Friday, March 29, 2024
HomeTrending Newsఅంతరిక్షంలోకి నానో సాటిలైట్స్ - సిఎం కెసిఆర్ హర్షం

అంతరిక్షంలోకి నానో సాటిలైట్స్ – సిఎం కెసిఆర్ హర్షం

తెలంగాణకు చెందిన ‘ధృవ’ స్పేస్ టెక్ ప్రయివేట్ సంస్థ ద్వారా, శనివారం శ్రీహరికోట నుంచి ప్రయోగించబడిన రెండు నానో సాటిలైట్స్ విజయవంతంగా అంతరిక్ష కక్షలోకి ప్రవేశించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు.
ఇస్రో కు చెందిన ‘‘ పిఎస్ ఎల్ వీ -సి 54 ’’ తో పాటుగా హైద్రాబాద్ స్టార్టప్ కంపెనీ ధృవ’ స్టార్టప్ సంస్థ పంపిన ‘‘తై బోల్ట్ 1 మరియు తై బోల్ట్ 2’’ అనే రెండు నానో ఉప గ్రహాల ప్రయోగం విజయవంతం కావడం దేశ ఔత్సాహిక అంకుర సంస్థల చరిత్రలో సుదినంగా సిఎం పేర్కొన్నారు. ప్రయివేటు రంగం ద్వారా ఉప గ్రహ ప్రయోగాల చరిత్రలో మరో గొప్ప విజయం అన్నారు. టిహబ్ సభ్య సంస్థ అయిన, స్కైరూట్’ స్టాటప్ కంపెనీ ఇటీవలే ప్రయోగించిన ‘‘ విక్రమ్ –ఎస్ ’’ సాటిలైట్ విజయవంతం కావడం ద్వారా దేశ ఉప గ్రహ ప్రయోగాల చరిత్రలో తెలంగాణ స్టాటప్ కంపెనీ మొట్ట మొదటి సంస్థగా చరిత్రను లిఖించిందని సిఎం అన్నారు.
ఈ ప్రయోగాలతో భారత అంతరిక్షరంగంలో హైద్రాబాద్ అంకుర సంస్థలు ద్వారాలు తెరిచాయని సీఎం అన్నారు. ప్రపంచ స్పేస్ ఎకానమీలో భారత్ వాటాను పెంచేందుకు ఉద్దేశించిన ప్రైవేట్ రాకెట్ల ప్రయోగానికి మొన్నటి “విక్రమ్ ఎస్” నేటి ‘‘తై బోల్ట్ 1 మరియు తై బోల్ట్ 2’’ ప్రయోగాల విజయం శుభారంభాన్ని ఇచ్చిందని సీఎం అన్నారు. విజయం సాధించిన ఈ రెండు ఉప గ్రహ ప్రయోగాలు తెలంగాణ కీర్తిని దిగంతాలకు చాటాయన్నారు.
ఈ ఉప గ్రహ ప్రయోగాల ద్వారా స్టార్టప్స్ సిటీగా హైదరాబాద్ కున్న విశిష్టత రెట్టించిందని సీఎం అన్నారు. ఔత్సాహికుల ప్రతిభను వెలికితేయడం, పరిశ్రములు,శాస్త్ర సాంకేతిక సమాచార రంగాల్లో అవకాశాల సృష్టే లక్ష్యంగా ప్రారంభించిన టి హబ్ లు భవిష్యత్తులో మరెన్నో మైలురాళ్ళు సాధిస్తాయనే నమ్మకం తనకుందని, ఇది ఆరంభం మాత్రమేనని సీఎం పేర్కొన్నారు.
టి హబ్ ప్రోత్సాహంతో, తమ స్టార్టప్ సంస్థల ద్వారా ఉప గ్రహాలను రూపొందించి వాటిని విజయవంతంగా ప్రయోగించి తెలంగాణ కీర్తిని చాటిన ‘స్కైరూట్’ మరియు ‘ధృవ’ స్పేస్ స్టాటప్ సంస్థల ప్రతినిధులకు సిఎం కెసిఆర్ శుభాకాంక్షలను తెలిపి అభినందించారు. ఇదే స్పూర్తితో తెలంగాణ యువత తమ మేధో సంపదను దేశ ప్రగతికోసం వెచ్చించి భారత దేశ అభివృద్ధి కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. తమ ప్రతిభను ప్రపంచానికి చాటుతూ భారత దేశ కీర్తిని ఇనుమడింపచేసే యువతీ యువకులకు వారి అద్భుతమైన ఆలోచనకు తమ అంకుర సంస్థల ద్వారా కార్యరూపమిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా నిలుస్తుందని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. శాస్త్ర సాంకేతిక ఐటి రంగాల్లో ఔత్సాహికులైన యువతీ యువకుల ప్రతిభను వెలికితీసేందుకు కృషి చేస్తున్న యువనేత, ఐటి పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావును, ఉన్నతాధికారులను టిహబ్ సిబ్బందిని సిఎం కెసిఆర్ ఈ సందర్భంగా అభినందించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్