం నలుగురు ఆటగాళ్ళు ఉండే గ్రూప్ నుంచి ప్రతి ఒక్కరూ మిగిలిన ముగ్గురితో ఆడాల్సి ఉంటుంది. సింధుతో పాటు థాయిలాండ్ క్రీడాకారిణి చోచువోంగ్ కూడా తాను ఆడిన రెండు మ్యాచ్ లోనూ విజయం సాధించి సెమీస్ లో అడుగుపెట్టింది. రేపు సింధు-చోచువొంగ్ మధ్య కీలకమైన మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో గెలిచినవారు గ్రూప్ లో టాప్ ప్లేస్ లో ఉంటారు.

2016లో సెమీస్, 2017 లో ఫైనల్స్ కు చేరుకున్న సింధు 2018లో టైటిల్ గెల్చుకుంది. అయితే ఆ తర్వాత 2019, 2020 సంవత్సరాల్లో గ్రూప్ దశను దాటలేకపోయింది. ఈ ఏడాది ఒలింపిక్స్ కాంస్య పతకం గెల్చుకున్న సింధు  కొంత కాలంగా అత్యుత్తమ ప్రదర్శనతో రాణిస్తోంది.

కాగా, పురుషుల సింగిల్స్ గ్రూప్ ‘బి’ మ్యాచ్ లో డానిష్ ఆటగాడు విక్టర్ ఎక్సెల్ సన్ చేతిలో భారత క్రీడాకారుడు లక్ష్య సేన్ 21-15; 21-14  తేడాతో ఓటమి పాలయ్యాడు. అయితే ఈ గ్రూప్ నుంచి  ఇద్దరు ఆటగాళ్ళు రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరగడంతో లక్ష్య సేన్ కు సెమీస్ లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. ఈ విషయమై అధికారికంగా రేపు వెల్లడి కానుంది .

Also Read : డబుల్స్ లో నిరాశ, శ్రీకాంత్ ఓటమి

RELATED ARTICLES

Most Popular

న్యూస్