Monday, June 8, 2026
Homeజాతీయంకనీసం 6 వారాల లాక్‌డౌన్‌ - ఐసీఎంఆర్‌

కనీసం 6 వారాల లాక్‌డౌన్‌ – ఐసీఎంఆర్‌

కరోనా పాజిటివిటీ 10శాతం మించిన జిల్లాల్లో 6 నుంచి 8 వారాల పాటు లాక్‌డౌన్‌ అవసరమని భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ స్పష్టం చేశారు. కరోనా మహమ్మారి కట్టడికి ఎన్ని రోజులు లాక్‌డౌన్‌ అవసరమనే అంశంపై చర్చ జరుగుతున్న సమయంలో ఐసీఎంఆర్‌ చీఫ్‌ సూచనలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

‘అధిక పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాల్లో పూర్తిలాక్‌డౌన్‌ ఉండాల్సిందే. అక్కడ పాజిటివిటీ రేటు 10 నుంచి 5శాతానికి తగ్గితే ఆంక్షలను సడలించవచ్చు. అలా జరగాలంటే 6 నుంచి 8 వారాలు అవసరమని’ ఓ ఇంటర్వ్యూలో ఐసీఎంఆర్‌ చీఫ్‌ బలరాం భార్గవ పేర్కొన్నారు. ఈ సందర్భంగా దిల్లీ లాక్‌డౌన్‌ను బలరాం భార్గవ ప్రస్తావించారు. 35 శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు ప్రస్తుతం 17 శాతానికి తగ్గిందని, ఇలాంటి పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ను సడలిస్తే పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.

రాష్ట్రాల పాజిటివిటీ రేటు

దేశవ్యాప్తంగా కరోనా పాజిటివిటీ రేటు సరాసరి 21శాతం ఉన్నట్లు భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) పేర్కొంది. దేశంలో ఉన్న 718జిల్లాల్లో దాదాపు 310 జిల్లాల్లో దేశ సరాసరి(21%) కంటే ఎక్కువగా ఉండగా, మూడోవంతు జిల్లాల్లో పది శాతం కంటే ఎక్కువ పాజిటివిటీ రేటు ఉంది.

దేశంలో కరోనా పాజిటివిటీ రేటు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో గోవా తొలిస్థానంలో ఉండగా, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్‌, హరియాణా, కర్ణాటక రాష్ట్రాల్లో పాజిటివిటీ అధికంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. ప్రస్తుతం గోవాలో కరోనా పాజిటివిటీ రేటు దాదాపు 48 శాతం ఉండగా హరియాణాలో 37 శాతంగా ఉంది. హిమాచల్‌ప్రదేశ్‌, నాగాలాండ్‌లో పాజిటివిటీ రేటు ఇప్పుడిప్పుడే పెరుగుతోంది.

తెలంగాణలో పాజిటివిటీ రేటు 9శాతం, ఆంధ్రాలో 23శాతం వరకు ఉంది. ఈ నేపథ్యంలో పాజిటివిటీ రేటు 10శాతం మించిన జిల్లాల్లో 6 నుంచి 8 వారాలు లాక్‌డౌన్‌ విధించాలని జాతీయ టాస్క్‌ఫోర్స్‌ సూచిస్తోంది. ఈ విషయాన్ని ఏప్రిల్‌ 15న జరిగిన సమావేశంలో జాతీయ టాస్క్ ఫోర్స్ చర్చించినట్లు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular