Tuesday, September 17, 2024
HomeTrending NewsTTD: ఆధార్ తోనే అదనపు లడ్డూ

TTD: ఆధార్ తోనే అదనపు లడ్డూ

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలపై టిటిడి ఆంక్షలు విధించింది. ఇకపై కౌంటర్ లో ఆధార్  కార్డు చూపిస్తేనే అదనపు లడ్డూలు ఇవ్వనున్నారు. మూడేళ్ళ క్రితం లడ్డూ విక్రయాలపై నిబంధనలు సడలించి టికెట్ తో పాటు ఇచ్చే లడ్డూలతో పాటు అప్పటి కప్పుడు నగదు చెల్లించి ఎన్ని లడ్డూలైనా అందజేసేలా నూతన విధానం ప్రవేశ పెట్టారు. ఈ విధానానికి నేటినుంచి స్వస్తి పలికి ఒక ఆధార్ పై ఒక లడ్డూ మాత్రమే ఇవ్వనున్నారు.

గతంలో  లడ్డూ తయారీకి కావాల్సిన నెయ్యిని కర్ణాటక ప్రభుత్వ అధికార డెయిరీ నందిని కంపెనీ సరఫరా చేసేది. ధర విషయంలో టిటిడికి- నందిని కార్పొరేషన్ కు మధ్య ఓ అంగీకారం కుదరకపోవడంతో గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఈ నెయ్యి కొనుగోలు ఆపేశారు. అయితే లడ్డూల నాణ్యత, మన్నిక లాంటి అంశాలపై భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. మునుపటి రుచి ఉండడం లేదని, ప్రసాదం వాసన వస్తోందని, ఎక్కువకాలం మన్నిక కూడా ఉండడం లేదని భక్తులు వివిధ మాధ్యమాల ద్వారా టిటిడి బోర్డుకు తమ అభిప్రాయాలు తెలిపారు. దీనితో లడ్డూ విషయంలో  టిటిడి ఈవో జె. శ్యామలరావు ప్రత్యేక దృష్టి సారించి గతంలో మాదిరిగానే నందిని నుంచే నెయ్యి కొనుగోలు చేయాలని నిర్ణయించారు. నిన్న రాత్రి బెంగుళూరు నుంచి 35౦టన్నుల నెయ్యి లోడును తిరుమలకు పంపుతూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య లారీలను జెండా ఊపి ప్రారంభించారు.

అయితే ఈరోజు హఠాత్తుగా ఒక్క లడ్డూ నిర్ణయం టిటిడి తీసుకోవడం భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఒక్కో భక్తుడికీ దర్శనం టికెట్ పై ఒక లడ్డూ, ఆధార్ కార్డ్ తో మరో లడ్డూ రెండు మాత్రమే సరఫరా చేస్తామంటూ లడ్డూ కౌంటర్ లో వారు చెబుతుండడంతో భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిపై టిటిడి బోర్డు ఎలాంటి వివరణ ఇస్తుందో వేచి చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్