Thursday, June 18, 2026
HomeTrending NewsTPCC:ఈ నెల 21న నల్గొండలో నిరుద్యోగ నిరసన

TPCC:ఈ నెల 21న నల్గొండలో నిరుద్యోగ నిరసన

రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ అంశంపై పెద్ద ఎత్తున ఉద్యమించాలని టీపీసీసీ నిర్ణయించింది. ఇందులో భాగంగా మే 4 లేదా 5న సరూర్ నగర్ మైదానంలో భారీ సభ నిర్వహించనుంది. ఈ సభకు ప్రియాంక గాంధీ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ విషయాలను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మంగళ వారం గాంధీ భవన్లో మీడియాకు వెల్లడించారు.
నిరుద్యోగ సమస్య, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై టీపీసీసీ చేపట్టిన ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఈ నెల 21న నల్గొండలోని మాహాత్మా గాంధీ యూనివర్సిటీలో నిరుద్యోగ నిరసన చేపడతామని రేవంత్ రెడ్డి తెలిపారు. తర్వాత ఈ నెల 24న ఖమ్మం, 26న ఆదిలాబాద్ లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
“మే 4 లేదా 5న సరూర్ నగర్ లో నిరుద్యోగుల సమస్యలపై భారీ సభ నిర్వహిస్తాం. ఈ సభలో శ్రీమతి ప్రియాంక గాంధీ గారు ముఖ్య అతిధిగా పాల్గొంటారు. ఇందులో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఏమి చేయబోతుందో వివరించబోతున్నాం. ప్రియాంక గాంధీ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో బీజీగా ఉన్నారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొని హైదరాబాద్ వస్తారు. తిరిగి కర్ణాటక వెళతారు. ప్రియాంక గాంధీ పర్యటనపై రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

తెలంగాణలో అధికారంలోకి వస్తే ఒకే రోజులో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని బండి సంజయ్ చెబుతున్నాడు. బండి మాటలు వింటే నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు అని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ వరదల సమయంలో బండి పోతే బండి ఇస్తామన్నారు… ఆ తరువాత ఇన్సూరెన్స్ ఉంది కదా అన్నారు. అసలు ఏ శాఖలో ఎన్ని ఉద్యోగ ఖాళీలు ఉన్నాయో బండికి తెలుసా? అని ప్రశ్నించారు. బండి సంజయ్ నిరుద్యోగ మార్చ్ మోడీ ఇంటి దగ్గర చేయాలి అన్నారు.

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ పాపం ముమ్మాటికీ సర్కారు దేనని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ కేసును సీబీఐతో విచారణ చేయించాల్సిందేనని పట్టుబట్టారు. పేపర్ లీక్ లో అసలు నిందితులు తప్పించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎస్పీఎస్సీ కేసు విచారణను రాష్ట్ర అధికారులు చేపడితే కేసులో నిజానిజాలు నిగ్గు తేలవు అని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం వివిధ సందర్భాల్లో వేసిన సిట్ లను చూస్తుంటే.. ప్రభుత్వంలో పెద్దలను కాపాడుకునేందుకే ప్రభుత్వం సిట్ ను ఉపయోగించుకుంటుందనే అభిప్రాయం కలుగుతుందన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై గ్రామ స్థాయి నుంచి అన్ని స్థాయుల్లో కాంగ్రెస్ పార్టీ, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ యూఐ పోరాటం చేశాయని గుర్తు చేశారు. పేపర్ లీకేజీ కేసులో కేటీఆర్ భర్తరఫ్ చేయాలని, సంబంధిక కమిషన్ పై చర్యలు తీసుకోవాలని గవర్నర్ కోరామని ఆయన గుర్తు చేశారు. అయిన గవర్నర్ చర్యలు తీసుకోలేదన్నారు. ప్రభుత్వ సిట్..కేటీఆర్ కనుసన్నుల్లో పని చేస్తూ ఇద్దరు ఉద్యోగులకే కేసును పరిమితం చేయాలని చూస్తుందని ఆయన ఆరోపించారు. తమ పోరాటం ఫలితంగానే ఈ కేసులో ఈడీ దర్యాప్తు మొదలయిందని రేవంత్ రెడ్డి అన్నారు.

మే 9 నుంచి రెండో విడత హాత్ సే హాత్ జోడో యాత్ర, మే 9 నుంచి రెండో విడత హాత్ సే హాత్ జోడో యాత్ర ఉంటుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. జోగులాంబ జిల్లా నుంచి యాత్ర ప్రారంభమవుతుంది అని ఆయన తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular