Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ వశమయ్యాక పాకిస్తాన్ తో వ్యాపార లావాదేవీలు పెరిగాయి. పది రోజుల్లోనే 50 శాతం వ్యాపారం పెరిగింది. ఆఫ్ఘన్ సరిహద్దుల్లోని చమన్ పట్టణం చేరుకునేందుకు వివిధ రకాల సరుకులతో కూడిన  వందల లారీలు బారులు తీరాయి. ఆఫ్ఘనిస్తాన్ తో మిగతా దేశాలకు సరిహద్దు రాకపోకలని తాలిబన్లు నిలిపివేశారు. దీంతో పాకిస్తాన్ తో వాణిజ్య లావాదేవీలు పెరిగాయని ఆఫ్ఘన్ ఛాంబర్ అఫ్ కామర్స్ వెల్లడించింది.

ఆఫ్ఘన్ సరిహద్దుల్లోని చమన్ పట్టణం వద్ద బారులు తీరిన లారీలు 

ఎగుమతులకన్నా పాకిస్తాన్ నుంచి దిగుమతులు పెరిగాయని ఛాంబర్ అఫ్ కామర్స్ ప్రతినిధి వివరించారు. కాగా తాలిబాన్ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్న జబిహుల్లః  ముజాహిద్ తో ఛాంబర్ సభ్యులు సమావేశమై దేశ, ఎగుమతులు, దిగుమతుల వివరాలతో కూడిన నివేదికను అందచేశారు. బ్యాంకుల మూసివేత, దేశంలో ఆర్థిక పరిస్థితుల్ని చర్చించారు. ప్రస్తుతం అవలంబిస్తున్న విధానాలు, సంప్రదాయాల్ని తాలిబాన్ ప్రతినిధి అడిగి తెలుసుకున్నారు. వ్యాపార,వాణిజ్య వ్యవహారాల్లో తాలిబాన్ విధానం ప్రకారం నడుచుకోవల్సి ఉంటుందని, త్వరలోనే సమగ్ర విధానం ప్రకటిస్తామని ఈ సందర్భంగా ముజాహిద్ స్పష్టం చేశారు. తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడేవరకూ గనుల తవ్వకాలు నిలిపివేయాలని ముజాహిద్ ఆదేశించారు.

ఆఫ్ఘన్ – పాక్ సరిహద్దుల్లో భారీగా ట్రాఫిక్

ఇదే సమయంలో ఇరాన్ నుంచి చమురు, గ్యాస్ దిగుమతులకు తాలిబన్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఇరాన్ నుంచి భారీగా సప్లై జరుగుతోంది. ఇరాన్ తో తాలిబాన్ లకు జాతి రిత్యా శత్రుత్వం ఉన్నా దిగుమతులకు అనుమతి ఇవ్వటం చర్చనీయాంశం అయింది. తాలిబన్లు సున్నీ తెగ కాగా ఇరాన్ పాలకులు షియా తెగకు చెందినవారు. ఇరాన్ లో షియా జనాభా ఎక్కువ.

ఇరాన్, పాకిస్తాన్ లతో మాత్రమే ఆఫ్ఘన్ వాణిజ్య లావాదేవీలు జరగటం వెనుక చైనా, రష్యాల మంత్రాంగం ఉంది అనటంలో సందేహం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com