పాఠశాలల్లో సబ్జెక్టుల వారీగా టీచర్లు ఉండేలా చూసుకోవాలని, దీని ద్వారా బోధనలో నాణ్యత, విద్యార్థుల అభ్యాసం కూడా మెరుగుపడుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. డీఎస్సీ 98 అభ్యర్థులకు పోస్టింగులు త్వరగా ఇవ్వాలని ఆదేశించారు. పాఠశాల విద్యాశాఖపై క్యాంపు కార్యాలయంలో సిఎం జగన్ సమీక్ష నిర్వహంచారు. తరగతి గదుల డిజిటలైజేషన్లో భాగంగా ఏర్పాటు చేస్తోన్న ఐఎఫ్పి ప్యానెల్స్ వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం అయ్యే నాటికి పూర్తి కావాలని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు పంపిణీ పూర్తయిందని, ట్యాబుల నిర్వహణకు సంబంధించి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సర్వీస్ సెంటర్ను కంపెనీ ద్వారా ఏర్పాటు చేస్తున్నామని అధికారులు సమావేశంలో తెలిపారు.
సమీక్ష సందర్భంగా సిఎం చేసిన ముఖ్య సూచనలు:
- డిజిటల్ స్క్రీన్ల ద్వారా విద్యార్థులకు అత్యుత్తమ బోధన అందాలి, బోధన ఎలా చేయాలో టీచర్లకు చక్కటి అవగాహన, శిక్షణ కల్పించాలి
- పిల్లలు అందరివద్దా డిక్షనరీలు ఉన్నాయా? లేవా? మరోసారి పరిశీలన చేయాలి, లేని వారికి అందించాలి.
- వచ్చే విద్యా సంవత్సరం విద్యాకానుక కోసం అన్నిరకాల ఏర్పాట్లు చేసుకోవాలి, స్కూళ్ళ ప్రారంభం రోజునే అందజేయాలి
- గోరుముద్ద నాణ్యతను నిరంతర పరిశీలన చేయాలి, అన్ని స్కూళ్లు, అంగన్వాడీలకు సార్టెక్స్ ఫోర్టిఫైడ్ బియ్యం మాత్రమే సరఫరా చేయాలి
- పిబ్రవరి 1వ తేదీ నుంచి ఇప్పుడు ఇస్తున్న ఆహారానికి అదనంగా స్కూలు పిల్లలకు బెల్లంతో రాగి మాల్ట్ ఇవ్వాలి
- వారానికి మూడురోజులు పిల్లలకు గ్లాసుడు రాగిమాల్ట్. ఐరన్, కాల్షియం లోపం నివారణకు ఇది ఉపయోగపడుతుంది
- నాడు – నేడు కింద బాగుచేసిన పాఠశాలల్లో సౌకర్యాల నిర్వహణపై నిరంతర పరిశీలన ఉండాలి
- ఎస్ఎంఎఫ్, టీఎంఎఫ్ నిధులను వినియోగించుకుని ఏ సమస్య వచ్చినా వెంటనే మరమ్మతులు చేపట్టాలి
- నాడు –నేడు రెండో దశ పనులనూ సమీక్షించిన సీఎం
- 22 వేలకుపైగా స్కూళ్లలో పనులు నడుస్తున్నాయన్న అధికారులు.
- దాదాపు రూ.1500 కోట్లు విలువైన పనులు ఇప్పటికే జరుగుతున్నాయన్న అధికారులు.
ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, గృహనిర్మాణ, గ్రామ వార్డు సచివాలయాలశాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, విద్యాశాఖ సలహాదారు ఏ సాంబశివారెడ్డి, ఇంటర్ మీడియట్ విద్య కమిషనర్ ఎం వీ శేషగిరిబాబు, పాఠశాల మౌలిక వసతులు కల్పన కమిషనర్ కాటమనేని భాస్కర్, పౌరసరఫరాలశాఖ కమిషనర్ జీ వీరపాండ్యన్, మిడ్ డే మీల్స్ డైరెక్టర్ నిధి మీనా, నాడు నేడు డైరెక్టర్ (టెక్నికల్) మనోహర్ రెడ్డి
మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ డాక్టర్ ఏ సిరి, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ (పాఠశాల విద్యాశాఖ) ప్రతాప్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.