Sunday, June 7, 2026
HomeTrending Newsఅమరావతి యాత్రకు హైకోర్టు ఓకే

అమరావతి యాత్రకు హైకోర్టు ఓకే

Ap High Court Granted Permission For Amaravathi Maha Pada Yatra :

అమరావతి పరిరక్షణ సమితి అధ్వర్యంలో తలపెట్టిన మహా పాదయాత్రకు ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు అనుమతి మంజూరు చేసింది.  అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ నవంబర్ 1 వ తేదీ నుంచి డిసెంబర్ డిసెంబర్ 17 వరకూ  ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు’ అనే నినాదంతో హైకోర్టు నుంచి తిరుమల శ్రీవారి ఆలయం వరకూ మహా పాదయాత్ర చేయాలని అమరావతి రైతులు నిర్ణయించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని, ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉందని పాదయాత్రకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. అమరావతి జెఎసి నేతలకు డిజిపి లేఖ కూడా రాశారు. అయితే దీనిపై జెఎసి రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.

పాదయాత్రకు అనుమతి ఇస్తే తలెత్తే ఇబ్బంది ఏమిటని హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కొంతమంది యాత్రపై రాళ్ళు రువ్వే ప్రమాదం ఉందని, శాంతి భద్రతల సమస్య వస్తుందని ప్రభుత్వం తరఫు లాయర్ కోర్టు దృష్టికి తీసుకు వెళ్ళారు. పాదయాత్రకు అనుమతి నిరాకరిస్తూ పోలీసు శాఖ ఇచ్చిన నోటీసులో సహేతుకమైన కారణాలు వెల్లడించలేదని జెఎసి తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. రైతులు శాంతియుతంగా పాదయాత్ర చేస్తారని హామీ ఇచ్చారు.

ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం యాత్రకు అనుమతి మంజూరు చేసింది. పాదయాత్రకు తగిన భద్రత కల్పించాలని డిజిపిని ఆదేశించింది. డిజే వాడొద్దని, హ్యాండ్ మైక్ లు మాత్రమే వాడాలని స్పష్టం చేసింది.

Must Read :పునరాలోచన చేయండి: లక్షీనారాయణ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular