సికింద్రాబాద్లో మరో భారీ అగ్ని ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. స్వప్నలోక్ కాంప్లెక్స్ 7, 8 అంతస్తుల్లో షార్ట్ సర్క్యూట్ తో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయని ప్రాథమిక సమాచారం. ఈ ప్రమాదంలో చాలా మంది చిక్కుకున్నారు. వారిలో ఆరుగురు ఊపిరి ఆడక మృతి చెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి కొందర్ని రక్షించారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఐదు ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆర్పారు. స్వప్నలోక్ కాంప్లెక్స్ లో బట్టల షాపులు, గోడౌన్లు ఉన్నాయి. సెల్ ఫోన్ టార్చ్లు చూపిస్తూ రక్షించాలని పలువురు వేడుకున్నారు.
సికింద్రాబాద్ ప్యాట్నీ వద్ద గల స్వప్న లోక్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్వప్నలోక్ కాంప్లెక్స్ లోని 7,8 అంతస్థులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దట్టంగా పొగ వ్యాపించడంతో పలువురు ఆఫీసుల్లోంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఈ కాంప్లెక్స్ లో పలు కార్యాలయాలతో పాటు వాణిజ్య సముదాయాలు ఉండడంతో పదుల సంఖ్యలో ఉద్యోగులు చిక్కుకున్నారు. సహాయం కోసం ఫోన్ టార్చ్ చూపిస్తూ ఆర్తనాదాలు చేశారు. మంటల్లో చిక్కుకున్న వారు పొగతో ఉక్కిరి బిక్కిరి అయ్యారు.
ప్రమాదం సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలార్పేందుకు ప్రయత్నించారు. మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయచర్యలు చేపట్టారు ఫైర్ సిబ్బంది. అయితే అప్పటికే ఆరుగురు చనిపోయినట్టు గుర్తించారు. మంటలు వ్యాపించిన పొగ కారణంగా వాళ్లు ఇబ్బంది పడి మరణించారు. మరణించినవారిలో నలుగురు మహిళలు ఉన్నారు. శివ, ప్రశాంత్, శ్రావణి, ప్రమీల, వెన్నెల, త్రివేణి, వీళ్లంతా పాతికేళ్లలోపు ఉన్నవాళ్లే. వీళ్ల మృతదేహాలను పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతులంతా ఐదో ఫ్లోర్లో ఉన్న ఓ కంపెనీలో పని చేస్తున్నట్టు గుర్తించారు. వాళ్లను అతి కష్టమ్మీద అగ్నిమాపక సిబ్బంది బయటకు తీశారు.