Saturday, July 27, 2024
HomeTrending Newsఅంగన్ వాడీ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

అంగన్ వాడీ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి అధ్యక్షతన ప్రగతి భవన్ లో గురువారం రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. దాదాపు 5 గంటలపాటు సుదీర్ఘంగా సమావేశమైన కేబినెట్ పలు నిర్ణయాలు తీసుకున్నది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై క్యాబినెట్లో సమగ్రమైన చర్చ జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఆదాయంలో 15.3శాతం వృద్ధి రేటు నమోదైనట్లు అధికారులు తెలిపారు. అయితే, కేంద్ర ప్రభుత్వం నుంచి సీఎస్ఎస్, వివిధ పథకాల కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులు మైనస్ -12.9 శాతం తగ్గినప్పటికీ ఈ వృద్ధి రేటును నమోదు చేయడం గమనార్హమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ముఖ్యంగా కేంద్రం నిధులు విడుదల చేయడంలో S.N.A. అకౌంట్లు అనే కొత్త పద్ధతి తేవడం ద్వారా రాష్ట్రాలకిచ్చే నిధులలో తీవ్రమైన జాప్యం జరుగుతున్నది. అంతేకాక ఎఫ్.ఆర్.బి.ఎం. పరిమితులను సకాలంలో ఇవ్వకుండా పోవడం మరియు పరిమితుల్లో కూడా కోతలు విధించడం జరిగింది.

గత నాలుగు సంవత్సరాల్లో ఒక్క రైతుబంధు పథకం కింద రైతులకు 58,024 కోట్ల పంట పెట్టుబడి సాయం అందించడం జరిగిందని ఆర్థికశాఖ అధికారులు క్యాబినెట్ కు వివరించారు. కేంద్రం అవలంభిస్తున్న అసంబద్ధ విధానాల వల్ల రాష్ట్రాల వృద్ధి రేటు కుంటుపడుతుందని, రాష్ట్రం సాధించిన ప్రగతి కేంద్ర ప్రభుత్వం కూడా సాధించి ఉంటే, రాష్ట్ర జీఎస్డీపీ మరో 3 లక్షల కోట్లు పెరిగి, 14.50 లక్షల కోట్లకు చేరుకునేదని సీఎం కేసిఆర్ అభిప్రాయపడ్డారు.

దేశ జనాభాలో మన రాష్ట్ర జనాభా రెండున్నర శాతమే అయినప్పటికీ, దేశ ఆదాయానికి 5 శాతం మనం కంట్రిబ్యూట్ చేయడం జరిగింది. రాష్ట్ర స్వంత పన్నుల ఆదాయ వృద్ధిలో 11.5 శాతంతో తెలంగాణ దేశంలోనే ప్రధమస్థానంలో ఉందని అధికారులు కేబినెట్ కు వివరించారు.

ఆగస్టు నుంచి రాష్ట్రంలో కొత్తగా 10 లక్షల పెన్షన్లు మంజూరు చేస్తూ క్యాబినెట్ నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న 36 లక్షల పెన్షన్లకు అదనంగా 10 లక్షల కొత్త పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయం. మొత్తంగా కొత్తవి,. పాతవి కలిపి 46 లక్షల పెన్షన్ దారులకు కార్డులు. స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవాల సందర్భంగా 75 మంది ఖైదీల విడుదలకు క్యాబినెట్ నిర్ణయం.

