Wednesday, September 25, 2024
HomeTrending Newsడెడ్ లైన్ ఎందుకు పెట్టారు: దేవినేని ప్రశ్న

డెడ్ లైన్ ఎందుకు పెట్టారు: దేవినేని ప్రశ్న

Polavaram Row: పోలవరం ప్రాజెక్టుపై ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని, చేతిలో కాగితం కూడా లేకుండా వస్తానని మాజీ మంత్రి దేవినేని ఉమా సవాల్ విసిరారు. డ్యామ్  సైట్ కైనా, తాడేపల్లి రాజ ప్రాసాదానికైనా వస్తానని వ్యాఖ్యానించారు.  పోలవరంపై  మంత్రి రాంబాబు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, ఆయన చెబుతున్న దానిలో సరుకు లేదు, సబ్జెక్టు లేదని  విమర్శించారు.  పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు చంద్రబాబు లేఖ రాయడంపై అంబటి రాంబాబు చేసిన విమర్శలను ఉమా తిప్పి కొట్టారు. డయా ఫ్రమ్  వాల్ దెబ్బతిన్న విషయం తెలిసిన తరువాత ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామంటూ డెడ్ లైన్లు ఎలా పెడతారని ఉమా ప్రశ్నించారు. ప్రాజెక్టు ఎత్తు రెండు మూడు అడుగులు తగ్గించేందుకు ఏపీ ప్రభుత్వం అంగీకరించిందని సాక్షాత్తూ తెలంగాణా ముఖ్యమంత్రి కేసిఆర్ ఈ రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా చెబితే తానిపై మన సిఎం ఎందుకు స్పందించలేదని ఉమా నిలదీశారు.

డయాఫ్రమ్ వాల్ ను తాము ప్రపంచంలోనే సుప్రసిద్ధ కంపెనీలతో ఎంతో జాగ్రత్తగా నిర్మింపజేశామని, ఈ ప్రభుత్వం రాగానే దాన్ని నిర్లక్ష్యం చేయడంవల్లే ఈ పరిస్థితి దాపురించిందన్నారు  దేవినేని.  50లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే ఈ ప్రాజెక్టును  జాతి గర్వపడే విధంగా ఎంతో  కష్టపడి 71శాతం పనులు పూర్తి చేస్తే… జగన్ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ పేరుతో దాన్ని నాశనం చేశారని ఉమా మండిపడ్డారు.  ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ 37 నెలల్లో ఎంతమేర పనులు పూర్తి చేశారో,  కేంద్రంనుంచి ఎన్ని కోట్ల రూపాయలు వచ్చాయో,  రాష్ట్రం నుంచి ఎంత ఖర్చు పెట్టారో వివరాలు చెప్పడం లేదని ధ్వజమెత్తారు.

గత ప్రభుత్వ హయాంలో తాము ఖర్చు పెట్టిన దానిలో నాలుగు వేల కోట్ల రూపాయలు కేంద్రం విడుదల చేస్తే ఈ ప్రభుత్వం వాటిని పోలవరం నిర్వాసితులకు, డ్యామ్ కోసం  ఖర్చు పెట్టకుండా  లిక్కర్ కంపెనీలకు అడ్వాన్సులు ఇవ్వడానికి వినియోగించడం దారుణమన్నారు.   కమీషన్ల కక్కుర్తి కోసం,  పవర్ ప్రాజెక్ట్ కొట్టేయాలనే దుర్బుద్ధితో పోలవరం ప్రాజెక్టు పనులను పడుకోబెట్టారని ఘాటుగా విమర్శించారు.

Also Read : పోలవరం పూర్తి చేయండి: షెకావత్ కు బాబు లేఖ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్