Saturday, July 27, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంకృత్రిమ మేధ వికృత గీతం

కృత్రిమ మేధ వికృత గీతం

పనీపాట లేకుండా పాట పుట్టదు. పనితోపాటే పాట పుట్టింది. పనిని మరిచిపోవడానికి పాట పుట్టింది. పనిలో శ్రమను తగ్గించడానికి పాట పుట్టింది. పనిని గుర్తు చేయడానికి పాట పుట్టింది. మాట మాట్లాడలేక మౌనమైనప్పుడు పాట పెదవి విప్పింది. గుండె గొంతుకలో వేదన సుడులు తిరిగితే మౌన రోదనగా పాట పుట్టింది. ఆనందం అర్ణవమైతే మనసుకు రెక్కలొచ్చి పాట పుట్టింది. పుడితే ఉయ్యాల పాటనుండి పోతే మొయ్యాల్సిన పాటదాకా బతుకంతా పాటే.

ఆదికవి వాల్మీకి మహర్షి రామాయణాన్ని తంత్రీవాద్య సమన్వితంగా పాడుకోవడానికి వీలుగా రాసినట్లు స్వయంగా ఆయనే చెప్పుకున్నాడు. ఎలా పాడాలో ఆశ్రమంలో మొదట లవకుశులకే నేర్పాడు. ఆ రామగీతాన్ని తొలిశ్రోతగా తానే విని పరవశించి, తృప్తిగా లవకుశుల ముఖతః లోకానికి వినిపించాడు. వచనం ఎంత గొప్పదయినా గుర్తు పెట్టుకోవడం అంత సులభం కాదు. వచనాన్ని రాగంతో పాడడం చాలా కష్టం. శ్లోకం, పద్యం, పాటలో నియతి ఉంటుంది. రాగం ఉంటుంది. యతిప్రాసలు ఉంటాయి. ఛందస్సు, అలంకారాలు ఉంటాయి. రాగం తోడయిన పదం అనురాగమై వెంటపడుతుంది. ఒక తూగులో, లయలో ఆ సాహిత్యం వచనం కంటే పదికాలాలపాటు గుర్తుంటుంది. వచనం కంటే సాంద్రమై నెమరువేతకు సులభమవుతుంది. పాట శ్లోకం, పద్యంగా పరిణమించింది. పాటంటే తెలుగులో సినిమా పాటలే అన్నంతగా వ్యాప్తి పొందింది. ఆ పాటల పూదోటలకు ఘంటసాల ఒక తోటమాలి. శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం మరొక తోటమాలి.

బాలు జీవితకాలం డెబ్బయ్ నాలుగేళ్లు. ఇరవై ఏళ్ల వయసులో పాడడం మొదలు పెట్టి నలభై వేల పాటలు పాడాడు. నలభై వేలను యాభైనాలుగేళ్ళతో భాగిస్తే సంవత్సరానికి ఏడు వందల నలభై పాటలు. అంటే నెలకు అరవై రెండు పాటలు. సగటున రోజుకు రెండు పాటలు పాడినట్లు. ఒక మనిషికి ఇది సాధ్యమేనా? బాలుకు మాత్రమే సాధ్యం.

అతిపరిచయం వల్ల చెప్పడానికి ఏమీ మిగిలి ఉండదు. అలా బాలసుబ్రహ్మణ్యం గురించి, ఆయన పాటల గురించి తెలియనిదెవరికి? ఇప్పుడు కొత్తగా చెప్పాల్సింది ఏముంది? గొప్పగా పాడాడు. కష్టమయినవి పాడాడు. సులభంగా పాడాడు. సున్నితంగా పాడాడు. సంప్రదాయం ఒడిసిపట్టుకుని పాడాడు. స్పష్టంగా పాడాడు. తెలుగును తెలుగులా పలికాడు. అక్షరాన్ని మింగేయకుండా పాడాడు. ఊపిరి బిగబట్టి పాడాడు.

దిక్కరీన్ద్ర జిత హిమగిరీన్ద్ర సిత కందరా నీలకంధరా
క్షుద్రులెరుగని రుద్రవీణ నిర్నిద్రగానమిది అవధరించరా విని తరించరా! అన్నాడు.

ఏ దివిలో విరిసిన పారిజాతమో!
ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో!
నా మదిలో నీవై నిండిపోయెనే! అన్నాడు.

పారేసుకోవాలనారేసుకున్నావు..
నీ ఎత్తు తెలిపింది కొండగాలీ.. అన్నాడు.

ఎక్కడ మొదలు పెట్టి ఎక్కడ ముగిస్తే బాలు పాటల చరిత్ర పూర్తవుతుంది? తెలుగుపాట అప్పుడు ఘంటసాలను కోరుకుంది. ఆయన పోతూ పోతూ ఆ పాటను బాలు చేతిలో పెట్టి వెళ్లాడు. బాలు పోతూ పోతూ ఆ పాటను ఎవరిచేతిలో పెట్టాలో తెలియక వెళ్లిపోయాడు. అయినా పిల్లి పిల్లకు పెళ్లి చేసి, పెళ్లీడు పిల్లకు పెల్లి చేసే నేటితరం గాయకులకు, శ ష స అన్నవి దేనికవిగా విడి విడి అక్షరాలని తెలియని గాయకులకు, ఉండిపోరాదే అని అనలేక ఉం డిప్పోరాదే – గుండెనీదేలే, గుండె కేనన్నే … అని భాషోచ్చారణ తెలియని పరభాషా పరవశ గాయకులకు తెలుగు చెప్పడం హత్యానేరంతో సమానం.

