ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(RSS) నేతలు నాగపూర్ లో సమావేశం అవుతున్నారు. ఈ రోజు నుంచి రెండు రోజుల పాటు జరిగే సమావేశాల్లో సంఘ్ అనుభంద విభాగాలకు కార్యాచరణ నిర్దేశించనున్నారు. సమావేశాలకు భారతీయ మజ్దూర్ సంఘ్(BMS), అఖిల భారతీయ విద్యార్ధి పరిషద్(ABVP), విశ్వ హిందూ పరిషత్(VHP), విద్యా భారతి తదితర సంస్థల నుంచి ముఖ్య నేతలు హాజరవుతున్నారు. ప్రతి ఏడాది RSS సమన్వయ కమిటీ సమావేశం సెప్టెంబర్ నెలలో జరుగుతుంది. అయితే ఈ ఏడాది జరిగే సమావేశానికి ప్రాధాన్యత ఉంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో సంఘ్ తరపున అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేస్తారు.
మరోవైపు రాజస్తాన్ లో RSS చీఫ్ మోహన్ భగవత్ ఈ నెలలో పర్యటిస్తున్నారు. ఈ నెల 17 నుంచి 20 వ తేది వరకు చిత్తోర్ గడ్ కేంద్రంగా మొదటి దశ నాలుగు రోజుల పర్యటన ఉంటుంది. రెండో దశలో జోద్ పూర్ కేంద్రంగా మూడు రోజుల పర్యటన ఉంటుంది. రెండు దఫాలుగా జరిగే పర్యటనలో రాష్ట్రంలోని అన్ని ముఖ్య నగరాల్లో సమావేశాలు నిర్వహిస్తారు. కోవిడ్ నిభందనలకు అనుగుణంగా కార్యక్రమాలు ఉంటాయని రాజస్థాన్ సంఘ్ వర్గాలు వెల్లడించాయి. ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ల ప్రభుత్వం తర్వాతి పరిణామాలు సరిహద్దు రాష్ట్రమైన రాజస్థాన్ మీద ప్రాభవం, ఐదు రాష్ట్రాల ఎన్నికలు మొదలైన అంశాలపై రాష్ట్ర సంఘ్ నేతలతో భగవత్ చర్చిస్తారని సమాచారం.