Friday, July 5, 2024
HomeTrending Newsపెన్షన్ల పంపిణీపై వైసీపీ నీచ రాజకీయం: చంద్రబాబు

పెన్షన్ల పంపిణీపై వైసీపీ నీచ రాజకీయం: చంద్రబాబు

పెన్షన్ల పంపిణీపై అధికార పార్టీ  నీచమైన రాజకీయం చేస్తోందని, దిగజారి ప్రవర్తిస్తోందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్లకు వ్యతిరేకం కాదని, వారు రాజకీయం చేయడానికే తాము వ్యతిరేకమని, దీనిపై ఎలాంటి రాజీ లేదని స్పష్టం చేశారు. వాలంటీర్లు తటస్థంగా ఉండాలని, రాబోయేది ఎన్డీయే ప్రభుత్వమేనని… వారికి తగిన న్యాయం చేస్తామని, వాలంటీర్లలో బాగా చదువుకున్నవారు ఉన్నారని…. నెలకు వారు 50 వేల రూపాయలు సంపాదించే విధంగా మార్గం చూపిస్తామని భరోసా ఇచ్చారు. వారిని రెచ్చగొట్టి రాజీనామాలు చేయిస్తూ వైఎస్సార్సీపీ వర్కర్లుగా తయారు చేస్తున్నారని బాబు విమర్శించారు. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటలో జరిగిన ప్రజాగళం బహిరంగసభలో బాబు ప్రసంగించారు.

వాలంటీర్లు ఫుల్ టైమ్ కాదని, అందుకే ప్రభుత్వ ఉద్యోగులే పెన్షన్లు పంపిణీ చేయాలని ఎన్నికల సంఘం చెప్పిందని… ప్రభుత్వ సచివాలయాలు ఉన్నాయని… లక్షా 26 వేల మంది ఉద్యోగులు ఉన్నారని…. వారిని వినియోగించుకుంటే రెండ్రోజుల్లో ప్రతి ఊళ్ళో పంపిణీ పూర్తి చేయించవచ్చని.. కానీ డ్రామాలు చేస్తున్నారని బాబు ధ్వజమెత్తారు. అధికార పార్టీ డ్రామాలు ఆడుతుంటే దానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తో పాటు యంత్రాగం కూడా సహకరిస్తోందని… ఒక్క నెల మీరు పెన్షన్లు ఇవ్వలేని అసమర్దులా అని ప్రశ్నించారు. ప్రతిపక్షాలపై బురద జల్లదానికే పెన్షన్లు ఇవ్వలేదన్నారు.వృద్ధులతో శవరాజకీయాలు చేస్తున్నారని, ఇది దుర్మార్గమని మండిపడ్డారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు.

పేదలు, వృద్ధులు, వికలాంగులకు పెన్షన్లు ఇవ్వడం మొదలు పెట్టింది ఎన్టీఆర్ ఆని, తాను మొదట సిఎం అయిన తరువాత దాన్ని 200 రూపాయలకు పెంచామని… దీన్ని రెండు వేల రూపాయలకు కూడా పెంచిన ఘనత తమదేనని గుర్తు చేశారు. మళ్ళీ అధికారంలోకి రాగానే పెన్షన్ ను 4 వేల రూపాయలకు పెంచి ఇంటి వద్దనే లబ్దిదారులకు అందిస్తామని హామీ ఇచ్చారు. అసలు ఈనెలలో పెన్షన్లు ఇవ్వడానికి మీ దగ్గర డబ్బులు ఉన్నాయా అంటూ నిలదీశారు.

సిఎం జగన్ తనను పశుపతి అని సంబోధించదంపై కూడా బాబు స్పందించారు. ఆ మాట విని తాను నవ్వుకున్నానని, ఏమీ ఆశ్చర్యపోలేదని… పశుపతి అంటే ప్రపంచాన్ని కాపాడిన శివుడని… తానూ కూడా శివుడి అవతారం ఎత్తానని, రాష్ట్రాన్ని కాపాడడానికి కృషి చేస్తున్నాని చెప్పారు. ఐదేళ్లుగా ఎన్నో ఇబ్బందులు, అవమానాలు, శారీరకంగా కూడా ఇబ్బందులు పెట్టినా ప్రజల కోసం భరించానని చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్