Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

మహిళా రిజర్వేషన్ బిల్లుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి అపూర్వ స్పందన లభించింది. 13 రాజకీయ పార్టీలు, వివిధ ప్రజా, మహిళా సంఘాల నేతలు హాజరయి మద్దతు పలికారు. చర్చా వేదికలో పాల్గొని ఎంపీలు, నేతలు మాట్లాడారు.

శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది మాట్లాడుతూ….ఓటు వేయడంలో రాజ్యాంగ నిర్మాతలు మహిళలకు సమాన హక్కు కల్పించినప్పుడు… చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెంచడానికి అధికారంలో ఉన్న ప్రభుత్వం మహిళలకు ఎందుకు రిజర్వేషన్ కల్పించదని ప్రశ్నించారు. ఈ అంశంపై చట్టసభల్లో ఉన్న మహిళలు ప్రభుత్వాలను మరింతగా డిమాండ్ చేయాలని సూచించారు.

ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా మాట్లాడుతూ… రిజర్వేషన్ బిల్లుకు తాము మద్దతిస్తామని ప్రకటించారు. అయితే రిజర్వేషన్ లో రిజర్వేషన్ కోటా ఉండాలి అని ప్రతిపాదించారు. పార్లమెంటుతో పాటు బయటా లేవనెత్తాల్సిన అంశాలపై అవగాహన ఉండాలని అన్నారు. ప్రజా ఉద్యమాలను మరింత ఉధృతంగా నిర్మించాల్సిన అవసరం ఉందని మోహన్  ఝా తెలిపారు.

సీపీఐ ఎంపీ బినాయ్ బిశ్వం మాట్లాడుతూ… మహిళా రిజర్వేషన్ బిల్లుకు పితృస్వామ్య వ్యవస్థలు అడ్డొచ్చాయని విమర్శించారు. 21వ దశాబ్దంలో కూడా మహిళా హక్కులను సరికాదని సూచించారు. కల్వకుంట్ల కవిత ప్రారంభించిన ఈ ఉద్యమంలో తాము భాగస్వాములు అవుతామని ప్రకటించారు.

ఆర్ఎల్డీ పార్టీ మహిళా విభాగం నేత ప్రతిభా సింగ్, ఆ పార్టీ నేత భూపేంద్ర చౌదరి మాట్లాడుతూ…. రిజర్వేషన్లపై మహిళల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ముఖ్యంగా బిల్లుపై జరుగుతున్న చర్చల గురించి గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు అవగాహన లేదని చెప్పారు.

జేఎంఎం ఎంపీ మౌహ మాఝి మాట్లాడుతూ…. ఒకవైపు ఆజాదీ కా అమృత్ మహోత్సవం జరుపుకుంటున్న ఈ తరుణంలో చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం తక్కువ ఉండడం మంచిగా అనిపించడం లేదని అన్నారు. చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం కోసం రిజర్వేషన్ బిల్లు రావాల్సిందే, కవిత చేస్తున్న పోరాటానికి అండగా ఉంటామని తెలిపారు.

ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్ద మాట్లాడుతూ…. మహిళా రిజర్వేషన్ల కోసం కవిత లేవనెత్తిన డిమాండ్ కు తాము సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని ప్రకటించారు. ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉందని, దాన్ని సంస్కరణలు తీసుకురావడం కోసంతో పాటు ప్రజలకు మంచి చేసే బిల్లులను తీసుకురావడానికి ఉపయోగించాలని సూచించారు.

సమాజ వాది పార్టీ ఎంపీ ఎస్టీ హాసన్ మాట్లాడుతూ…మహిళలకు తగిన వాట కల్పించకుండా, గౌరవం ఇవ్వకుండా ఏ దేశం కూడా సూపర్ పవర్ కాబోదని స్పష్టం చేశారు. దేశం అభివృద్ధి కావాలంటే చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం పెరగాలి అని అన్నారు.

వీసీకే ఎంపీ తిరుమావలవన్ మాట్లాడుతూ… మహిళా రిజర్వేషన్ బిల్లు తక్షణ అవసరమని తెలిపారు. ఆలస్యం చేస్తే దేశానికి , ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది అని స్పష్టం చేశారు.

డీఏంకే ఎంపీ తమిళ్ సై తంగపంద్యాన్ మాట్లాడుతూ… వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో మహిళల భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కార్యరూపం దాల్చడానికి కవిత చేసే పోరాటంలో తాము కలిసి నడుస్తామని అన్నారు.

Also Read : మహిళా బిల్లు కోసం పోరాడతాం – ఎమ్మెల్సీ కవిత 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com