Saturday, April 20, 2024
HomeTrending Newsసామాన్యుల చెంతకే పద్మశ్రీ -రాష్ట్రపతి

సామాన్యుల చెంతకే పద్మశ్రీ -రాష్ట్రపతి

2022 Parliament Budget Sessions :

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పార్లమెంటుకు విచ్చేసిన భారత రాష్ట్రపతికి ప్రధాని నరేంద్ర మోదీ, రాజ్యసభ చైర్మన్,ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోకసభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు, ఎంపీలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భంగా తొలుత ఆయన స్వాతంత్ర్య సమరయోధులకు నివాళి అర్పించారు.

రాష్ట్రపతి ప్రసంగంలో ముఖ్య అంశాలు .

కరోనాపై పోరాటంలో భారత్ స్ఫూర్తి అత్యద్భుతమని, వ్యాక్సినేషన్ తో కరోనా కట్టడి చేస్తున్నామని పేర్కొన్నారు. కేంద్రం, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కలసికట్టుగా మహమ్మారిపై పోరాడుతున్నాయని, వ్యాక్సినేషన్ లో యావత్ ప్రపంచానికే భారత్ ఆదర్శంగా నిలిచిందన్నారు. 15 నుంచి 18 సంవత్సరాల పిల్లల వ్యాక్సినేషన్ కార్యక్రమం శర వేగంగా సాగుతోందని, ఏడాది కాలంలో 15 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు వేశామని తెలిపారు. భారత్ లోనే మూడు వ్యాక్సిన్లు తయారవుతున్నాయని, వ్యాక్సిన్ల ఉత్పత్తిలో భారత్ రెండో స్థానంలో ఉందన్నారు. ఫార్మా రంగాన్ని విస్తరించేందుకు భారత ప్రభుత్వం కృషి చేస్తోందని, సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోందని వివరించారు.

ప్రధానమంత్రి ఆవాస్ యోజన కార్యక్రమంతో గృహ నిర్మాణాలు ఊపందుకున్నాయని, దేశంలో 80 శాతం మంది చిన్న, సన్నకారు రైతులే ఉన్నారని వారికి అధిక మద్దతు ధర ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. జల్ జీవన్ మిషన్ తో గ్రామాలకు తాగునీరు అందుతోంది. పద్మ పురస్కారాలను సామాన్యుల వరకు తీసుకెళ్లామని, గ్రామీణ మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు రుణపరిమితి  పెంచుతున్నామని వెల్లడించారు. దేశంలో ఏ పేదవాడు ఆకలితో ఉండకూడదనేదే ప్రభుత్వ లక్ష్యమని, 8 వేలకు పైగా జన్ ఔషధి కేంద్రాల ద్వారా తక్కువ ధరకే ఔషధాలను తయారు చేస్తున్నామన్నారు. ఈ-శ్రమ పోర్టల్ ద్వారా 23 కోట్ల మంది కార్మికులు కనెక్ట్ అయి ఉన్నారని వివరించారు.

దేశ వ్యాప్తంగా 2 కోట్ల మంది పేదలకు పక్కా గృహాలను నిర్మించామని, దేశంలోని 6 కోట్ల నివాసాలకు తాగునీటి కనెక్షన్లు ఇచ్చామన్నారు. వ్యవసాయ రంగంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చామని, 1,900 కిసాన్ రైళ్లు 6 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను తరలించాయని పేర్కొన్నారు. కొన్ని నెలలుగా జీఎస్టీ వసూళ్లు ప్రతి నెలా రూ. 1 లక్ష కోట్లకు పైగానే ఉన్నాయి. చిన్న, మధ్య తరగతి పరిశ్రమలకు రూ. 3 లక్షల కోట్ల కొల్లేటరల్ ఫ్రీ లోన్లను ఇచ్చాం. దేశంలో 36,500 కిలోమీటర్ల రహదారులను నిర్మించాం. ఎన్నో సమస్యలు ఎదురైనా కాబూల్ నుంచి భారతీయులను, ఆఫ్ఘనిస్థాన్ ప్రజలను తీసుకొచ్చాం. జమ్మూలో ఐఐటీ, ఐఐఎం నిర్మిస్తున్నామని, శ్రీనగర్-షార్జా అంతర్జాతీయ విమాన రాకపోకలు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఒకప్పుడు దేశవ్యాప్తంగా 126 నక్సల్స్ ప్రభావిత జిల్లాలు ఉండగా… ఇప్పుడు వాటి సంఖ్య 70కి తగ్గిందన్నారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి  ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ రాష్ట్రాల్లో రోడ్డు, రైల్ కనెక్టివిటీని పెంచాం. అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఈటానగర్ లో ఇప్పుడు అత్యాధునిక ఎయిర్ పోర్టు అందుబాటులోకి వచ్చిందన్నారు.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఎల్లుండి ఫిబ్రవరి రెండో తేదిన సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు లోక్‌సభ కార్యకలాపాలు సాగుతాయి. ఆ తర్వాత కూడా ఇదే సమయంలో పార్లమెంటు సమావేశాలు సాగనున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్