Friday, March 29, 2024
HomeTrending Newsఅశోక్ గహ్లోత్ ను దారిలోకి తెస్తున్న అధిష్టానం

అశోక్ గహ్లోత్ ను దారిలోకి తెస్తున్న అధిష్టానం

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక ఆ పార్టీలో కొత్త వివాదానికి దారితీస్తోంది. ఈ రోజు ఉదయం నుంచి జైపూర్, ఢిల్లీలలో కాంగ్రెస్ నేతలు రాజస్తాన్ వివాదాన్ని చక్కదిద్దేందుకు ఆపసోపాలు పడుతున్నారు. అశోక్ గహ్లోత్ పార్టీ నియామవలికి కట్టుబడి ఉండాలని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే తెగేసి చెప్పారు. రాజస్తాన్ పరిశీలకుడిగా వ్యవహరిస్తున్న ఖర్గే ఈ రోజు జైపూర్ లో అశోక్ గహ్లోత్  తో సమావేశమై… తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. కాంగ్రెస్ నేతలు క్రమశిక్షణతో మెలగాలని మరో నేత అజయ్ మఖేన్ స్పష్టం చేశారు. జైపూర్ లో ఈ రోజు మంత్రి శాంతి ధరివాల్ తో మఖేన్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అశోక్ గహ్లోత్ వర్గానికి చెందిన నేతలు శాంతి ధరివాల్, సిపి జోషి, ప్రతాప్ ఖచ్రియవాస్ పాల్గొన్నారు.

మరోవైపు రాజస్థాన్ వ్యవహారాలపై ఆ పార్టీ సీనియర్ నేత మార్గరెట్ ఆల్వా మండిపడ్డారు. వ్యక్తీగత ప్రయోజనాలు పక్కనపెట్టి పార్టీ ఉన్నతి కోసం కృషి చేయాలని రాజస్తాన్ నేతలకు హితవు పలికారు. పార్టీ నిబంధనలు ఉల్లంఘిస్తే కటిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

అశోక్ గహ్లోత్ ఢిల్లీ వైపు అడుగులు వేస్తూనే జైపూర్ లో తన పట్టు కోల్పోకూడదనే ధోరణిలో వ్యవహరిస్తున్నారు. దీంతో పార్టీ పరువు బజారు పాలవటం… శ్రేణుల్లో అయోమయం నేలకొనటం..వెరసి నాయకత్వానికి తలనొప్పిగా మారింది. ఉదయ్ పూర్ లో పార్టీ ఆమోదించిన తీర్మానం మేరకు రాజస్తాన్ లో సీఎం పదవిని అశోక్ గహ్లేట్ వదులుకోక తప్పడం లేదు. దీంతో తన అనుయాయుడైన సీపీ జోషిని పదవిలో కూర్చోబెట్టేందుకు ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేయిస్తున్న అశోక్ గెహ్లాట్ కు షాకులు తప్పడం లేదు. రాజస్తాన్ లో సజావుగా అధికార మార్పిడి చేసేందుకు అధిష్టానం దూతల్ని పంపిస్తే ఎమ్మెల్యేలు వారిని కలవకుండా రాజీనామాల పేరుతో బెదిరింపులకు దిగడం హైకమాండ్ కు ఆగ్రహం తెప్పిస్తోంది. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నా రాజస్తాన్ లో సీఎంగా కూడా కొనసాగుతానంటూ చివరి వరకూ పట్టుబట్టిన గెహ్లాట్.. అది కుదరకపోయేసరికి స్పీకర్ సీపీ జోషికి సీఎం పదవి ఇవ్వాలని పట్టుబట్టారు. తన ప్రత్యర్ధి సచిన్ పైలట్ కు అవకాశం దక్కకుండా చేసేందుకు వేసిన ఎత్తుగడ ఇది. అయితే కాంగ్రెస్ హైకమాండ్ దూతలుగా వచ్చిన అజయ్ మాకెన్, మల్లిఖార్జున్ ఖర్గేను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కలవకుండా చేసి రాజీనామాలంటూ బెదిరింపులకు దిగడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీంతో అశోక్ గహ్లోత్ కు అసలుకే ఎసరు వచ్చేలా కనిపిస్తోంది.

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు అవకాశం దక్కడమే కాకుండా ఆయన్ను అధ్యక్షుడిని చేసేందుకు హైకమాండ్ పెద్దలైన సోనియా, రాహుల్ వంటి వారు మద్దతు కూడా ఇస్తున్నారు. ఇలాంటి సమయంలో రాజస్తాన్ లో అధికారం తన చేయి దాటిపోకుండా గెహ్లాట్ వేస్తున్న ఎత్తులతో వారు కూడా తమ మనసు మార్చుకున్నట్లు కనిపిస్తున్నారు. దీంతో పరిస్దితి గమనించిన గెహ్లట్ ఏకంగా అధ్యక్ష ఎన్నికల బరిలో నుంచి తప్పుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అధ్యక్ష పదవి కంటే రాజస్తాన్ లో సీఎం పదవి నిలబెట్టుకుంటే చాలని అశోక్ గహ్లోత్ భావిస్తున్నట్లు అర్ధమవుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి గెహ్లాట్ నామినేషన్ వేయకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్