Friday, March 13, 2026
HomeTrending Newsతీవ్రమవుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం

తీవ్రమవుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం

రోజులు గడిచే కొద్దీ ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధం తీవ్రమవుతోంది. రష్యా క్షిపణులతో దాడులు మొదలు పెట్టింది. దీనికనుగుణంగా ఉక్రెయిన్‌కు కూడా అమెరికా ఆయుధాలు అందిస్తోంది. ఈ వార్‌లో ఉక్రెయిన్‌కు చెందిన పౌరులు చనిపోతున్నారు. అయినా సరే ఉక్రెయిన్ తలవంచకుండా పోరాడుతూనే ఉంది. దీంతో ఈ యుద్ధం ఇప్పట్లో ఆగే దాఖలాలు కనిపించడం లేదు. రష్యా చేస్తున్న దాడులతో ఉక్రెయిన్​కు తీవ్ర నష్టం వాటిళ్లుతోంది. రష్యా ప్రయోగిస్తున్న మిస్సైల్ దాడుల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇందులో చాలా మంది సామాన్యులు, అన్యం, పుణ్యం ఎరుగని చిన్నారుల సంఖ్య అధికంగా ఉండటం ఆందోళనకరం.

ఇదే విషయంపై ఉక్రెయిన్ పార్లమెంట్​ ఆదివారం స్పందించింది. ఉక్రెయిన్​పై రష్యా దాడుల్లో ఇప్పటి వరకు 115 మంది చిన్నారులు ప్రాణాలు విడిచారని తెలిపింది. 140 మందికిపైగా ఉక్రెయిన్ యువకులు గాయాలపాలయ్యారని వివరించింది. ఇవి గణాంకాలు కావని..  వందలాది ఉక్రెయిన్​ కుటుంబాల బాధలని పార్లమెంటు అభివర్ణించింది. ఇదిలా ఉండగా.. ఆదివారం రాత్రి ఖార్కీవ్ నగరంపై రష్యా చేసిన ఎయిర్​ స్ట్రైక్​లో ఐదు మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని కీవ్​ ఇండిపెండెంట్​ తెలిపింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం ప్రపంచ దేశాలపై పడుతోంది. దిగుమతులపై ఆధారపడిన దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

రష్యా బాంబు దాడిలో ఉక్రెయిన్​లో చనిపోయిన నవీన్ శేఖరప్ప(21) డెడ్​బాడీ ఖార్కివ్​లోని మార్చురీలో ఉందని కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మై తెలిపారు. షెల్లింగ్ ఆగిన తర్వాత అతని మృతదేహాన్ని మన దేశానికి తీసుకురానున్నట్లు విదేశాంగ మంత్రి జై శంకర్ తెలియజేశారని చెప్పారు. పోయినవారంలో ఖార్కివ్​లోని ప్రభుత్వ బిల్డింగ్​పై రష్యా జరిపిన దాడిలో కర్నాటకకు చెందిన నవీన్ శేఖరప్ప చనిపోయాడు.

Also Read : ఉక్రెయిన్ సెక్యూరిటీ గార్డ్ కు రామ్ చరణ్ సాయం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular