Monday, June 8, 2026
HomeTrending Newsఅంతరిక్షయాత్ర విజయవంతం

అంతరిక్షయాత్ర విజయవంతం

వినువీధిలో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. వర్జిన్‌ గెలాక్టిక్‌ అంతరిక్షయాత్ర విజయవంతమైంది. ఆరుగురు సభ్యుల బ్రాన్సన్‌ బృందం రోదసీ యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకుని  దాదాపు 90 నిమిషాలకు తిరిగివచ్చారు. రోదసిలోకి మన తెలుగు అమ్మాయి తొలిసారి ప్రవేశించారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన బండ్ల శిరీష ఈ ఘనత సాధించారు. ప్రముఖ అంతరిక్ష సంస్థ వర్జిన్‌ గెలాక్టిక్‌ ఆదివారం మానవ సహిత వ్యోమనౌక వీఎస్‌ఎస్‌ యూనిటీ-22ను వీఎంఎస్‌ ఈవ్‌ అనే ప్రత్యేక విమానం భూమి నుంచి 15,000 మీటర్ల ఎత్తుకు తీసుకెళ్లింది. అనంతరం అక్కడి నుంచి రాకెట్‌ ప్రజ్వలనంతో యూనిటీ-22 మరింత ఎత్తుకు వెళ్లింది. చివరి దశలో  సొంత ప్రయాణాన్ని ప్రారంభించింది.

ఈ వ్యోమనౌకలో వర్జిన్‌ గెలాక్టిక్‌ సంస్థ వ్యవస్థాపకుడు రిచర్డ్‌ బ్రాన్సన్‌తో పాటు మరో అయిదుగురు ప్రయాణించగా వారిలో 34 ఏళ్ల శిరీష కూడా ఉన్నారు. నాలుగో వ్యోమగామిగా ఉన్న శిరీష వ్యోమనౌకలో మానవ తీరుతెన్నులకు సంబంధించి ఫ్లోరిడా విశ్వవిద్యాలయం రూపొందించిన ప్రయోగాన్ని నిర్వహించారు.  ఈ యాత్ర విజయవంతం కావడంతో భారత్‌ నుంచి అంతరిక్షానికి వెళ్లిన నాలుగో వ్యోమగామిగా శిరీష చరిత్ర పుటలకు ఎక్కారు. ఇంతకుముందు రాకేశ్‌ శర్మ, కల్పనా చావ్లా, భారత-అమెరికన్‌ సునీతా విలియమ్స్‌ రోదసిలోకి వెళ్లి వచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో జన్మించిన బండ్ల శిరీష తల్లిదండ్రులతోపాటు అమెరికాలోని హ్యూస్టన్‌లో స్థిరపడ్డారు. ప్రస్తుతం ఆమె వర్జిన్‌ గెలాక్టిక్‌లో ప్రభుత్వ వ్యవహారాలు, పరిశోధన కార్యకలాపాల విభాగానికి ఉపాధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular