Thursday, April 25, 2024
HomeTrending Newsనేటి నుంచి పిల్లలకు టీకా

నేటి నుంచి పిల్లలకు టీకా

పిల్లలకు కొవిడ్‌ టీకా సోమవారం నుంచి ఇవ్వనున్నారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను వైద్య ఆరోగ్యశాఖ శనివారం విడుదల చేసింది. మరోవైపు వ్యాక్సినేషన్‌ కోసం 15 నుంచి 18 ఏళ్లలోపు పిల్లల వివరాలను కొవిన్‌ పోర్టల్‌లో రిజిస్టర్‌ చేసుకునే సేవలు కూడా శనివారం నుంచే ప్రారంభమయ్యాయి. అయితే గ్రేటర్‌ హైదరాబాద్‌తో పాటు 12 మునిసిపల్‌ కార్పొరేషన్లలో కొవిన్‌ పోర్టల్‌ ద్వారా టీకా కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుందని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఆ 12 కార్పొరేషన్ల వివరాలు కొవిన్‌ పోర్టల్‌లో ఉంటాయని తెలిపింది. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో పిల్లలకు రిజిస్ట్రేషన్‌ అవసరం లేదని, నేరుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్‌ పీహెచ్‌సీలకు తీసుకెళ్లి టీకా వేయించవచ్చని  పేర్కొంది. గుర్తింపు కోసం వారి ఆధార్‌ కార్డులను తీసుకెళ్లాల్సి ఉంటుంది. పిల్లలు వారి తల్లిదండ్రులతో టీకా కేంద్రాలకు వెళ్లాలి. పిల్లలకు భారత్‌ బయోటెక్‌ కంపెనీకి చెందిన కొవ్యాక్సిన్‌ టీకాను మాత్రమే అందిస్తారు. వైద్యుల పర్యవేక్షణలో టీకా తీసుకున్నాక.. 30 నిమిషాల పాటు టీకా కేంద్రంలోనే ఉండాలి. వారిలో ఎటువంటి దుష్పరిణామాలు లేవని గమనించాకే అక్కడి నుంచి వైద్యులు పంపుతారు. 28 రోజుల తర్వాత విధిగా టీకా రెండో డోసు తీసుకోవాలి. రాష్ట్రంలో 15-18 ఏళ్లవారు 22.78 లక్షల మంది ఉన్నారు. 2007 లేదా అంతకుముందు పుట్టిన పిల్లలే టీకాకు అర్హులు.

తొలిరోజు వరంగల్‌, హైదరాబాద్‌లోనే స్లాట్లు..

కొవిన్‌ పోర్టల్‌ ద్వారా పిల్లల వ్యాక్సిన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో తొలిరోజైన శనివారం గ్రేటర్‌ హైదరాబాద్‌తో పాటు వరంగల్‌ పట్టణవాసులే స్లాట్‌ బుక్‌ చేసుకోగలిగారు. జీహెచ్‌ఎంసీతో పాటు 12 మునిసిపాలిటీల్లో కొవిన్‌ ద్వారా స్లాట్లు బుక్‌ చేసుకోవచ్చని వైద్యశాఖ పిల్లల వ్యాక్సినేషన్‌ మార్గదర్శకాల్లో పేర్కొంది. కానీ గ్రేటర్‌ హైదరాబాద్‌, వరంగల్‌ పట్టణాలు మినహాయిస్తే కొవిన్‌ పోర్టల్‌లో మిగిలిన ప్రధాన పట్టణాల్లో ఎక్కడా స్లాట్‌ చూపించలేదని పలువురు పేరెంట్స్‌ తెలిపారు. అయితే ఒకటి రెండు రోజుల్లో మిగిలిన పట్టణాల్లోనూ వ్యాక్సినేషన్‌ కేంద్రాల జాబితాను కొవిన్‌ సాఫ్ట్‌వేర్‌లో అప్‌లోడ్‌ చేస్తామని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు అంటున్నారు. దాంతో ఇతర ప్రాంతాల్లోనూ కొవిన్‌ ద్వారా స్లాట్‌ బుక్‌ చేసుకునే వెసులుబాటు కలుగుతుందని తెలిపారు.

ప్రైవేటులో ఒక్కో డోసు రూ.1,410

హైదరాబాద్‌లోని ప్రభుత్వ టీకా కేంద్రాల్లో పిల్లల కోసం ఒక్కో స్లాట్‌కు 250 మందికి అవకాశం కల్పించారు. వరంగల్‌లోని ప్రభుత్వ టీకా కేంద్రాల్లో కేవలం పిల్లలకు 50 స్లాట్స్‌నే కేటాయించారు. క్రమంగా ఈ సంఖ్యను పెంచనున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి. ఇక హైదరాబాద్‌లోని పలు ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ పిల్లల వ్యాక్సినేషన్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. శనివారం కొవిన్‌ పోర్టల్‌లో పలు ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ పిల్లల టీకా కేంద్రాలు ఉన్నట్లు కనిపించింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఒక్కో వ్యాక్సిన్‌ డోసు రూ.1410గా నిర్ణయించారు. పెద్దలకు ఇస్తున్న మాదిరిగానే పిల్లలకు కూడా అంతే (0.5 ఎంఎల్‌) డోసు ఇస్తామని వైద్యవర్గాలు తెలిపాయి.

వైద్యుడి సూచన మేరకే బూస్టర్‌..

????ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లతో పాటు 60 ఏళ్లు పైబడిన వారికి జనవరి 10 నుంచి టీకా బూస్టర్‌ (ప్రికాషన్‌) డోసు ఇవ్వనున్నారు. వారికి ఏ వ్యాక్సిన్‌ ఇవ్వాలన్నది కేంద్రం ఇచ్చే మార్గదర్శకాలపై ఆధారపడి ఉంటుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. రెండో డోసు తీసుకున్న 9 నెలలు లేదా 39 వారాల తర్వాతే బూస్టర్‌ డోసు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ నిర్దిష్ట కాలపరిమితిని పూర్తి చేసుకున్న ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు ఈ నెల నుంచే బూస్టర్‌ డోసు ఇవ్వనున్నట్లు పేర్కొంది. 60 ఏళ్లు పైబడిన, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల్లో రెండో డోసు గతేడాది ఏప్రిల్‌లో తీసుకున్నవారికి బూస్టర్‌ డోసు ఇచ్చే ప్రక్రియను ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభిస్తామని వివరించింది.

వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు పూర్తి

పిల్లల వ్యాక్సినేషన్‌కు ప్రభుత్వం ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. జనవరి 1 నుంచే కొవిన్‌లో రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. పిల్లల టీకాలు, బూస్టర్‌ డోసులకు సంబంధించి రాష్ట్రం వద్ద సరిపడా స్టాక్‌ ఉంది. వ్యాక్సినేషన్‌ సిబ్బందికి టీకా నిర్వహణ మార్గదర్శకాలను తెలియజేశాం. వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో ఉండే వైద్య సిబ్బందికి తగిన శిక్షణ కూడా ఇచ్చాం. 15-18 ఏళ్ల పిల్లలందరికీ తల్లిదండ్రులు విధిగా టీకాలు వేయించాలని కోరుతున్నాం. గడల శ్రీనివాసరావు, రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు,

RELATED ARTICLES

Most Popular

న్యూస్