Friday, October 18, 2024
HomeTrending Newsదెబ్బతిన్న రోడ్లన్నీ బాగు కావాలి - మంత్రి ఎర్రబెల్లి

దెబ్బతిన్న రోడ్లన్నీ బాగు కావాలి – మంత్రి ఎర్రబెల్లి

రాష్ట్రంలో పంచాయతీ అధికారులు, సిబ్బంది మెరుగ్గా పనిచేయడం వల్ల తెలంగాణకు జాతీయస్థాయిలో అవార్డులు వచ్చాయని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ది శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అదే స్ఫూర్తితో పనిచేయాలని సూచించారు. శనివారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, డీపీవోలు, మండల పంచాయతీ అధికారులు, డీఆర్డీవోలతో మంత్రి మాట్లాడారు.

‘ రాష్ట్రంలో పంచాయతీ రోడ్లు అద్దంలా ఉండాలి. వర్షాకాలంలో మొదటి వర్షం పడేటప్పటికీ ఏ ఒక్క రోడ్డు మీద గుంత కనిపించవద్దు. దెబ్బతిన్న రోడ్లన్ని బాగు కావాల’ని ఆదేశించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావల్సిన రూ. 1100 కోట్లు విడుదల చేయక పోవడం వల్ల కొంత ఇబ్బంది ఏర్పడిందన్నారు. ఈ విషయాన్ని అధికారులు, సర్పంచులు అర్థం చేసుకోవాలని సూచించారు.

కేంద్రం ఇస్తున్న గ్రాంట్ కు సమానంగా గ్రాంట్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణనే అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక పంచాయతీలకు 8 ఏళ్లలో వచ్చిన నిధులు అంతకుముందు 50 ఏళ్లలో కూడా రాలేదన్నారు. ప్రభుత్వ పథకాల వివరాలను ప్రతి పంచాయతీలో బోర్డులు చేసి పెట్టించాలని వెల్లడించారు. గ్రామ పంచాయతీ భవానాలకు ఇటీవల మంజూరు చేసిన 3686 భవనాల నిర్మాణం వేగవంతం చేయాలని ఆదేశించారు.

ప్రతి నియోజక వర్గానికి రూ. 5 కోట్లతో రోడ్ల ప్రతిపాదనలు ఇవ్వాలన్న జాబితా వెంటనే ఇవ్వాలని ఆదేశించారు. ఈ కాన్ఫరెన్సులో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కార్యదర్శి సందీప్ సుల్తానియా, ఇంజినీర్ ఇన్ చీఫ్ సంజీవ రావు, కమిషనర్ హనుమంతరావు ఇతర అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్