రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలు కలుగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఉమ్మడి వరంగల్ పరిధిలోని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అదేశించారు. సోమవారం ఉదయం ములుగు, భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల కలెక్టర్లు, సీపీ, ఎస్పీలు, పంచాయతీరాజ్ శాఖ, ఇతర శాఖల అధికారులతో మంత్రి టెలీఫోన్లో మాట్లాడారు. రాష్ట్రంలో గతకొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. మరికొన్ని రోజులపాటు వర్షాలు ఇలానే కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చిరిస్తున్నది. ఈనేపథ్యంలో అధికారులు అప్రమత్తంగాగా ఉండాలని సూచించారు.
ములుగు జిల్లాలో గోదావరి పరివాహక ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, గోదావరి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున ఏ విధమైన ఆస్తి నష్టం జరగకుండా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. ఇక గతేడాది వరంగల్ నగరంలో భారీ వర్షాల వల్ల వరద ప్రవాహం పెరిగి నష్టం జరిగిందని, ఈసారి అలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. వరద నష్ఠాలను ఎప్పటికప్పుడు తెలుసుకొని నివారణ చర్యలు చేపట్టడానికి కలెక్టరేట్లో, వరంగల్ నగర పాలకసంస్థ కార్యాలయంలో టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేయాలని కోరారు.
మిషన్ భగీరథ నీటి సరఫరాకు ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడాలని, ఒకవేళ సమస్యలు తలెత్తితే వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని, సీజనల్ వ్యాధుల ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశిచారు. వెంటనే జిల్లా పరిషత్ సీఈఓలు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, గ్రామ కార్యదర్శులను అప్రమత్తం చేయాలని మంత్రి సూచించారు.
Also Read : గోదావరికి పెరిగిన వరద పరివాహకంలో అప్రమత్తం