భారత స్టార్ షట్లర్లు పివి సింధు, హెచ్ ఎస్ ప్రణయ్ లు మలేసియా మాస్టర్స్ -2023లో సెమీ ఫైనల్లో ప్రవేశించి పతకాలు ఖాయం చేశారు. మలేషియా రాజధాని కౌలాలంపూర్ లో జరుగుతోన్న ఈ టోర్నీలో నేడు జరిగిన క్వార్టర్స్ పోరులో వీరు విజయం సాధించారు. కిడాంబి శ్రీకాంత్ ఓటమి పాలై నిష్క్రమించారు.
మహిళల సింగిల్స్ లో పివి సింధు 21-16; 13-21; 22-20తో చైనా క్రీడాకారిణి ఝాంగ్ యి మన్ పై విజయం సాధించింది. తొలి సెట్ గెల్చుకున్న సింధు రెండో సెట్ ను కోల్పోయింది. హోరా హోరీగా సాగిన మూడో సెట్ లో చివరకు సింధు దే పైచేయి అయ్యింది.
పురుషుల సింగిల్స్ లో నువ్వా-నేనా అన్నట్లు సాగిన మ్యాచ్ లో హెచ్ ఎస్ ప్రణయ్ 25-23; 18-21; 21-13 తేడాతో జపాన్ క్రీడాకారుడు కెంటా నిశిమోతోపై గెలుపొందాడు.
మరో మ్యాచ్ లో కిడాంబి శ్రీకాంత్ పై ఇండోనేషియా ప్లేయర్ క్రిస్టియన్ అడినత 16-21; 21-16;21-11 తేడాతో గెలుపొందాడు. కిడాంబి తొలి సెట్ గెల్చుకున్న తరువాత పట్టు కోల్పోయి రెండు వరుస సెట్లలో వెనుకంజ వేసి ఓటమి పాలయ్యాడు.