కోఠి ఈఎన్.టి. ఆస్పత్రికి 10 మంది స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులు మంజూరు. కోఠి ఈఎన్.టి. ఆస్పత్రిలో అధునాతన సౌకర్యాలతో ఈఎన్.టి.టవర్ నిర్మించాలని నిర్ణయం. సరోజినీ దేవి కంటి దావాఖానలో కూడా అధునాతన సౌకర్యాలతో కూడిన నూతన భవన సముదాయం నిర్మాణానికి ప్రతిపాదనలు. కోఠిలోని వైద్యారోగ్యశాఖ సముదాయంలో కూడా ఒక అధునాతన ఆస్పత్రి నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 5111 అంగన్ వాడీ టీచర్లు, ఆయా పోస్టులను వెంటనే భర్తీ చేయాలని క్యాబినెట్ నిర్ణయం. వజ్రోత్సవాల్లో భాగంగా ఈనెల 21వ తేదీన తలపెట్టిన శాసనసభ, మరియు స్థానిక సంస్థల ప్రత్యేక సమావేశాలు రద్దు. ఈనెల 21వ తేదీన పెళ్లిళ్లు, శుభకార్యాలకు చివరి ముహూర్తం కావడం వల్ల పెద్దఎత్తున వివాహాది శుభకార్యక్రమాలు ఉన్నందున ప్రజా ప్రతినిధుల నుంచి వస్తున్న వినతులను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రత్యేక సమావేశాలను రద్దు చేయాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.
స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఈనెల 16వ తేదీన ఉదయం 11.30 నిమిషాలకు రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన జరపాలని నిర్ణయం. జీవో 58, 59 కింద పేదలకు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని చీఫ్ సెక్రటరీకి ఆదేశం.

గ్రామకంఠంలో నూతన ఇళ్ల నిర్మాణానికి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అధికారులతో ఒక కమిటీ వేసి, 15 రోజుల్లోగా ఒక నివేదిక ఇచ్చి, సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలన్న నిర్ణయం జరిగింది. వికారాబాద్ లో ఆటోనగర్ నిర్మాణానికి 15 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ క్యాబినెట్ నిర్ణయం. తాండూరు మార్కెట్ కమిటీకి యాలాలలో 30 ఎకరాల ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ క్యాబినెట్ నిర్ణయం. షాబాద్ లో షాబాదు బండల పాలిషింగ్ యూనిట్లను ఏర్పాటు చేయడానికి టీఎస్ ఐఐసీ ఆధ్వర్యంలో స్థలాల కేటాయింపునకు 45 ఎకరాలను కేటాయిస్తూ క్యాబినెట్ తీర్మానించింది.

ఐటీ రంగంలో గత సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో 1 లక్షా 55 వేల మందికి కొత్తగా ఉద్యోగాలు కల్పించి, దేశంలో అగ్రగామిగా నిలిచిందని ఐటీ శాఖ ప్రత్యేక కార్యదర్శి జయేష్ రంజన్ కేబినెట్ కు తెలిపారు. ఐటీ రంగంలో అగ్రగామిగా ఉన్న బెంగలూరు నగరంలో 1 లక్షా 48 వేల ఉద్యోగాలు కల్పన చేయగా, హైదరాబాద్ అంతకంటే ఎక్కువగా 1 లక్షా 55 వేల మందికి కొత్తగా ఉద్యోగాలు కల్పించడం జరిగిందని ఐటీ అధికారులు వివరించారు. ఐటీ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రత్యేక విధానాలు, ఇన్సెంటివ్ లు, ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ పాలసీలు, మౌలిక వసతుల కల్పన, సుస్థిర శాంతిభద్రతలు, నిరంతరాయ నాణ్యమైన విద్యుత్ సరఫరా, మానవ వనుల లభ్యత వల్ల ఐటీ రంగం లో అభివృద్ది సాధ్యమైందని తెలిపారు. ఈసందర్భంగా…రాష్ట్ర ఐటీరంగ అభివృద్ధిపై ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ను, ఐటీశాఖ ప్రత్యేక కార్యదర్శి జయేశ్ రంజన్ ను, ఇతర అధికారులను ప్రశంసించారు.

Also Read తెలంగాణలో పదిరెట్లు పెరిగిన పెన్షన్లు: మంత్రి కేటీఆర్‌

RELATED ARTICLES

Most Popular

న్యూస్