పాటంటే నిజానికి ఒక పల్లవి. రెండు చరణాలే. కానీ మాటలు చెప్పలేని భావమేదో పాటలు చెప్పాలి. పాటలో ఒక్కొక్క మాట వేనవేల మాటలుగా ప్రతిధ్వనించాలి. ప్రతిపదం భావార్థంగా ప్రతిఫలించాలి. అలా బతుకంతా పాటలతో ప్రతిధ్వనించి, పాటగా ప్రతిఫలించిన బాలుగురించి మాటల్లో చెప్పడం కష్టం. ఆయన పాటలు వినడం సులభం. మనకు పాటల కర్ణామృతాన్ని పంచడానికి ఆయన ఎంత గరళం గొంతులో దాచుకున్నాడో?

పాలనేత్ర సంప్రభవ జ్వాలలు ప్రసవశరుని దహియించగా..
పతిని కోలుపడి రతీదేవి దుఃఖితమతియై రోదించగా..
హిమగిరీంద్ర శిఖరాగ్ర తాండవత్ ప్రమథ గణము కనిపించగా..
ప్రమథనాథ కర పంకజ భాంకృత డమరు ధ్వని వినిపించగా
ప్రళయకాల సంకలిత భయంకర
జలధరార్భటుల చలిత దిక్కటుల చకిత ధిక్కరుల వికృత ఘీంకృతుల
సహస్ర ఫణ సంచలిత పూర్కృతుల
కనులలోన.. కనుబొమలలోన… అధరమ్ములోన.. వదనమ్ములోన..
గళసీమలోన.. కటిసీమలోన.. కరయుగములోన.. పదయుగములోన…
నీ తనువులోని అణువణువులోన ..అనంత విధముల అభినయించి ఇక ఆడవే….ఆడవే.. ఆడవే…”
అని బాలు అంటే సి నా రె సృష్టించిన నాట్య మయూరే ఆడలేను…ఆడలేను…ఆడలేను…అని కాళ్లు కట్టేసుకుని కూర్చుంది. ఇక మనమెంత?

అనగల రాగమై తొలుత వీనులలరించి
అనలేని రాగమై మరలా వినిపించీ.. మరులే కురిపించీ
జీవన రాగమై.. బృందావన గీతమై
కన్నెల కన్నుల కలువల వెన్నెల దోచిన మురళి
ఇదేనా.. ఇదేనా ఆ మురళీ?
అవును- అదే బాలు మురళి.
అవును- అదే బాలు పాటల రవళి.

రాగాలనంతాలు.. నీ వేయి రూపాలు..
నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపాన మధిరోహణము సేయు గీతాలు
దొరకునా ఇటువంటి సేవ?
దొరకునా ఇటువంటి బాలు?

అలాంటి బాలు దొరకడని తెలిసి…ఈమధ్య “కీడా కోలా” సినిమాలో కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్- ఏ.ఐ.) ఉపయోగించి అచ్చంగా బాలు గొంతును కృత్రిమంగా సృష్టించి ఒక పాటను జనం మీదికి వదిలారు. పాటలో భావం, సాహిత్యం అంతే కృతకంగా ఉన్నాయి కాబట్టి…ఆ పాట పెద్దగా వ్యాప్తి పొందలేదు. ఎంత చెత్త గొంతుతో ఎవరు ఎలా పాడినా.. ఇలా ఏ.ఐ. సాఫ్ట్ వేర్ తో బాలు పాడినట్లే మార్చుకోవచ్చు. దీనిమీద బాలసుబ్రహణ్యం కుమారుడు, గాయకుడు చరణ్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆ సినిమా వారికి లీగల్ నోటీసులు పంపారు. సినిమావారి స్పందనేమిటో ఇంకా తెలియదు. ఆ పాటను తొలగించి, క్షమాపణలు చెబితే హుందాగా ఉంటుంది.

భవిష్యత్తులో ఏ.ఐ. తెచ్చి పెట్టే చిక్కులకు ఇదొక ఉదాహరణ. సాంకేతిక వెసులుబాటు ఉపయోగించుకోవడంలో సౌలభ్యాల సంగతి పక్కనపెడితే ఇది నైతికంగా సమర్థనీయం కాదు. న్యాయపరంగా కూడా కొన్ని కట్టుబాట్లు చేయకపోతే…ఘంటసాల, బాలసుబ్రహ్మణ్యం, వాణీజయరాం, లతామంగేష్కర్ లు స్వర్గం నుండి దిగివచ్చి …రోజూ కుర్చీలను మడతపెట్టే ఆధునిక గీతాలను ఏ.ఐ. మీడియా ద్వారా మనకు వినిపిస్తూ ఉంటారు.

అప్పుడు- ఆ అవమానం వారిది కాదు. యుక్తాయుక్త విచక్షణ కోల్పోయిన మనది. వారు పాడని పాటలను వారి నోట్లోకి కుక్కే అధికారం మనకు లేదుగాక లేదు.

దమ్ముంటే…చేతనయితే…మరో ఘంటసాలలాంటి, మరో బాలసుబ్రహ్మణ్యం లాంటి లేదా అంతకంటే గొప్ప గొంతులను తయారు చేసుకోవాలి. రేప్పొద్దున అశుద్ధం పాడి…ఏ. ఐ. యంత్రంలో దానికి వారి గొంతును ఇలాగే అతికిస్తే?

ఇదేనా మన జాతి సంపద అనుకునే గానగంధర్వులకు మనమిచ్చే గౌరవం?

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

పమిడికాల్వ మధుసూదన్ విశ్లేషణల కోసం ఫాలో అవ్వండి

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్